నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, June 29, 2010

కళాపూర్ణోదయం లో వున్నది కేవలం ' బూతే' నా?


ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అభిమానించి ఆదరించేవారందరిని ఇవాళ ఈ ప్రశ్న తొలిచివేస్తోంది. కారణం యోగి వేమన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వినోదిని జూన్ 28 సోమవారం ఆంధ్రజ్యోతి వివిధ లో రాసిన వ్యాసం “ క్లాస్ రూమ్ లో కళా ‘పోర్నో’ దయమ్!-” లో అశ్లీల కావ్యాలను సిలబస్ గా పెట్టొచ్చా? అంటూ సంధించిన ప్రశ్నలు. ( మూల వ్యాసాన్ని ఇక్కడ చదవొచ్చు)."

అసలీ కథకు పాఠ్యాంశం గా వుండే అర్హత ఏమిటి? కామోద్దీపనకు తప్ప జ్నానానికి ఏ మాత్రం ఉపయోగపడని కావ్యం ఇది.స్త్రీలను కించపరిచే, స్త్రీ వ్యతిరేకమైన అంశాలు, నడవడికనిసూచించే అంశాలు, భార్యగా స్త్రీ భర్తకు దాసిలా వుండాల్సిన భార్య భర్తల సూడో సంబంధాన్ని ఈ కావ్యం ప్రబోధిస్తుంది.పెళ్ళి ని కేవలం సెక్స్ దృష్టి లొంచే ఈ కావ్యం చర్చిస్తుంది. 16 వ శతాబ్దం లో రచించిన ఈ కావ్యం లోని ఆలోచనలు భావాలు అత్యంత పురాతనమైనవి." ఇవీ కళాపూర్ణోదయం కావ్యం గురించి స్థూలంగా వ్యాస రచయిత అభిప్రాయాలు .

ప్రాచీన తెలుగు సాహిత్యం లో అధికశాతం శృంగార మయం అయినంత మాత్రాన అవి బోధనకు పనికిరావు , అందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు అనడం సరికాదు. కళాపూర్ణోదయం మీద వినోదిని చేసిన కామెంట్లు అర్ధ రహితమైనవి. శృంగారం ఎక్కువ పాళ్ళల్లో వుందనో, స్త్రీలను, కింది కులాల వారిని కించపరిచేవిధంగా వుందనో నిషేధించుకుంటూ పోతే ఇక తెలుగు సాహిత్యం లో చదవటానికి, తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, రసాస్వాదన చేయటానికి ఏమీ మిగలదు. సెన్సారింగ్ చేయబడటం లో వున్న కష్టానష్టాలు తెలిసి కూడా, ఇన్నేళ్ళ స్త్రీవాద, దళిత స్త్రీవాద ఉద్యమాల తర్వాత కూడా వినోదిని ఆ సెన్సారింగ్ కోరుకోవడం, ఆ దిశగా అడుగులు వేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశం.

ప్రాచీన తెలుగు సాహిత్యం మనకొక సాంస్కృతిక సంపద. దాన్ని గుర్తించి గౌరవించాలి.

ఒక చరిత్ర గా దాన్ని తప్పక చదువుకోవాలి కూడా. ప్రాచీన సాహిత్యాన్ని క్లాస్ లో బోధించేటప్పుడు ఇప్పటి సమాజానికి తగిన అంశాల్ని కూడా కలుపుకుంటూ ఒక రచనగా అప్పటి సాహిత్య సామాజిక అంశాల్ని చర్చించవచ్చు.అలా కాకుండా కళా పూర్ణోదయం లోని సుగాత్రి శాలీనుల శృంగారాన్ని కేవలం ఒక adultery గా ఆమె అభిప్రాయపడటం తప్పు.

