నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, September 03, 2011

'నండూరి' సంస్మరణ లో !

సుప్రసిద్ద పత్రికా సంపాదకుడు , రచయిత, కవి, అనువాదకుడు నండూరి రామ్మోహనరావు గారు రెండు వారాలుగా తీవ్ర అస్వస్థత తో వున్నారన్న వార్తలు వింటూనే వున్నా, ఆయన మరణం తో నిన్నటి రోజంతా ఆయన జ్నాపకాల తలపోత తో గడిచిపోయింది.
నా జర్నలిజం కెరియర్ లో తొలుత నేను పని ప్రారంభించినది నలుగురు అగ్ర శ్రేణి పత్రికా సంపాదకుల దగ్గర కావటం నా అదృష్టం. ఆంధ్ర జ్యోతి వార పత్రిక సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహన రావు, స్వాతి సపరివార పత్రికాధినేత వేమూరి బలరాం, ఆంధ్రభూమి సంపాదకుడు ఏ.బి.కె. ప్రసాద్ ల దగ్గర నా జర్నలిజం వృత్తి మొదలయింది. ఫ్రీలాన్సు జర్నలిస్టు గా కెరియర్ ప్రారంభించటం తో మొదటి ముగ్గురి దగ్గర ఏక కాలం లో పని చేశాను. అది 1985-86 మధ్య కాలం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక రెండూకూడా లీడింగ్ లో వుండేవి. నేను జర్నలిజం రంగం లోకి రావటానికి కారకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఒకమీటింగ్ కి నేను వ్యాఖ్యాత గా వ్యవహరించినప్పుడు ఎంతో ప్రేమగా వచ్చి పలకరించి, రేపు ఆఫీస్ కి వచ్చి కనిపించుఅన్నారు.సరే అని వెళ్ళి కనిపిస్తే ' మాకు కాలమ్ రాస్తావా?' అని అడిగారు. అలా జర్నలిజం లో నా రంగప్రవేశంనేరుగా ఒక ప్రసిద్ధ వార పత్రిక లో ' టీవీ సమీక్ష ' కాలమ్ తో మొదలయింది. అది చూసి నండూరి వారు తన ఆఫీస్ కిపిలిపించారు. విజయవాడ లో జరిగే అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నండూరి వారిని అనేక సార్లు అంతకు ముందు చూసినప్పటికీ ఆయన దగ్గర పని చేయటానికి గాను మొదటి సారి వెళ్ళి ఆయనను కలుసుకోవటం మాత్రం మర్చిపోలేని సంఘటన. ఆంధ్రజ్యోతి వారపత్రిక లో నా కాలమ్ చూసి, బాగా రాస్తున్నావని మెచ్చుకొని మాకు కల్చరల్ రిపోర్టింగ్ చేస్తావా? అని అడిగారు.
అలా ఆయన దగ్గర ఆంధ్రజ్యోతి దిన పత్రిక కోసం విజయవాడ లో జరిగే సంగీత, సాహిత్య, నృత్య, నాటక
కార్యక్రమాలకు హాజరై వాటి మీద సమీక్షలు రాసి అందచేసేదాన్ని.
నండూరి చాలా మితభాషి. మాటలోనూ, రాత లోనూ కూడా అనవసర వాక్యం కానీ, వ్యాఖ్య కానీ వుండదు. అందుకే
నండూరి దగ్గర మాట్లాడటమంటే అప్పట్లో భయం గా ఉండేది. కానీ పురాణం , నండూరి వారికి పూర్తి వ్యతిరేకం.
పురాణం వారు మంచి హాస్య చతురులు. మనతో చాలా ప్రేమ గా, ఆప్యాయంగా వుండటంతో పాటు బోలెడు జోకులు
వేస్తారు. ఆయన మన దగ్గర ఫ్రీ గా మెలుగుతారు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడటానికి మనకు కూడా ఎలాంటి సంకోచాలు వుండవు.
నేను నండూరి తో ఎక్కువ సేపు గడిపింది 1998 లో ఆయనకు అప్పాజోశ్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ తరఫున 'ప్రతిభా
మూర్తి' జీవిత పురస్కారాన్ని రాజమండ్రి సభలో అందచేసినప్పుడు మాత్రమే. ఆయనకు అవార్డు అందచేసిన ఆ
సభలో ఆయన పరిచయ, సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నాను. నండూరి , వారి సతీమణి తో అప్పుడు రాజమండ్రి లో గడిపిన ఆ నాలుగు రోజులతో వ్యక్తిగతంగా వారు మరింత ఆత్మీయులయ్యారు.

