నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label గుర్తుకొస్తున్నాయి. Show all posts
Showing posts with label గుర్తుకొస్తున్నాయి. Show all posts

Monday, July 18, 2011

ఓ నాన్న!...ఓ సాహితీ తపస్వీ!




( మా నాన్నగారు రెంటాల గోపాల కృష్ణ గారు కీర్తి శేషులై ఇవాళ్టికి పదాహారేళ్ళవుతోంది. ఆ సందర్భంగా సాక్షి దినపత్రిక సాహిత్య పేజీ వారు అడగగా మా తమ్ముడు జయదేవ రాసిన వ్యాసం ఇది. ఇందులో కొంత భాగాన్ని ఇవాళ సాక్షి పత్రిక ప్రచురించింది.దాన్ని ఇక్కడ చూడగలరు. నిజానికి ఈ వ్యాసం మా తమ్ముడి ఇష్టపది బ్లాగు లో రావాల్సింది. కానీ జయదేవ ప్రయాణం లో ఉండి నెట్ కి దూరం గా వుండటం తో నేను ఇక్కడ పంచుకుంటున్నాను)

నాకు ఊహ తెలిసే నాటికే నాన్న గారు రెంటాల గోపాల కృష్ణ పేరున్న రచయిత, జర్నలిస్ట్. విజయవాడ లోని సత్యనారాయణ పురం లో రైల్వే స్టేషన్ ( ఇటీవలే తీసేశారు) దగ్గర పురుషోత్తం వీధి లో రైలు కట్టాను ఆనుకొని మా ఇల్లు రైలు భోగీల్లాంటి మూడు గదులు. అరటి చెట్లు, మల్లె చెట్లు, తులసి కోట ఉన్న ఓ చిన్న పెరడు. ఓ చేద బావి. అగ్గి పెట్టె లాంటి ఆ అద్దె ఇల్లే మాకు అపర బృందావనం. తోబుట్టువులైన మా ఎనిమిది మంది తోబుట్టువుల్లో ఆరుగురం లోకం లీ కళ్ళు టేరించి ఆ ఇంటి ముందు గది లోనే! ఆఖరుకు నాన్న గారు కన్ను మూసింది ఆ గది లోనే! ఆ గది ఓ ఆయన ప్రత్యేకంగా ఇనుప ర్యాంకులతో చేయించుకున్న చెక్క బీరువా నిండా వందల కొద్దీ పుస్తకాలు. కాళిదాసు నుంచి కార్ల్ మార్క్స్ దాకా , ' బృహజ్జాతకం' నుంచి బృహత్ స్త్రోత రత్నాకరం దాకా, బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథల దాకా సంగీతం, సాహిత్యం, నృత్యం , నాటకం, జ్యోతిష్యం, పురాణేతిహాసాలు - ఇలా వైవిధ్యభరితమైన అంశాల్లో తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ ల్లో అరుదైన గ్రంధాలు అక్కడ కొలువై ఉండేవి. ప్రపంచం లోకి నాన్న గారు మాకిచ్చిన కిటికీ అది.
ఈ విస్తారమైన అభిరుచి కి ఒక రకంగా కారణం - నాన్న గారు పుట్టిన పండిత కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ఊళ్ళు, మనుషులు. గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా రెంటాల గ్రామం లో 1920 సెప్టెంబర్ 5 ఆయన జన్మదినం. వాళ్ళ అమ్మగారికి ఆయన అష్టమ సంతానం. పైగా పుట్టింది కృష్ణాష్టమి నాడు! ఆయన పేరు వెనుక కథ అది. గురజాల, మాచర్ల, మాచవరం, నరసారావుపేట ప్రాంతాల్లో బడి, గుంటూరు లో కాలేజీ చదువులు చదివిన ఆయన ఆ చిన్న వయస్సులోనే స్వశక్తి ని నమ్ముకొని విజయవాడ కు వచ్చేశారు. ' పార్వతీశ శతకం' , ఆ పైన పదహారో ఏట ' రాజ్యశ్రీ' అనే చారిత్రక నవల తో మొదలు పెట్టి 75 వ ఏట మరణించే దాకా 60 ఏళ్ల పాటు ఆయన అలుపెరగకుండా రచనా యాత్ర సాగించడం ఓ ఆశర్యకరమైన వాస్తవం. కవి , రచయిత, నాటక కర్త, అనువాదకుడు, జర్నలిస్ట్ , వక్త-- ఇన్ని కోణాలు ఒకే వ్యక్తి లో ఉండటం నాన్న గారి గొప్పదనం. ఒక రకంగా అరుదైన అదృష్టం. కానీ , వేదాలు,వాదాలు, అభ్యుదయ నాదాలు, అనువాద భేదాలు-- ఇలా ఎన్నో పాయలుగా చీలిన ప్రతిభ, పాండిత్యం కారణంగా నాన్న గారు ఏకాగ్ర దృష్టి తో ఏదో ఒక రంగానికే పరిమితం కాలేదు. ఫలితంగా, ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని అనిపిస్తుంటుంది.