" కళాపూర్ణోదయం రచన ఉద్దేశం లోనే " బూతు" వుంది. పైగా రచన మొత్తం కూడా విశృంఖల వర్ణనలతో, విచ్చలవిడి వాక్యాలతో వుంటుంది." అన్న వినోదిని ఆరోపణ కేవలం నిరాధారం. ఆమెకున్న అవగాహనారాహిత్యమనే చెప్పుకోవాలి. మొదట వినోదిని అర్ధం చేసుకోవాల్సిన అంశం రొమాన్స్ కి adultery కి వున్న తేడా. ఆలాగే 16 వ శతాబ్దం సాహిత్య, సామాజిక విలువల్ని ఇప్పటికి అన్వయించి, అంగీకరించమని ఎవరూ అడగరు. ఒక ప్రొఫెసర్ గా ఆ పని ఆమె చేయనక్కర లేదు. కళాపూర్ణోదయం లాంటి కావ్యాల్ని క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు వుండే ఇబ్బందులు అర్ధం చేసుకోదగ్గవి.అయితే అందుకు పరిష్కారం ప్రాచీన కావ్యాల నిషేధం కాదు. శృంగారం పాఠ్యాంశానికి పనికి రాదని చెప్పటం మరీ విడ్డూరం. అసలు తెలుగు ప్రాచీన కావ్యాలు , ప్రబంధాలు చదివే వారు తరం తరానికి తగ్గిపోతున్నారు, తెలుగు వాళ్ళకు తెలుగు సాహిత్యం గురించి కంటే ప్రపంచ సాహిత్యం గురించే ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని ఒక వర్గం వారు బాధ పడుతుంటే, ఇప్పుడు విశ్వ విద్యాలయ స్థాయిలో కూడాప్రబంధాలు టీచింగ్ కి పనికిరావని వినోదిని లాంటి వారిది కేవల అర్ధ రహిత వాదన.

అసలు వాస్తవానికి కళాపూర్ణోదయం కావ్యానికి తెలుగు సాహిత్యం లో వున్న విశిష్ట స్థానం ఏమిటి? వినోదిని లాగా తెలుగు సాహిత్యాన్ని అకడెమిక్ గా కూడా క్షుణ్ణంగా చదువుకున్న వారు భ్రమపడుతున్నట్లు అందులో వున్నది కేవలం శృంగారమేనా? లేక ఒక సాహిత్య సృష్టి గా అందులో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా వున్నాయా?

నేను ఎంఏ తెలుగు చేసిన విద్యార్ధిని కాదు కాబట్టి ఒక కావ్యం గా కళాపూర్ణోదయం గొప్పతనాన్ని వివరించి చెప్పలేను. అయితే నాకు అర్ధమైనంత వరకూ అదొక అద్భుత కథాకథనం. కథ ఎలా చెప్పాలి, కథ ని ఎలా నడిపించాలి? కథ లో మలుపులు ఎలా తీసుకురావాలి? లాంటి టెక్నిక్కులు తెలుసుకోవాలనుకుంటే పింగళి సూరన రాసిన కళాపూర్ణోదయం కావ్యం చదివి తీరాల్సిందే.

కళా పూర్ణోదయం కావ్యం కేవలం సుగాత్రి శాలీనుల కథ మాత్రమే కాదు. అది అందులో ఒక భాగం మాత్రమే. ఆ కథ లో పాత్రలు కేవలం ఒక కాలానికి సంబంధించినవి కావు. మూడు, నాలుగు జన్మలకు సంబంధించిన కథ. పాఠ్యపుస్తకం లో ఒక భాగం పెట్టాల్సి వస్తే ఏదో ఒక భాగం ఎంచుకోవాలి కాబట్టి సులువుగా అర్ధం కావటానికి సుగాత్రి శాలీనుల కథ పెట్టి వుంటారు. ఈ ప్రత్యేక కథ లో వినోదిని చెప్పినట్లు వారిరువురి మధ్య తొలి కలయిక కి సంబంధించిన వర్ణనలుంటాయి. అసలు ఈ కావ్యం లో శృంగార రసానికి సంబంధించి ఒక విశిష్టత వుందని చెప్తారు.. కవి నాలుగు రకాల శృంగారభావానల గురించి ఇందులో వర్ణిస్తాడు. మొదట బ్రహ్మ, సరస్వతుల మధ్య దివ్య శృంగారం. కలభాషిణి, మణికందరుల మధ్య గంధర్వ శృంగారం, సుగాత్రి, శాలీనుల మధ్య ప్రజాపత్య శృంగారం, సల్యాసురుడు, అభినవ కౌముది ల మధ్య రాక్షస శృంగారం. ఈ నాలుగు రకాల శృంగార స్వభావాల్ని సూరన తన అద్భుతమైన కథాకథన చాతుర్యం తో వర్ణించాడు.