నేనూ-నండూరి 'టాం సాయర్'
ఇదంతా వ్యక్తిగత పరిచయం. కానీ ఓ రచయితగా నండూరి మొదట తెలిసినది మాత్రం ' టామ్ సాయర్ ' తోనే.టాంసాయర్, హకిల్బెరీఫిన్, రాజూ-పేద, విచిత్రవ్యక్తి, టాంసాయర్ ప్రపంచయాత్ర,కాంచనద్వీపం లాంటి పుస్తకాలు
ఎంతో ఇష్టం గా చదువుకున్న చిన్న నాటి జ్నాపకాలు ఎంత పెద్ద అయినా మనల్ని వదలవు. అన్నింటికంటే
నాకు బాగా నచ్చినది ' టాం సాయర్'. నిజంగా ఆ పుస్తకం అప్పట్లో తెలుగు అనువాదం చదివి వుండకపోతే అసలు
మార్క్ ట్వేయిన్ లాంటి రచయిత తెలుగు పిల్లలకు పరిచయమయ్యే అవకాశమే లేదు. అది కదా అనువాదం లోని
గొప్పతనం. టాం సాయర్, హాకిల్ బేరీ ఫిన్ లాంటి రచనలతో పెరగని బాల్యం ఒక బాల్యమే కాదు అని చెప్పవచ్చు.
టాం సాయర్ చదివి ఆహా, వొహో అని మురిసిపోవటం ఒక ఎత్తు. నా కిష్టమైన ఆ రచనను మనకిష్టమైన రేడియో
నాటకం గా వినటం మరో ఎత్తు. ఆ నాటకం లో ఒక పాత్ర పోషించే మంచి అవకాశాన్ని నాకు అందచేసి నన్ను
మొదటి సారి రేడియో స్టేషన్ లో అడుగుపెట్టేలా చేసింది మా ఏల్చూరి మురళి. అప్పటి దాకా రేడియో లో ఆయన
గొంతు విని విపరీతంగా అభిమానం పెంచేసుకున్న ' రామం' అన్నయ్య ని కలుసుకొని ఆయన ఆధ్వర్యం లో
సంభాషణ లు ఎలా పలకాలో నేర్చుకున్న ఆ తీపి జ్నాపకం తల్చుకున్న ప్రతి సారీ నన్నోక పసిపిల్ల గా
మార్చేస్తుంది. ఆ నాటకం సందర్భంగా ' రామం' ని, ప్రయాగ రామకృష్ణ ని కలుసుకోవటం , ఆ తర్వాత అదే రేడియో
స్టేషన్ లో వారితో కలిసి పని చేయటం నేను కల లో కూడా వూహించని విషయాలు. వారం వారం రేడియో లో ' టాం
సాయర్' శ్రవ్య నాటిక ( మేము నటించినది) ప్రసారమవుతున్నప్పుడు చెవులొగ్గి విని , మళ్ళీ ఒక సారి ఎవరికి వాళ్లమే
' టాం సాయర్' అయిపోయినట్లు వూహాలోకం లో విహరించేవాళ్లం. ఆ నాటకం లో పాల్గొన్నందుకు నాకు పారితోషికం
కూడా అందచేశారు. నేనందుకున్న ఆ చెక్ నా తొలి సంపాదన. నండూరి వారి టాం సాయర్ తెలుగు
అనువాదానికి ఆ రేడియో నాటిక అనుసరణ. దానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సంభాషణ లు రాశారు. ఇలా
నండూరి వారి ' టాం సాయర్' పసి తనం నుంచి నా జీవితం లో కొన్ని ప్రధాన ఘట్టాలకు నాందీవాచకమయింది.
( రామం అన్నయ్య గురించి, టాం సాయర్ శబ్ద నాటకం గురించి మరిన్ని విశేషాలు తృష్ణ రాసినది ఇక్కడ చదవండి)

' అమ్మో ఫిలాసఫీ' అనే భయాన్ని పోగొట్టిన ' విశ్వ దర్శనం'