నాన్న గారికి ఆప్త మిత్రులనగానే -- అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యారావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, ఈ నెల మొదట్లో కన్నుమూసిన ' ఉదయిని'--' ఎర్ర జెండాల ' గంగినేని వెంకటేశ్వరరావు, చదలవాడ పిచ్చయ్య, ప్రచురణకర్తల్లో ' ఉమా పబ్లిషర్స్' కాండూరి సుబ్రహ్మణ్యం, ప్రస్తుత విశ్రాంత జీవితం గడుపుతున్న ' జయంతి పబ్లికేషన్స్ ' మువ్వల పెరుమాళ్ళు, సినీ జీవి ' నవయుగ' కాట్రగడ్డ నరసయ్య వగైరాల పేర్లు నాకు ఠక్కున గుర్తుకొస్తాయి. అనిసెట్టి, ఏల్చూరి, బెల్లంకొండ లు బడి చదువుల రోజుల నుంచి నాన్న గారికి మిత్రులైతే, మిగిలిన చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం ( అరసం) తొలి రోజుల నుంచి ఆంధ్ర దేశం లో ప్రజా నాట్య మండలి ప్రభ వెలిగిపోతున్న కాలం మీదుగా, ప్రపంచ సాహిత్యానువాదాల ప్రచురణ పరిశ్రమ గా కొనసాగిన కాలం లో ఆయనకు సహచరులు, సహవ్రతులు.
నేను కళ్ళు తెరిచే సరికి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ' ఆంధ్రప్రభ' దినపత్రిక సంపాదకవర్గం లో నాన్న గారు కీలక వ్యక్తి. ఎడిటర్ కాకపోయినా ఎన్నెన్నో విలువైన సంపాదకీయాలు రాసిన నిబద్ధ జర్నలిస్ట్. ప్రతి శుక్రవారం వచ్చే ' సినిమా పేజీ ' కి ఆయనే ఎడిటర్. సాహితీ, సాంస్కృతిక , సినీ రాజధానిగా వెలుగొందిన ఆనాటి విజయవాడ చరిత్ర లో ఆయన అంతర్భాగం . ఆ రోజుల్లో ఏ సభ జరిగినా, అందులోనూ కొత్తగా రిలీజైన సినిమాల అభినందన సభలు, ఇష్టాగోష్టులు అయితే, రెంటాల గారు తప్పనిసరిగా వేదిక మీది త్రిమూర్తుల్లో ఒకరు .( రెంటాల, తుర్లపాటి కుటుంబరావు, వీరాజి- ఈ ముగ్గురు 1970-'80 ల నాటి విజయవాడ సినీ సభలకు త్రిమూర్తులు). ' పంచకళ్యాణి- దొంగలరాణి', ' కథానాయకురాలు' సినిమాలకు ఆయన రచయిత కూడా! వాల్మీకీ గురించి అనర్గళంగా మాటాడి, రామాయణ కాలం నాటి లాంకా ఉనికి పై కుహనా పరిశోధనల్ని పూర్వ పక్షం చేస్తూ పొద్దున్నే గంభీరమైన సంపాదకీయ వ్యాఖ్యలు రాసిన వ్యక్తే. సాయంత్రం సినిమా సభ లో వాణిశ్రీ గురించి, ఆమె పై చిత్రీకరించిన ' దసరా బుల్లోడు' పాట గురించి అంతే ఛలోక్తి గా సభారంజకంగా మాట్లాడేవారు. చిన్నప్పుడు ఉండే సినిమా మోజు, సినిమా ప్రివ్యూ చూసి రాగానే నాన్న గారు రాసే చిత్ర సమీక్ష ను ప్రింట్ లో రాక ముందే చూడడం, పురాణాల మొదలు ' బాలజ్యోతి' మాస పత్రిక లో పిల్లల సీరియళ్ళు దాకా ఆయన రాస్తున్నప్పుడే వేడి వేడి గా చదివేయడం- ఇలాంటివన్నీ నాన్న గారిని నా దృష్టి లో హీరో ను చేశాయి. ఇంకా చెప్పాలంటే, తెలియకుండానే నా అంతరాంతరాళ్ళో ఓ రోల్ మోడల్ ను నిలబెట్టాయి. పోగుబడిన ఆ వాసనలే మా పెద్దన్నయ్యనూ ( రెంటాల సత్యనారాయణ) మా అక్కయ్యను ( కల్పనా రెంటాల), నన్నూ అక్షరాల వైపు పరుగులు తీయించాయి.