ప్రాచీన సాహిత్యం లో చంద్రకాంతి తప్ప సూర్యకాంతి లేదన్న అపప్రధకు ఎదురు నిలబెట్టాలంటే ముందు మనకున్న అచ్చ తెనుగు ప్రబంధం కళాపూర్ణోదయం. పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం ధ్వర్ధి కావ్యాన్ని పంచ మహా కావ్యాల్లో ఒకటిగా చేశారు కానీ నాకైతే కళాపూర్ణోదయానికి ఆ గౌరవం దక్కి వుండాల్సిందనిపిస్తుంది. మిగతా ప్రబంధ కవుల్లో కనిపించని ప్రతిభా, అద్భుతమైన భావనా శక్తి, పాత్రోచిత పద్య రచనా అన్నీ ఈ కావ్యం లో కనిపిస్తాయి. ఈ కావ్య రచన ఉద్దేశం వినోదిని అభిప్రాయపడినట్లు బూతు కాదు. సూరన ఈ కావ్యానికి రాసిన సంకల్పం లోనే " సకల లక్షణ లక్షితంబైన మహా ప్రబంధం " తానెందుకూ రాశాడో చెప్పాడు. మామూలుగా ప్రబంధ కావ్యాల్లో నవరసాలు అన్నింటికి సముచిత స్థానం దక్కదు. ప్రబంధం లో ఎప్పుడూ శృంగార రసానికే ప్రాధాన్యత. కానీ సూరన తన కావ్యం లో అన్నీ రసాల్ని చూపించాలన్న పట్టుదలతో రాసిన కావ్యం కళా పూర్ణోదయం. అపూర్వ కథా సంవిధానం, కథాకథన చాతుర్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ మళ్ళీ కళాపూర్ణోదయం చదువుతూ వుండాల్సిందే.తెలుగు భాష వున్నంత వరకూ పింగళి సూరన కు , కళాపూర్ణోదయం కావ్యామ్ రెండూ సజీవం గా ప్రజల హృదయాల్లో సుస్థిరం గా నిలిచి వుంటాయనటం లో ఎలాంటి సందేహం లేదు.

కళా పూర్ణోదయం కావ్యాన్ని తేట తెలుగులో కె.వి. ఎస్. రామారావు గారు చేసిన అనువాదాన్ని ఇక్కడ చదవచ్చు.

Saturday, June 26, 2010

అనేక వాంఛలు



ఒక రాత్రి
ఒక వాంఛ
ఒక దేహం

మల్లెలు మనసై
జాజులు జావళీలై
కన్నులు కనకాంబరాలై
కలువలు కలలై
కన్రేప్పల పానుపు పై
మోహ ప్రవాహ దేహమై
దుఃఖ వస్త్రాల్ని తొలగించే
స్వప్న ధూప లతికనై

నేనే ఓ రాతిరి నై
నేనే మరో రాతిరినై
నేనే ఓ వాంఛ నై
నేనే మరో వాంఛనై
నేనే ఒక దేహాన్నై
నేనే మరో దేహాన్నై
విస్మృతావస్థనై
మెలకువ లోకి వచ్చా
***
పంచభూతాలే
పంచ ప్రాణాలే
పాంఛ భౌతికమే
ఎన్ని చెలమలో
ఎన్ని వాంఛలో!