పసి తనం లో ' టాం సాయర్' ' రాజు-పేద' పుస్తకాల రచయిత గా తెలిసిన నండూరి తర్వాతర్వాత ఒక
సంపాదకీయుడిగా అర్థమయ్యారు. ఆయన సాహిత్య సంపాదకీయాల ద్వారా ప్రముఖ సాహితీవేత్తలెందరి గురించో
తెలుసుకునే వీలు కలిగింది. అన్నింటికంటే నాకు బాగా నచ్చినది ఆయన ' విశ్వ దర్శనం'. 'అమ్మో ఫిలాసఫీ నా '
అన్న భయాన్ని, అది మనకు కోరుకుడు పడని, అవసరం లేని సబ్జెక్టు అన్న అనవసర దురభిప్రాయాన్ని రెండింటిని
ఏక కాలం లో పోగొట్టగలిగిన రచన అది. ' విశ్వ దర్శనం' అప్పట్లో 1980-87 మధ్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో
ధారావాహికగా వచ్చేది. అమ్మబాబోయి ఫిలాసఫీనా అనుకునేవారిని ఆహా ఫిలాసఫీ అనిపించేలా మారుస్తుంది ఈ
పుస్తకం . పేరు చూసి విజ్నాన శాస్త్రమేమో ( సైన్సు) అనుకున్నాను. ఇది తత్త్వ విజ్నానమని చదువుతుంటే
అర్థమయింది. చాలా క్లిష్టమైన విషయాన్ని కూడా సరళంగా, సూటిగా ,అర్థమయ్యేలా రాయగలగటం నండూరి
ప్రత్యేకత. తత్త్వ శాస్త్రం లో ఆసక్తి వున్న వారు చదవగలరు కానీ ఆ విషయ పరిజ్నానం , ఆసక్తి లేని వారిని కూడా
చదివింపచేసి దాని పట్ల అభిరుచి, అనురక్తిని పెంచగలిగే రచన ఇది. అందుకు నండూరి ఎంచుకున్న రచనావిధానం
కారణమన్నది నిర్వివాదాంశం. విశ్వదర్శనం ( మొదటిభాగం) పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత దర్శనం. రెండో భాగం
భారతీయ తత్త్వ చింతనా రచన. అసలే ఫిలాసఫీ, పైగా పాశ్చాత్య తత్త్వశాస్త్రం అనగానే భయమో, బోరుగా
ఉంటుందేమో అన్న చిన్న అనుమానం మొదట కలగటం సహజం. ఆ విషయం ఆ రచన ప్రారంభించటానికి ముందే
నండూరి కి తెలుసు. అందుకే ఆయన భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. పాశ్చాత్య తత్త్వ శాస్త్ర పరిచయాన్ని
కేవలం సిద్ధాంతం ద్వారా చెప్పకుండా దార్శనికుల ద్వారా చెప్పారు. కేవలం దార్శనికుల సిద్ధాంతాల పరిచయానికే
కట్టుబడకుండా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓ కథ లాగా మధ్యలో కలగలిపి చెప్పారు. అలా చెప్పటం వల్ల
విషయం సులభంగా అర్థమవటమే కాకుండా చాలా సాఫీ గా సాగిపోయింది. పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత పరిచయ
ఉపోద్ఘాతం ఆయన రాముడు ,వశిష్టుడు వారి దగ్గరకు వెళ్ళి యోగవాశిస్ఠమ్ చెప్పించుకునే పరిచయం తో
ప్రారంభించారు. అలా అవాకాశం దొరికినప్పుడల్లా మనకు తెలిసిన భారతీయ తత్త్వ సిద్ధాంత ఉదాహరణలతో
చెప్పటం వల్ల పాఠకుడి కి అదేదో అసలు తమకు సంబంధం లేని విషయం అని ఏ మాత్రం అనిపించదు. పైగా నండూరి
ది ఒక ప్రత్యేకమైన సున్నితమైన హాస్యం. అది మనకు ఆయన రచనలన్నింటిలోనూ కనిపిస్తూఉంటుంది. దాని వల్ల
కూడా అంత సీరియస్ విషయాన్ని కూడా పాఠకుడు చాలా హాయిగా చదివి అర్థం చేసుకోగలుగుతాడు. సోక్రటీస్ '
సింపోజియం ' గురించి రాసినప్పుడు అగాథాన్ అందరికీ మద్యం అందిస్తున్నాడు అని మామూలుగా రాయకుండా '
మధ్య మధ్యే పానీయం సమర్పయామి' అన్నట్లు అందరికీ మద్యం పోశాడు అని రాశారు. పూజా తంతు లోని ఒక
చర్య ను నండూరి ఆ సందర్భం లో వాడినప్పుడు పాఠకుడికి ఆ సీన్ కళ్ల ముందు కదిలి పెదవులపై ఒక హాస్య రేఖ
మెరిసే వీలుంది.
అలాగే సోక్రటీసు, ప్లేటో ల మధ్య గురు శిష్య సంబంధాన్ని చెప్పేందుకు ఆయన వాడిన పోలిక వారిద్దరూ రామకృష్ణ
పరమహంస, వివేకానందుడు లాంటి వారు అని. ఆ ఉదాహరణ ఒక్కటి చాలు సోక్రటీస్, ప్లేటో ల సంబంధాన్ని సరిగ్గా
అర్థం చేసుకునేందుకు. ఇలా నండూరి ఆ వ్యాసాలు కదళీపాకం లా వుండేందుకు కావల్సిన అన్నీ
జాగ్రత్తలు ఇంత శ్రద్ధగా తీసుకోవటం వల్లనే ' విశ్వ దర్శనం' మామూలు పాఠకుడి హృదయం లోకి చేరి అక్కడ అలా
నిలిచిపోయింది . తత్త్వ శాస్త్రం లో విషయం కన్నా ముందు ఆ పరిభాష అర్థమవటానికి కొంచెం కష్టపడాలి.
ఆ విషయాన్ని ముందే అర్థం చేసుకున్న నండూరి ప్రతి తెలుగు అనువాదానికి ఇంగ్లీష్ పదాన్ని కూడా బ్రాకెట్ లలో
ఇచ్చి, పుస్తకం గా వేసినప్పుడు మొత్తం పారిభాషిక పదాల లిస్ట్, ఆసక్తి మరింత వుంటే లోతైన విశ్లేషణ కోసం
చదవాల్సిన పుస్తకాల జాబితా కూడా అందచేశారు. ఈ రకంగా ఒక పాఠకుడు ఒక రచన ను చదివి అర్థం
చేసుకోవాలంటే ముందు రచయిత ఏమేం చేయాలో అవన్నీ చాలా జాగ్రత్తగా ముందు చూపుతో నండూరి చేసి
పెట్టడం వల్ల ' విశ్వ దర్శనం' నేరుగా పాఠకుడి కి చేరవలసిన పద్ధతి లో సులువు గా చేరింది. అప్పట్లో ఆ ధారావాహిక
కు, తర్వాత పుస్తకం గా వేసినప్పుడు కూడా మంచి పేరు లభించింది. మొత్తంగా ఆ సీరియల్ పూర్తయ్యేటప్పటికి (
ఏడేళ్ళ సుదీర్ఘ కాలమనుకోండి) నాలాంటి కొందరికీ తప్పనిసరిగా ఫిలాసఫీ అన్న బెరుకు పోయి ఉంటుంది. ఆయన
ఆ రచన రాసిందే అందుకు. ఆ విషయం లో ఆయన కృతకృత్యులయ్యారు. ఒక రచయిత గా తాను
రాయవలసినవన్నీ రాసేసి ,తరతరాల తెలుగు వారికోసం 'విశ్వదర్శనా'న్ని అందించిన 'నరావతారం' నండూరి
శాశ్వత నిద్ర లోకి జారుకున్నారు. ఇప్పుడు మేల్కొనాల్సింది ఆయన రచనలు చదవకుండా నిద్రాణమైనవారు.