నాన్న గారు ఉదయం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకోగానే కాస్తంత కాఫీ త్రాగుతూ రాసుకోవడానికి కూర్చోనేవారు. ఆయన ప్రత్యేకంగా చేయించుకున్న టేకు కుర్చీ, టేబుల్, ఆ టేబుల్ లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి, అక్కరలేదన్నప్పుడు లోపలకు నెట్టేయడానికి వీలుండే రాత బల్ల ఉండేవి. పురుళ్ళూ , పుణ్యాలు, ఇంటికి వచ్చే బంధుజనమ్, పిల్లల ఆటలు, పాటలు, చదువులు, కేరింతలు, అరుపులు, కేకలు, కొట్లాటలు, ఆఫీస్ ఒత్తిళ్ళు --ఇన్నింటి మధ్య కూర్చొని ఆయన రోజూ గంటల తరబడి రాసుకుంటూ ఉంటే, పంచాగ్ని మధ్యంలో సాహితీ తపస్వీ లా కనిపించేవారు.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ' రసన' సమాఖ్య కె. వేంకటేశ్వర రావు, సుంకర కనకారావు, మాచినేని వెంకటేశ్వరరావు, కోగంటి గోపాలకృష్ణయ్య, కర్నాటి లక్ష్మీనరసయ్య, మోటూరి ఉదయం, ' అనామిక' విజయలక్ష్మి, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కె.వి. రమణారెడ్డి, ఏటుకూరి బలరామమూర్తి, బొమ్మారెడ్డి - ఇలా ఒకరా, ఇద్దరా ఆ నాటి ప్రసిద్ధ సాంస్కృతిక, సాహిత్య, పత్రికా రంగా ప్రముఖులందరూ మా ఇంటికి తరచూ వస్తుండేవారు. ఇంటికి ఎవరోచ్చినా వాళ్ళను సాదరంగా ముందు గది లో కూర్చోబెట్టి, ముందుగా మంచినీళ్ళు, ఆ తరువాత అమ్మ చేతి కమ్మని కాఫీ, ఆ పైన ప్రత్యేకంగా మద్రాస్ నుంచి తెచ్చిన కొయ్య పేటిక లో నుంచి ఘుమ ఘుమలాడే వక్కపొడి ఇచ్చి మర్యాద చేయాలి. అది నాన్న గారు, అమ్మ మాకు నేర్పిన పద్ధతి . నిజం చెప్పాలంటే, తెల్లవారుతూనే తీసిన తూర్పు వాకిటి గుమ్మం మళ్ళీ రాత్రి ఎప్పుడో పడుకునేటప్పుడు తప్ప మధ్యలో మూసే పనే లేదు. వచ్చిన పెద్దలతో ముందు గది లో ఎప్పుడూ ఏవో సాహితీ చర్చలు. చొక్కా లాగు వయసు లో విన్నవి తలకెక్కాయో లేదో కానీ, మాకు తలపులు పెంచాయి. సమాజం లోకి తలుపులు తెరిచాయి.