ఒక్క రాతిరికి ఎన్ని రహస్యాలో!

స్వప్నమో
రాగమో
లీనమో
మోహామో
కోరికెప్పుడూ రాలిపడే వేకువ
వాంఛ ఎప్పుడూ వినిపించని కువకువ

ఇక రాతిరి దాచుకున్న
రహస్య జ్నాపకం ఈ దేహం!

Wednesday, June 16, 2010

నిడదవోలు మాలతి కథ-నవ్వరాదు!

కథానుభవం-6
దాదాపు మూడు నెలల విరామం తర్వాత కథానుభవం-శీర్షిక లో ఈ సారి రాస్తున్న కథ నిడదవోలు మాలతిది. మాలతి గురించి బ్లాగు లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఒక విషయం లో మాలతి గురించి పరిచయం చేయాలి. అది ఆమె రాసిన కథల గురించి.

సుమారుగా ఆరు దశాబ్దాల సాహిత్య కృషి ఆమె ది. బహుముఖాలుగా సాగే ఆమె విస్తృత సాహిత్య కృషికి దర్పణాలు ఇంగ్లీష్, తెలుగు తూలిక లు. కథ రాసినా, ఊసుపోక అంటూ నవ్విస్తూ చురకలు వేసినా, రచయతల గురించి వ్యాసాలు రాసినా, డయాస్పోరా జీవితాన్ని మొదటి సారి తెలుగు లో నవల గా చిత్రించినా ఆమె ది ఒక ప్రత్యేక దృష్టి. తెలుగుతనపు నుడికారపు భాష, ఒక అరుదైన శైలి ఆమె రచనల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పాత తరం రచయతల గురించి తనదైన శైలి లో విస్తృత పరిశోధన చేసి, ఒక్కో వ్యాసం లో ఒక డాక్టరేట్ కి కావాల్సినంత సమాచారం అందిస్తూ ముందు తరాలకు నిజంగా ఉపయోగపడే ఒక రిసెర్చ్ స్కాలర్ గా ఆమె సాహిత్య కృషి కి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది మాత్రం నిష్టూరసత్యం. చాలా మంది విమర్శకులు కొందరి సాహిత్యాన్ని పరిచయం చేసేటప్పుడు “ ఈ రచనలు విశ్వసాహిత్యం లో వుండాల్సినవి “ అని అలవోక గా రాసేస్తుంటారు. అలాంటి అతిశయపు మెచ్చుకోళ్ళు కావి ఇప్పుడు నేను మాలతి గారి గురించి రాసిన మాటలు. నిజంగా ఆమె సాహిత్య కృషి ని నేను గుర్తించి , మిగతావారు గుర్తించాల్సిన అవసరంగా చెప్పటమే ఇది. ఈ నాలుగు మాటలు కూడా ఆమె కు తెలియటం కోసం కాదు. ఈ కథానుభవం రాస్తున్న సందర్భంగా మరో సారి ఆమె సాహిత్య కృషి ని గుర్తు చేసుకోవటమే.

దాదాపు వంద కథల దాకా రాసి వుంటారేమో ఆమె. అందులోంచి ఏదో ఒక కథను ఎంపిక చేసుకొని దాని గొప్పతనం గురించి మాత్రమే రాయటం ఒక విధమైన అన్యాయమే. అయితే అసలు రాయకుండా మిగిలిపోవడం కన్నా ఒక్క కథ గురించైనా మాట్లాడటం అవసరమనుకున్నాను. ఆ ఒక్క కథ ఎంపిక మాత్రం కష్టమైంది. దాదాపుగా ఆమె కథలన్నీ నాకు ఇష్టమే. అయితే ఏ కథ ఎక్కువ ఇష్టం అంటే నేను నిద్ర లో లేపి అడిగినా చెప్పే కథలు రెండు.ఒకటి ‘ నవ్వరాదు ‘, రెండు ‘ మంచు దెబ్బ ‘. ఈ రెండు కథలు మొదటిసారి నేను ఆరేళ్ళ క్రితం చదివాను. నవ్వరాదు చదివి నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అందరిని ఆ కథ అంతగా కదిలిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే బాగా కదిలిపోయాను. ఆమె కథల గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ముందు దాని గురించే మాట్లాడటం న్యాయం.అందుకే ఈ సారి కథానుభవం లో ఆ కథ గురించి ....

హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఈ లోకం అనే సర్కస్ లో కామెడీ క్వీన్ లా వుండే అమ్మాయి కమలిని జీవితం పాతికేళ్ళకే ముగిసిన కథ ఇది. నవ్వే ఆడపిల్లల జీవితం లోని వైరుధ్యం ఈ కథలో కనిపించినంతగా ఇంకెక్కడా కనిపించదేమో..ఆడపిల్లల్ని నవ్వొద్దు నవ్వొద్దు అంటారు తప్ప హాయిగా స్వేచ్ఛగా, పరవళ్లు తోక్కే నది లా నవ్వే అదృష్టం అందరికీ వుండదు. ఆ నవ్వు ఎల్లకాలం అందరి జీవితం లో చివరి వరకూ వుండదు.

కమలిని పువ్వు పూసినంత స్వేచ్ఛగా నవ్వగలిగిన అమ్మాయి. పెళ్ళి చేయాలి కాబట్టి చదువుకోనివ్వని తల్లితండ్రులు, పెళ్ళి కాకపోవడం తో అన్న వదినలకోసం ఇంటి చాకిరీకి పరిమితమై పోవడం, ఎప్పటికో పెళ్ళి అయినా కడుపు నిండా నాలుగు మెతుకులు కూడా పెట్టని అత్తింటివారు ..ఇలాంటి జీవితం చాలు ఓ ఆడపిల్ల హృదయపు లోతుల్లోంచి వచ్చే నవ్వు ని పెదాల మీదకు రానివ్వకుండా మర్చిపోవటానికి. మనం ఏడ్చినా, నవ్వినా ఒకటే అన్న నిర్ణయానికి రావటానికి. అత్తింటివారు కడుపు నిండా అన్నం పెట్టకపోతే స్నేహితురాలికి తన కష్టాలు చెప్పుకోకుండా మనుష్యుల్ని స్టడీ చేయడానికి నాకింత మంచి అవకాశం దొరుకుందనుకోలేదే అని తన హాస్యం చాటున తన కన్నీళ్ళను కప్పెట్టుకొని మనల్ని ఏడిపిస్తుంది.

ఇలాంటి విషమ పరిస్థితుల్లో చావు దగ్గరకొస్తున్నా , “ యముడు ఎన్టీ రామారావు లా వుంటాడా? ఎస్వీ రంగారావు లా వుంటాడా? ఎవరి వెనక పడితే వారి వెనక పోలేను కదా” అని స్నేహితురాలి తో కమలిని హాస్యమాడుతుంది. ఆమె చావు గురించి మాట్లాడుతుంటే బాధతో స్నేహితురాలు సరస్వతి, చిన్నప్పటి నుంచి కమలిని ని ఎరిగున్నది కూడా , నువ్వలా నవ్వకే నాకు భయమేస్తోంది అంటుంది. నువ్వు కూడా నవ్వొద్దనే అంటావా సరసూ అని విషాదం గా అడిగే కమలిని ప్రశ్న నవ్వుల్ని పోగొట్టుకున్న ఎందరో స్త్రీలు అడుగుతున్న ప్రశ్న గా అనిపిస్తుంది. నేనెప్పటికీ మర్చిపోలేని పాత్ర కమలిని.