కల్పనారెంటాల

Thursday, September 01, 2011

ఒకే ఒక్క సరస్వతీ పుత్రుడు " పుట్టపర్తి" !



అది ఒకానొక సంవత్సరం.(1985-90 మధ్య)
స్థలం: విజయవాడ
విజయవాడ నార్త్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో మాట్లాడటానికి సరస్వతీ పుత్ర,, పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వచ్చారు. ఆయన బహు భాషా పాండిత్యం గురించి మా నాన్న గారి దగ్గర విని ఉండటమే కాకుండా, శివతాండవం లాంటివి ఒక సారి అలా తిరగేసిన మిడి మిడి జ్నానంతో ఆయనను ఇంటర్వ్యూ చేయటానికి సాహసం చేసి వెళ్ళాను.
కడప నుంచి ఆ మీటింగ్ కోసం వచ్చిన పుట్టపర్తి వారు విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగుండా వున్న దుర్గాభవన్ లాడ్జీ లో దిగారు. నేను వెళ్ళేసరికి అప్పటికే పుట్టపర్తి గారి దగ్గర నాగళ్ళ గురుప్రసాద రావు గారు, పుట్టపర్తి గారి అనుంగు శిష్యుడు,( దత్తపుత్రుడులాంటి) కవి, ఆకాశవాణి ఉద్యోగి శశిశ్రీ వున్నారు.
పుట్టపర్తి వారిది మంచి నిండైన విగ్రహం. ఖద్దర్ జూబ్బా, ధోవతీ కట్టుకున్నారు.ఎడమచేతి పై కండువా వేసుకొని కూర్చొని వున్నారు. ఆయనవి పద్మాల్లాంటి కళ్ళు.
14 భాషలు ఆయన సొంతం
పుట్టపర్తి వారు14 భాషల్లో పండితుడు. శతాధిక గ్రంథ కర్త. కవి, విమర్శకుడు, వాగ్గేయకారుడు. సాంప్రదాయికంగా గురువు దగ్గర సంగీత, నాట్యాలను అభ్యసించారు ఆయన. 14 భాషలను కేవలం చదవటానికో, మాట్లాడటానికో మాత్రమే నేర్చుకోలేదు. ఆయా భాషల్లో రచనలు చేసేంత సామర్ధ్యం సంపాదించారు. “Leaves in the Wind" అనేది ఆయన ఇంగ్లీష్ కవితల సంకలనం పేరు. " భక్తాచే గాథే" అనేది ఆయన మరాఠీ పుస్తకం పేరు. విశ్వనాథ సత్యనారాయణ గారి " ఏకవీర" నవలను మలయాళం లోకి పుట్టపర్తి వారు అనువాదం చేసిన సంగతి చాలా మందికి తెలియదు. " శివ సహస్రం " ఆయన సంస్కృత రచన. జీవితాంతం ఆయన జాతీయవాదిగా గడిపారు. గాంధీజీ మరణం తో ఆయన రాసిన " గాంధీజీ mahaaప్రస్థానం" మరువ లేని రచన గా చెప్పుకుంటారు. అనంతపురం జిల్లా పెనుగొండ వాసి కావడం తో తెలుగు , కన్నడ భాషలు సహజంగానే వచ్చాయి. శ్రీవైష్ణవుడు కావడం తో తమిళం అలవడింది. సంత్ సాహిత్యం చదవడం కోసం మరాఠీ, గుజరాతీ భాషలు నేర్చుకున్నారు. హిందీ భాష అంటే ఆయనకు ప్రాణం. పుట్టపర్తి వారి కుటుంబం లోని వారందరికీ తులసీ దాస్ రాసిన " రామచరిత మానస్ " కంఠతా వచ్చు. అది వారికి నిత్య పారాయణ గ్రంథం. పుట్టపర్తి వారి సతీమతి కనకమ్మ కూడా గొప్ప పండితురాలు. కవయిత్రి. శ్రీవైష్ణవులకు శరణాగతి వేదం లాంటి వాల్మీకీ రామాయణం లోని ఆరు కాండ లను 24 గంటల్లో పారాయణ చేసి ఉద్యాపన చెప్పగలిగిన భక్తురాలు. ఆ సరస్వతి పుత్రుడి కి ఆమె నిజంగా సహ ధర్మచారిణి.
శివాయ విష్ణురూపాయ!
సంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుంబం లో పుట్టి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఆచరించినప్పటికీ శైవ, విష్ణు భేదాలు ఆయన్ని కట్టి పడేయలేదు .' శివాయ విష్ణురూపాయ' అని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే ఆయన ప్రొద్దుటూరు లోని అతి పెద్ద ఆగస్తీశ్వర స్వామి గుళ్ళో నియమంగా 108 ప్రదక్షిణాలు ప్రతి రోజూ చేసి అక్కడ కూర్చొని రాసిన రచన " శివ తాండవం". నేను ప్రొద్దుటూరు వెళ్ళి ఆ గుడి ని దర్శించి పుట్టపర్తి వారిని, వారి ' శివతాండవాన్ని' తలుచుకున్నప్పుడు " సంగీత, నృత్య , సాహిత్యాల సమ సమ్మేళనమైన ఆ రచన కేవలం దైవకృప కు నిదర్శనమని" ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి.
ఆయన జీవించినది 76 ఏళ్ళు మాత్రమే . కానీ ఆయన చేసిన సాహిత్య కృషి మాత్రం ఒక జీవిత కాలం కంటే ఎంతో ఎక్కువ. " సరస్వతి పుత్ర" అన్న ప్రతిష్టాత్మకమైన బిరుదు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.
ఇంత ప్రతిభావంతుడి కి ఎలాంటి అకడమిక్ క్వాలిఫికేషన్స్ అక్కరలేదు. పరీక్షల ద్వారా ఆయన పాస్ అయినది మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి తెలుగు లో " విద్వాన్" కోర్సు మాత్రమే. పద్నాలుగేళ్లకే కవి, రచయిత అయిన కుర్రవాడికి అకడమిక్ చదువులు నిజంగా అవసరమా? అవసరం లేదని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పవచ్చు. పుట్టపర్తి వారు విద్వాన్ పరీక్షలకు వెళ్లినప్పుడు ఆయన రచన ' పెనుగొండ లక్ష్మి' ఆయన పాఠ్య గ్రంథంమయింది. ఆయన రచన కు ఆయనే విద్యార్థి. ఇది ఒక్క పుట్టపర్తి వారి విషయం లో తప్ప బహుశా ఏ రచయిత జీవితం లోనూ జరిగి ఉండదు.