గమ్మత్తేమిటంటే, నరసరావు పేట లో ' నవ్య కళా పరిషత్' వారి ' నయాగరా' ( అనిసెట్టి పెళ్ళికి మిత్రులిచ్చిన కావ్య కానుక) కవి మిత్రుల్లో ఒకరైన నాళ్ళ నుంచి , ప్రభుత్వానికి నిషేధానికి గురైన ' కల్పన' కవితా సంకలనం సంపాదకత్వ రోజుల దాకా నాన్న గారి జీవితమంతా ప్రధానంగా కవిత్వం, రంగస్థలమే! అభ్యుడయ కవిత్వం లో మైలు రాళ్ళుగా నిలిచిన ' సంఘర్షణ', తెలంగాణ ప్రజా పోరాటం పై దృష్టి పెట్టిన ' సర్పయాగం' కవితా సంపుటాలు, ' శిక్ష ', ' ఇన్స్పెక్టర్ జనరల్', ' అంతా పెద్దలే ' లాంటి నాటకాలు రచనా జీవితపు తొలి నాళ్ళల్లోనే నాన్న గారికి పేరు తెచ్చిన సాహితీ శిల్పాలు. " అమ్మా! ఉమా ! రుమా! హీరోషిమా! విలపించకూ పలపించకూ..." అంటూ హీరోషిమా పై అణుబాంబు దాడి ఉదంతం వస్తువు గా రాసిన కవిత అప్పట్లో ఎంతో మంది దృష్టి ని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకొని , 1952 ప్రాంతం లో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవిత ను ఇంగ్లీష్ లోకి అనువదించి, వినిపించారు.
అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతి మూలాల కలనేత నాన్న గారు. సంప్రదాయ కుటుంబం లో పుట్టి , ఆ సాహిత్యమంతా చదివి, అభ్యుదయం వైపు పయనించి, ఆది నుంచి ' అరసం ' లో సభ్యుడిగా, కమ్యూనిజమే తారక మంత్రం గా కొనసాగిన నాన్న గారికి శ్రీశ్రీ అంటే ప్రాణం. అదే సమయం లో విశ్వనాథ (సత్యనారాయణ) అంటే గురుభావం. శ్రీశ్రీ మానసిక వైకబ్ల్యానికి గురైన రోజుల్లో విజయవాడ లో ఆసుపత్రి గది వద్ద కాపున్న నాన్న గారే, విశ్వనాథ ఇంటికి వెళ్ళి శిష్యుడి లా కూర్చొని, ' నవభారతి' పత్రిక కు ' మధ్యాక్కఱలు' రాయించుకొని తెచ్చేవారు. విశ్వానాథ ను అనేక సార్లు ఇంటర్వ్యూ చేసిన నాన్న గారు, ఆ కవిసమ్రాట్ అస్తమించినప్పుడు ' ఆంధ్రప్రభ' దినపత్రికలో ' వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యుడు ' అంటూ సంపాదకీయం రాసి, అక్షరాంజలి ఘటించారు. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన, ఇతర సిద్ధాంతాల వారందరూ ఆగర్భ శత్రువులన్న వైమనస్యం లేని విశాల సాహితీ దృక్పథం నాన్న గారిదేమో అనిపిస్తుంది. అయితే, కష్టాలను కడతేర్చే తారకమంత్రం కమ్యూనిజం అని నమ్మాక, ఓ దశ లో కమ్యూనిస్ట్లు పార్టీలో వచ్చిన నిట్టనిలువు చీలిక ఎంతో మంది అభ్యుదయ సాహితీప్రియుల లాగానే నాన్న గారిని కూడా విచారం లోకి నెట్టింది. ఉమ్మడి కమ్యూనిస్ట్ నేపథ్యం లో నుంచి వచ్చిన వారందరూ చెట్టుకొకరు, పుట్టకొకరు అయినప్పుడు ఆయనా జీవిత సమరం లోకే వెళ్ళిపోయారు.