ఈ కథ 1968 లో ప్రచురితమైంది. ఈ కథ లోని పరిస్థితులు యథాతథంగా ఇప్పుడు వుండకపోవచ్చు. నవ్వుతూ సరదాగా వున్న అందరి ఆడపిల్లల జీవితాలు అన్నీ ఇలా విషాదంగా అర్ధాంతరం గా ముగిసిపోవటం లేదు. సన్నివేశాలు మారినా ఇప్పటికీ కొందరి స్త్రీల జీవితాలు అసలేప్పుడూ తనివితీరా నవ్వకుండానే, నవ్వే అవకాశం కూడా లేకుండానే ముగిసిపోతుంటాయి.

మాలతి గారి కథల పుస్తకం “ నిజానికి –ఫెమినిజానికి మధ్య” లో మొదటి కథ ఇది.
యీ కథ ఇక్కడ చదవండి.

Friday, June 11, 2010

ఈ దుర్యోధన, దుశ్శాసన దుర్వీనీత లోకం లో.....


రకరకాల హడావిడులతో దాదాపు నెలన్నర రోజులుగా పేపర్లు, బ్లాగ్ లు ( దాదాపుగా) అన్నింటికి కొంత దూరంగా వుండి హఠాత్తుగా ఇవాళ బుద్ధి పొరపాటై పేపర్లు ఓపెన్ చేసి చూస్తే ఏముంది?

ప్రపంచం మారుతోంది, మారుతోంది అభివృద్ధి దిశగా సాగుతోంది లాంటి వూకదంపుడు ఉపన్యాసాలు విని విని తుప్పెక్కిపోయిన చెవులు, కళ్ళు ఒక్కసారి ఇలాటి సందర్భాల్లో తెరుచుకొని తీవ్ర ఆవేశాన్ని, కోపాన్ని తెచ్చిపెడతాయి. పేదవాడి కోపం లాగా మనంలాంటి మామూలు వాళ్ళ కోపాలు మనకే చేటు అనుకోండి.

నాకు కోపం, అసహ్యం లాంటి అనేకానేక ఫీలింగ్స్ తెచ్చిపెట్టిన రెండు వార్తలు ఇవీ...

పోలీసులు, రాజకీయ నాయకులు ఇద్దరినీ కలిపో, విడివిడిగానో తిట్టడానికి , మామూలుగా కాదు, బాగా తిట్టడానికి నాకు కొన్ని కొత్త తిట్లు, కొత్త బూతుభాష కావాలనిపించింది. మగవాళ్లను తిట్టడానికి కూడా పరోక్షంగా ఆడవాళ్ళనే టార్గెట్ చేసి తిట్టే బాస్టర్డ్స్, లంజముండ లాంటి తిట్లు కాకుండా ఎవరైనా కొత్త తిట్లను,బూతుల్ని కనిపెడితే బావుండు. వొట్టి పనికిమాలిన వెధవలు లాంటివి, జంధ్యాల లాంటి హాస్యపూరిత తిట్లు వీళ్లకు పనికిరావు. ఇంకొంచెం స్ట్రాంగ్ గా కావాలి. ఎవరికైనా తడితే చెప్పండి.

మొదటి వార్తా కథనం : డేట్ లైన్ : భారతదేశం ( సోర్స్ : ఆంధ్ర జ్యోతి)

పోలీసు వ్యవస్థ మన దేశం లో ఇంకా ఇలాగే ప్రవర్తిస్తోందని వార్తాకథనాలు చదివినప్పుడల్లా రక్తం కుతకుత ఉడికిపోతుంటుంది. ఇలాంటప్పుడు మాత్రం ఇలాంటి వెధవల్ని ముందు ఎవరైనా కాల్చి పడేస్తే బావుండు అని హింసను ప్రోత్సహించాలనిపిస్తుంది, తప్పని తెలిసినా.....