ఉత్తమ పాఠకుడే సద్విమర్శకుడు
స్వ పరిచయం చేసుకొని వచ్చిన పని చెప్పగానే ' పుట్టపర్తి ' వారు ఎంతో ఆదరంతో ' దానికేం భాగ్యమమ్మా కూర్చో' అన్నారు. అటు నాగళ్ళ గారు, ఇటు పుట్టపర్తి వారు కూడా మొదట మా నాన్నగారి గురించి కుశల ప్రశ్నలు వేశారు.
తర్వాత నాగళ్ళ వారు " ఈ తెలుగు సాహిత్య విమర్శకులంతా అదేమిటో రాయలసీమ వారే. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, రాచమల్లు రామచంద్రారెడ్డి, వల్లంపాటి అందరూ రాయలసీమ వారే. ఆంధ్రా నుంచి టి. ఎల్. కాంతారావు లాంటి వారు వున్నారనుకోండి' అన్నారు. అప్పుడు పుట్టపర్తి వారు సాహిత్య విమర్శ, విమర్శకులకు సంబంధించి తన అభిప్రాయాలూ ఇలా చెప్పారు. సీరియస్ సాహిత్య విమర్శకులంతా అంటూ ఒక తిట్టు పదం లాంటిదేదో ఉపయోగించారు. సీనియర్ సాహిత్య విమర్శకులుగా పేరు పడ్డ వాళ్ళ గురించి
విమర్శిస్తూ ఆయన , విమర్శకుడు అనే వాడు ఎలా వుండాలో చెపుతూ " ఉత్తమమైన పాఠకుడే మంచి విమర్శకుడు కాగలడు. వాళ్ళ జీవిత సంస్కారం, అభిరుచి ఇవన్నీ కలిసి ఒకరిని మంచి పాఠకుడి గా తయారుచేస్తాయి" అన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన ఆ మాట అలా నా మది లో నిలిచిపోయింది. ఇప్పటికీ " కొందరి సాహిత్య విమర్శలు" చూస్తే ఆ రోజు పుట్టపర్తి వారు అన్న మాట గుర్తుకు వస్తుంది.
సరే, ఇలాంటి మామూలు మాటలేవో అయ్యాక నాగళ్ళ గారు సెలవు తీసుకున్నారు.
నన్ను పరీక్ష చేసేందుకొచ్చినావా ఏందీ?
ఆ తర్వాత నా ఇంటర్వ్యూ మొదలయింది." మీరు బహు భాషా పండితులు కదా. 14 భాషల్లో కూడా రాయడం, చదవడం అంతా క్షుణ్ణంగా వచ్చా?" అని నెమ్మదిగా మొదటి ప్రశ్న వేశాను.
" ఏమ్మా! ఇప్పుడు గానీ నువ్వు నన్ను పరీక్ష చేసేందుకొచ్చినావా ఏందీ? " అంటూ ఆయన నోరారా నవ్వేశారు.
' అయ్యయ్యో లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. మీకు తెలియనిది కాదు, పాఠకులకు తెలియటం కోసం కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది" అంటూ నేను నీళ్ళు నములుతుంటే తల వూపుతూ అడుగు లే అన్నారు.ఇక అక్కడి నుంచి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పుకుంటూ వచ్చారు.
ఆ ఇంటర్వ్యూ లో ఆయన తన ప్రసిద్ధ రచన ' శివతాండవం' గురించే కాకుండా ఆనాటి సాహిత్య విమర్శ, విలువల
గురించి కూడా ఎన్నో విలువైన అభిప్రాయాలు వెలువరించారు. ' సాహిత్యం అనేది పిచ్చివాడి చేతిలో రాయి లాగా
మారిపోయిందని' ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారల్ మార్క్స్ ఓ మహర్షి అని మెచ్చుకున్నారు.
మహోన్నత మూర్తులు
ఆ ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు మా నాన్నగారు నన్ను కూర్చొబెట్టుకొని పుట్టపర్తి వారి గొప్పతనం ఎలాంటిదో,
ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు ఎలాంటివో చెప్పుకొచ్చారు. దానితో పాటు కొన్ని హెచ్చరిక లు కూడా చేశారు.