నాన్న గారి ఆరు దశాబ్దాల రచనా జీవితంతో దాదాపు నాలుగు దశాబ్దాల పత్రికా రచనా జీవితం పెనవేసుకుంది. చల్లా జగన్నాత్తమ్ సంపాదకత్వం లో గుంటూరు నుంచి వచ్చిన ' దేశాభిమాని' పత్రిక తో జర్నలిస్ట్ జీవితం మొదలుపెట్టారాయన. ఆ తరువాత వివిధ పత్రికలకు రచనలు చేస్తూనే , చదలవాడ పిచ్చయ్య ' నవభారతి' మాసపత్రిక కు ఇంచార్జ్ ఎడిటర్ గా పని చేశారు. ఆ తరువాత నీలంరాజు వెంకట శేషయ్య సంపాదకత్వం లో ' ఆంధ్రప్రభ ' దినపత్రిక లో చేరి, 1980 ల చివరి వరకూ అక్కడే వివిధ హోదాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించారు. రచనలు చేశారు. శీర్షికలు నిర్వహించారు. సమీక్షలు, సంపాదకీయాలతో సహా అనేకం రాశారు. సమాజాన్ని సరైన దోవ లో నడిపించేందుకు కలం పట్టాలన్న తరానికి చెందిన నాన్న గారి దృష్టి లో జర్నలిజం ఉద్యోగం కాదు. వృత్తి! ఆసక్తి, అభిరుచి ఉన్న వారే తప్ప, గడియారం చూసుకొని పని చేసే గుమాస్తా గిరి మనస్తత్త్వం జర్నలిస్ట్ లకు పనికి రాదని ఆయన నమ్మారు. ఆచరించారు. పత్రికా రచన ప్రతిష్టాత్మకమైన ఆ రోజుల్లో ఆయన సహోద్యోగులు పండితారాధ్యుల నాగేశ్వర రావు, జి. కృష్ణ, ఏ.బి.కె. ప్రసాద్, అజంతా, మాదల వీరభద్రరావు, అప్పటి యువతరం పురాణపండ రంగనాథ్, వాసుదేవ దీక్షితులు, కె. రామచంద్రమూర్తి, వేమన వసంత లక్ష్మి--ఇలా ప్రసిద్ధులు ఎందరెందరో! నండూరి రామ్మోహన రావు, సి. రాఘవాచారి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ' స్వాతి' బలరాం లాంటి ఆప్త పత్రికా మిత్రుల జాబితా ఇంకా పెద్దది. రచయిత, జర్నలిస్ట్ లు రిటైర్మెంట్ లేదని నమ్మిన నాన్న గారు పదవీ విరమణ చేసినా, కడదాకా ' ఆంధ్ర ప్రభ' ' స్వాతి' పత్రికలకు రచనలు చేస్తూనే వచ్చారు.
నాన్న గారికి మేము ఎనిమిది మంది సంతానం. మా ఎనిమిది మంది చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ళ కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్ని వేల పేజీలు రాశారో! దాదాపు 200 పుస్తకాలు లెక్క తేలాయి. అందులో 150 కి పైగా ప్రచురితాలు. కానీ, ఇవాళ సంస్కృత మూలంతో సహా తెనిగించిన ' వాత్స్యాయన కామ సూత్రాలు' లాంటి కొన్ని మినహా అనేకం అందుబాటు లో లేవు. చివరి రోజుల్లో ఆయన తన మూడో కవితా సంపుటం ' శివధనువు ' ప్రచురించాలని ఎంతో తపించారు. కానీ, స్వహస్తాలతో పుస్తకంగా కుట్టుకున్న ఆ కవితల పత్రికాప్రతుల సాక్షిగా 1995 జూలై 18 న కీర్తి శేషులయ్యారు. ఆ పైన ' శివధనువు' కవితా సంపుటాన్ని, కొన్ని అముద్రిత నాటకాలను మార్కెట్ లోకి తెచ్చేసరికి, ఆర్థికంగా బలం లేని మాకు వెన్ను విరిగింది. అయితేనేం, పిత్రూణాం కొంతైనా తీర్చుకోగలిగామనే ఆత్మ తృప్తీ మిగిలింది.
' అష్ట గ్రహ కూటమి' అన్నది మా ఎనిమిది మంది పిల్లల మీద నాన్న గారి ఛలోక్తి. అమ్మతో కలిపి నాన్న గారి జాతకం లో మేము ' నవగ్రహాలు' అన్న మాట! ( చిన్న తనం లోనే బాల జోస్యుడిగా పేరు తెచ్చుకున్న రెంటాలకు జ్యోతిష్యం లో లోతైన అబినివేశం ఉండేది). సెలవు పెట్టకుండా ఆఫీస్ పని లోనే మునిగి తేలే ఆయనకు నిత్యం సభలు, సమావేశాలు, ఇంట్లోనేమో ఉదయం, సాయంత్రం సృజనాత్మక వ్యాసంగం--వీటికే సరిపోయేది! ఇరవై నాలుగు గంటల జీవితం లో ఆయన మమ్మల్ని లాలించలేదు. బుజ్జగించలేదు. చేయి పట్టుకొని నడిపించలేదు. ఇలా ఉండాలని ప్రత్యేకించి చెప్పలేదు. ఇలాగే ఉండండని శాసించలేదు. బోధనలో ఆయనది మౌనంగా ఉంటూనే, శిష్యుల సందేహాలను పటాపంచలు చేసే దక్షిణామూర్తి సంప్రదాయమని అనిపిస్తుంటుంది.