కొడుకు ముందే తల్లి బట్టలూడదీయించి..
ఢిల్లీ ఠాణాలో దారుణం


న్యూఢిల్లీ: పోలీసు కర్కశత్వానికి ఇది పరాకాష్ఠ... 12 ఏళ్ల కొడుకు ముందే ఓ తల్లిని బట్టలు విప్పాలని ఆ బాలుడితోనే శృంగారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. పశ్చిమ ఢిల్లీ పోలీస్ పోస్టు వద్ద పోలీసు అధికారులు తనను బట్టలు విప్పాలని బలవంతం చేశారంటూ మాయాపురి బస్తీ నివాసి మయూరి (పేరు మార్చాం) ఆరోపించింది.

దొంగతనం కేసులో పట్టుబడిన తన కుమారులు ఇద్దరిని విడిపించుకునేందుకు ఆమె తన భర్తతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లింది. 'మా ఇద్దరినీ ఒక గదిలోకి తీసుకెళ్లారు. ఆతర్వాత ఓ కానిస్టేబుల్ వచ్చి నా భర్తను, చిన్న కుమారుడిని బయటికి పంపి, తర్వాత నన్ను, నా కుమారుడిని ప్రశ్నించడం మొదలుపెట్టారు' అని ఆమె వివరించింది. అయితే, వారు నేరారోపణను అంగీకరించలేదు.

'ఓ కానిస్టేబుల్ నన్ను బట్టలూడదీయాలని ఆదేశించాడు. అందుకు నిరాకరిం చడంతో నన్ను కొట్టి బలవంతంగా బట్టలు విప్పించారు. మరో పోలీస్ నా కొడుకుతో శృంగారం చేయమన్నాడు. నేను వద్దని వేడుకోవడంతో తనతో శృంగారంలో పాల్గొనమన్నాడు. మేమిద్దం ఏడుస్తూ బతిమలాడాం' అని చెప్పింది. దీనిపై పోలీసు కమిషనర్‌కు ఆమె ఫిర్యాదు చేయడంతో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
రెండో వార్తా కథనం: డేట్ లైన్ : వాషింగ్టన్

నిక్కీ హేలీ పై సరికొత్త దుమారం!

http://www.time.com/time/politics/article/0,8599,1995597,00.html?xid=rss-topstories

సౌత్ కెరొలినా గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా నిక్కీ హేలీ చరిత్ర తొలి భారతీయ సంతతి మహిళగా చరిత్ర సృష్టించబోతొందని ఎదురుచూస్తుంటే ప్రత్యర్ధులు ఆమెపై వ్యక్తిగత అంశాలతో, ముఖ్యంగా శీలానికి సంబంధించి బురద జల్లే ఆరోపణలు చేయడం చూస్తుంటే రాజకీయాలు అంటేనే బురద బురద అని మరోసారి అర్ధమవుతోంది. రాజకీయాల్లో స్త్రీలు, పురుషులు అని తేడా ఏమీ లేదు.ఎవరిమీదైనా సరే, ప్రత్యర్ధులకు ముందు దొరికే అంశం శీలం. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఆడవాళ్ళని మానసికంగానైనా, శారీరకంగానైనా,ఇంకేరకంగానైనా ఎదురుదెబ్బ తీయాలనుకుంటే ముందు జల్లే బురద వారి వ్యక్తిత్వం పై, వారి శీలం పై.
నిక్కీ హేలీ కి ఇద్దరు భర్తలని మొదట్లో ఒక దుమారం లేవదీశారు. ఇప్పుడేమో ఆమె సన్నిహిత స్నేహితుడు బయటకు వచ్చి మేమిద్దరూ ఒక రాత్రి హోటల్ లో గడిపాం అని స్టేట్ మెంట్ ఇచ్చాడట...సో, వ్హాట్! అనాలనిపిస్తుంది నాకైతే...కాకపోతే ఎవరూ నా అభిప్రాయం అడగలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నానన్నమాట....