పుట్టపర్తి లాంటి పండితుడి ని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్లినప్పుడు ఎంత వినయం గా ఉండి ప్రశ్నలు వేయాలో ,
అసలు ఆయనను కలుసుకొని మాట్లాడటం ఎంత అదృష్టమో వివరించి చెప్పారు. నిజంగా పుట్టపర్తి వారిని కలిసి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాక మా నాన్నగారు చెప్పిన విషయాలు ఎంత అక్షర సత్యాలో నాకు అర్థమయింది. అంత పండితుడి లో లేశమాత్రమైనా గర్వపు ఛాయలు కనిపించలేదు. ఆయనకంటే వయస్సులోనే కాదు , జ్నానం లో కూడా అతి చిన్న దాన్ని అయిన నన్ను ఆయన ఎంత ప్రేమ గా, ఎంత గౌరవించి మాట్లాడారో తలుచుకున్నపుడు మన పూర్వ తరం నుంచి మనం నేర్చుకోవాల్సిన సంస్కారం ఇదే కదా అనిపిస్తుంది. తన కూతురు ఒక పండితుడి ని కలుసుకొని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు పెద్దవారితో వినయంగా ఎలా మాట్లాడాలో ఒక తండ్రి నేర్పి పంపిస్తే, మరో 'అయ్య ' అపర సరస్వతీ పుత్రుడైనప్పటికీ వచ్చినది తన సొంత బిడ్డ అన్నట్లు ప్రేమాభిమానాలతో ఆదరించి విలువైన విషయాలను విశదంగా చెప్పి పంపారు.
పద్మశ్రీ వస్తే ఏంటీ? నా నిద్ర చెడగొడతావా?
పుట్టపర్తి వారి వర్థంతి అనుకోగానే రేడియో రోజుల నాటి నాకు పరిచయమున్న వారి కుమార్తె నాగపద్మిని గుర్తొచ్చారు. ఆమెకు ఫోన్ చేస్తే మా అయ్య అంటూ ఎన్నో విలువైన జ్నాపకాలను నాతో ఆత్మీయంగా పంచుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆమె చెప్పారు.
" రాత్రి పన్నెండున్నర గంటలప్పుడు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పేరిట " పుట్టపర్తి వారి సాహిత్య కృషి కి గుర్తింపు గా పద్మశ్రీ అవార్డ్ ను అందచేస్తున్నట్లు" టెలిగ్రామ్ వచ్చింది. అప్పటి దాకా నిద్ర పట్టక అవస్థ పడుతున్న అయ్య అప్పుడే నిద్ర లోకి జారుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ వచ్చిందన్న సంతోషం తో నేనేళ్లి అయ్య ను నిద్ర లేపి అవార్డ్ సంగతి చెప్పాను. అయ్య అసలు ఆ అవార్డ్ ని ఏ మాత్రం పట్టించుకోలేదు. " పద్మశ్రీ వస్తే ఏం? నా నిద్ర చెడగొట్టి చెప్పాలా? వస్తే వచ్చింది. పొద్దుట చూసేవాడిని కదా" అన్నారు. అయ్య అంత సింపుల్ గా వుండేవారు.
పుట్టపర్తి కల నెరవేరెనా?
మార్క్స్, అరబిందో సిద్ధాంతాల మేలుకలయిక తో ఓ కొత్త సిద్ధాంతానికి రూపకల్పన చేయాలని పుట్టపర్తి ఎంతో తపించారు. ఆ కొత్త సిద్ధాంతమే సమాజం లోని అన్నీ సమస్యలకు పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి వారి కి ఇచ్చిన నాలుగన్నర గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూ లో తన తండ్రి పుట్టపర్తి వారు చెప్పిన ఈ సంగతి ని గుర్తు చేసుకొని ఆయన కల సాకారమయ్యే సుదినం ఏదో ఒక నాడు వస్తుందేమో ఆశిద్దామని ఆమె అన్నారు.

లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రుడు
ఆ అపర సరస్వతి పుత్రుడికి సహజంగానే పెద్దలు చెప్పినట్లు లక్ష్మీ కటాక్షం కలగలేదు. ఎన్నో క్లిష్టమైన ఆర్థిక సమస్యల్లో వున్నప్పుడు స్నేహితులు, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులు ఆయనకు సహాయపడ్డారు. " ప్రబంధ నాయికలు" లాంటి పుట్టపర్తి వారి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకంగా పెట్టినప్పటికీ అది ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఉపయోగం లభించలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించినా, ప్రతిష్టాత్మకమైన " సరస్వతి పుత్ర" " మహాకవి" లాంటి బిరుదులు ఆయనను వరించినా ఆయనకు లభించింది కీర్తి మాత్రమే కానీ కుటుంబ జీవనానికి అవసరమైన కాసులు ఆయనకు దక్కలేదు.
'శివతాండవ' కృతికర్త మాటలు
శివతాండవం రచన ను 1985 లో గుంటూరు కు చెందిన రవి కళాశాలల అధినేత, సహృదయుడు ' ధన్' పునర్ముద్రించినప్పుడు పుట్టపర్తి వారు తన ముందుమాట లో శివతాండవం రచన గురించి రాసుకున్న మాటలు ఈ సందర్భం లో గుర్తు చేసుకోవడం ఎంతైనా సముచితం.
" ఇప్పటికీ శివతాండవం కనీసం పది సార్లు అయినా ప్రింట్ అయి ఉంటుంది. కానీ నేను ఆర్థికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరూ, ప్రతిష్టా సంపాదించుకోవాలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితం లో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఒక సారి గుంటూరు కి సాహిత్య మిత్రులు కొందరు నన్ను ఆహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యం కూడా సరిగా లేదు అప్పుడు. ప్రయాణానికి కావల్సిన జాగ్రతలన్నీ వారే చూచుకున్నారు.రామాయణం పైన నా ఉపన్యాసం. ఒక వెయిన్నూట పదహార్లు ఇచ్చి సత్కరించినారు. ఆ సందర్భం లో శ్రీ ధన్ గారు నాకు పరిచయమైనారు. ఆయన సాహితీ ప్రేమికుడు. జీవితం లో కష్టసుఖాలనేరిగిన వాడు. నన్ను గూర్చి వారికంతకు ముందే తెలుసు. వారు కొన్ని వేలు ఖర్చు పెట్టి మంచి బొమ్మలతో పాటు శివతాండవాన్ని మరలా ముద్రించి ఇస్తానని పూనుకున్నారు. వారి యౌదార్యాన్ని నేనెట్లు గౌరవించవలెనో నాకు తెలియదు. చిరంజీవి రామమోహనరాయ్, మరి కొందరు వారి ప్రయత్నానికి హర్షించి వారికి తోడైనారు. వీరందరికిన్నీ గూడా మనస్ఫూర్తిగా కృతజ్నతలు తెలుపుకోవడం తప్ప మరేమీ చేయలేను.
'శ్రీశ్రీ' గారి ' మహా ప్రస్థానం' లాగా ' శివతాండవా'న్ని ముద్రించి వెల పెట్టి నాకార్థికంగా యేదైనా ఉపయోగపడేటట్లు చూడాలని శ్రీ ధన్ గారు సంకల్పించారు. ఋణానుబంధాలు మహా విచిత్రంగా ఉంటాయి. భౌతికాలైన కారణాలతో వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం నా యోగ్యత కు మించిన పని.
నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో వినిపించడం జరిగింది. వినిపించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలే తప్ప , మరేమీ వినలేదు. ఇతర భాషల వారూ, తెనుగు రాని వారూ కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకునేవారు. తిరువాన్ కూర్ లో వున్నప్పుడు , ఢిల్లీ లో వున్నప్పుడు గూడా దీన్ని గూర్చిన పొగడ్తలే. ఢిల్లీ లో రష్యన్ ఎంబసీ వారు కూడా ' శివ తాండవా'న్ని చదివించుకొని విన్నారు. ఆ కావ్యం లో అనుభూతంగా వచ్చే ' లయ' వాళ్లనంతగా ఆకర్షించి ఉంటుందనుకున్నాను. దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరు లో ఆగస్తీశ్వర స్వామికి చాలా నియమం గా ప్రదక్షిణాలు చేసేవాడిని. రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. అప్పుడు వ్రాసినదీ కావ్యం. కావ్యం చాలా చిన్నగా ఉందని, కొద్దిగా పెంచుదామని ఎంతెంతో ప్రయత్నించినాను. కానీ నాకు సాధ్యం కాలేదు. భగవదిచ్చ ఇంతేనెమో అనుకున్నాను.
ఈ కావ్యం లో సంగీత , నాట్య, సాహిత్య సంకేతాలు పెనవేసుకొని వున్నాయి. ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకు కొంత తెలిస్తే గానీ, ఈ కావ్యం అర్థం కాదు. దీనిపైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బావుంటుందని చాలా మంది నాకు సూచించినారు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం. ఆ పని ఎప్పుడూ చేయలేదు.
అంతమాత్రమే కాదు. కాలం లో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింట్ కావడం కష్టం. ఎవ్వడో పబ్లిషర్ వేటగాడి వలె కాచుకొని ఉంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్యానేరం చేసినవాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి. బాధలు ప్రతి రచయితా అనుభవిస్తున్నవే.
నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యము, పద్యమూ రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరు శివతాండవ గ్రంథం పెనవేసుకొని పోయినవి. ఇది కూడా ఒక భగవత్ చిత్రమే. ఈ గ్రంథం ఇతర భాషల్లో కూడా పరివర్తితమయింది. జర్మన్ లోకి ఎవరో చేసినారు.హిందీ లోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు.నేను వానిని చూచినాను కూడా. ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం కూడా చాలా కష్టం. ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దం పైన ఆధారపడుతుంది. ఇంగ్లీష్ లోకి తెద్దామని నేనే ఎన్ని సార్లు ప్రయత్నించినాను. కానీ ఆ భాషాంతీరీకరణం ఎప్పుడూ నాకు తృప్తీ నిచ్చింది లేదు. కాళిదాసు ఎన్నో గ్రంథాలు వ్రాసినాడు. ఆయన మేఘసందేశానికేందుకో గొప్ప అదృష్టం పట్టింది. విశ్వనాథ వారు ఎక్కడకు పోయినా కిన్నెరసాని పాటల్నే చదవమనేవారు.
శ్రీ బాపు గారు ప్రసిద్ధ చిత్రకారులు. వారికేన్నో పనులు. బహుకార్యవిష్టులైన్నీ నాపై దయ తో చిత్రాలని గీచి ఇచ్చినారు.వారికి నా మనః పూర్వక కృతాంజలి. ఇంకొక సారి శ్రీ ధన్ గారికి, తక్కిన మిత్రులకు నా కృతజ్నతలు తెలుపుకుంటున్నాను.
పుట్టపర్తి నారాయణాచార్య , నవంబర్, 1985.

సరస్వతీ పుత్రుడు ఒక్కడే!

పుట్టపర్తి వారు తన బిరుదు కు తగినట్లు నిస్సందేహం గా సరస్వతి పుత్రుడు. ఆ బిరుదు కేవలం ఆయనకొక్కరికే
సొంతం. ఆ బిరుదు ఆయన పేరుతో చక్కగా కలిసిపోయింది. తెలుగు సాహిత్య లోకం లో మనకున్నది ఒకే ఒక్క
సరస్వతి పుత్రుడు. ఆ పేరు చెప్పగానే ఎవరికైనా స్పురించేది, స్ఫురించాల్సింది పద్మశ్రీ పుట్టపర్తి
నారాయణాచార్యులు మాత్రమే. ఆ బిరుదు ని ఇవాళ్టి వార్తాపత్రికల్లో " సరస్వతి పుత్రుడికి సహాయం చేయండి" లాంటి శీర్షికల దగ్గర చూస్తుంటే కొంచెం బాధ కలుగుతుంది. తెలివైన విద్యార్థి అనో, పేద విద్యార్థి అనో రాస్తే సరిపోయే దానికి అని ఓ పదో క్లాస్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి ని " అపర సరస్వతీ పుత్రుడు" అనటం ఎంత సమంజసమో పత్రికల వారు ఆలోచించుకోవాలి.
సెప్టెంబర్ 1, 1990 న పుట్టపర్తి వారు భౌతికంగా కాల ధర్మం చెందారు. ఇది ఆయన 21 వ వర్థంతి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ తెలుగు సాహితీ లోకం ఆయనను ఎన్నటికీ మరువదు.ఎప్పటికీ ఆయనొక్కడే " సరస్వతి పుత్రుడు".

కల్పనా రెంటాల

 
Real Time Web Analytics