Tuesday, June 01, 2010

అతితెలివి పెళ్ళికొడుకు



తాతయ్య చెప్పిన కథ ని మనకు చెప్తున్నవారు శ్రీలలిత

చిన్నప్పుడు రోజూ రాత్రి మా తాతయ్యగారు మాకు కథలు చెపుతుండేవారు. ప్రతి కథ లోనూ ఒక నీతి వుండి తీరేది. కొన్ని వింటుంటే బలే నవ్వు కూడా వచ్చేది. తెలివిలేని మూర్ఖుడి గురించి కథలున్నట్టే అతితెలివి వున్న వాళ్ళ కథలు కూడా వుండేవి. అలాంటి ఒక అతి తెలివి కల పెళ్ళికొడుకు కథే ఇది.

అనగనగా ఒక వూళ్ళో రాంబాబు అనే అబ్బాయి వుండేవాడు. తను చాలా తెలివైనవాడినని అతని అభిప్రాయం. అంతే కాదు ఎదుటివాళ్ళు ఎంత తెలివితక్కువ వాళ్ళో ఉదాహరణలతో అందరికీ చూపించి వాళ్ళని చిన్నబుచ్చుతుండేవాడు. ప్రతిదానినీ తెలివిగా ఆలోచిస్తున్నాననుకుంటూ అతి తెలివికి పోయేవాడు.
అలాంటి రాంబాబు కి పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళికోసం బంధువు లందరితో కలిసి ఆడపెళ్ళివారి వూరికి బయల్దేరి వెళ్ళాడు రాంబాబు. ఆ వూరు వెళ్ళగానే రాంబాబుకి ఆడపెళ్ళివారు ఎంత తెలివి గలవారో చూడాలన్న ఆలోచన వచ్చింది. అలా తెలుసుకుందుకు వాళ్ళకి కనపడకుండా దాక్కుంటే తనని వెతుక్కోగలరో లేదో చూద్దామనుకున్నాడుట. అనుకున్నదే తడవుగా ఎక్కడ దాక్కుందామా అని తెగ ఆలోచించేసాడుట. పెళ్ళివారు తనని కనిపెట్టలేని చోటేదా అని బాగా ఆలోచించి, చాలా తెలివిగా ఆలోచించా ననుకుంటూ పెళ్ళి కోసమని వేసిన పెళ్ళింటి ముందున్న తాటాకుల పందిరి (ఇదివరకు పెళ్ళిళ్ళకి తాటాకు పందిళ్ళు వేసేవారు) యెక్కి కూర్చున్నాడుట.
ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్ళికొడుకెక్కడా కనిపించటం లేదు. ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు అందరూ కలిసి చుట్టుపక్కలంతా ఇళ్ళూ. వాకిళ్ళూ, తోటలూ, చెరువులూ అన్నీ గాలించారు. ఎక్కడా పెళ్ళికొడుకు జాడ లేదు.
వాళ్ళంతా వెతికి వెతికి విసిగిపోయి బంధువుల్లోనే వున్న మరో అబ్బాయికి ఆ ముహూర్తానికే ఆ అమ్మాయి నిచ్చి పెళ్ళి చేసేసారు.
పెళ్ళంతా అయ్యాక రాంబాబు"నన్నెతుక్కోలేకపోయారోయ్.., నన్నెతుక్కోలేకపోయారోయ్.." అని పెళ్ళివారి తెలివితక్కువతనాన్ని ఎత్తిచూపుతున్నట్టు చప్పట్లు కొట్టుకుంటూ మరీ పందిరి మీంచి దిగాడుట.
అది చూసి అతని చుట్టాలందరూ తలలు పట్టుకుని "ఓరి నీ అతితెలివి సంతకెళ్ళా.. బంగారం లాంటి అమ్మాయిని నీ పిచ్చి అతితెలివితో వదులుకున్నావు కదరా.." అంటూ చివాట్లు పెడతారన్నమాట
.
అందుకే దేనికీ అతి పనికిరాదంటారని మా తాతయ్యగారు చెప్పేవారు.
 
Real Time Web Analytics