నాన్న గారి ఈ విజయాలన్నింటి వెనుకా అదృశ్యం గా నిలిచింది మా అమ్మ-- పర్వత వర్ధని. ఊరు కానీ ఊళ్ళో, భాష రాని అమ్మ, నాన్న గారి రచనా జీవితానికి ఇబ్బంది లేకుండా పుట్టింటిని సైతం మర్చిపోయింది. ఇంటి బాధ్యతలు నెత్తిన వేసుకొని, రెక్కలు ముక్కలు చేసుకుంది. అమ్మ ఎప్పుడూ తెర వెనుకే! ఆయన పేరు చదవడం కోసం అప్పట్లో కష్టపడి కూడబలుక్కొని తెలుగు చదవడం నేర్చుకున్న అమ్మ, ఆయన పోయాక ఆయన పుస్తకాలు ప్రచురిస్తుంటే, వాటిని చూడటం కోసం రాత్రిళ్ళు లేజర్ ప్రూఫ్ ల కోసం కాచుకు కూర్చున్న అమ్మ --ఇవాళ్టికీ ఆయనకు లభించిన కొండంత సిరి.
అప్పటికీ, ఇప్పటికీ ఎక్కడైనా, ఎవరైనా అడిగినప్పుడు పూర్తి పేరు చేపప్గానే, ' ఫలానా రెంటాల గోపాల కృష్ణ గారు మీకు ఏమవుతారు?' అనే ప్రశ్న మా ఇంట్లో అందరికీ అనేక సందర్భాల్లో ఎదురయ్యే అనుభవం. ' ఆయన మా నాన్న గారు' అనగానే అవతలి వ్యక్తి కళ్ళల్లో ఓ చిన్న వెలుగు, మాటలో ఓ చిన్న మెరుపు. అదే నాన్న గారు మాకిచ్చిన మూలధనం. బతకడానికి కావల్సిన బడి చదువులేవో చెప్పించి, మనిషి గా జీవించడానికి మార్గమేమితో చెప్పకుండానే చేతల్లో చూపించిన పాత తరం పెద్ద మనిషి నాన్న గారు. అందుకే, ఆయనంటే మా ఇంటిల్లపాదికీ ప్రేమ, గౌరవం, ఆరాధన! నాన్న గారు కీర్తి కాయం తో చిరంజీవులై పదహారేళ్ళవుతున్నా, ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే పూదూకుపోయే గొంతు పేగుల్చుకొని మరీ మా కల్పనా కవిత లో మాటలే చెప్పాలని ఉంది--

" నాన్నా! ఇవాళ్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!"

డా. రెంటాల జయదేవ

Monday, September 27, 2010

ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా?

" గుర్తుకొస్తున్నాయి " శీర్షికన ఏమైనా రాయమని అడిగారు ప్రమదావనం ప్రమదలు. ఏం గుర్తుకొస్తున్నాయి? ఏం రాద్దాం? అనుకుంటూ ఒక కప్పు కాఫీ పెట్టుకుందామని వంటింటి లోకి వెళ్ళగానే దేని మీద రాయొచ్చో ఒక అవుడియా వచ్చేసింది. అమ్మాయిలకు వంటింటి లోకి వెళ్ళగానే అమ్మ గుర్తుకు వస్తుంది. నాకు మాత్రం మా నాన్న గుర్తుకు వస్తారు. నన్నూ, నా వంటింటి ని అంతంగా ప్రభావితం చేసిన ఆయన మహోపకారం కూడా గుర్తుకువస్తుంది.


నేను టెన్త్ లోనో,ఇంటర్ లోనో వున్నప్పుడు ఒకరోజు మా నాన్నగారితో సంఖ్యాశాస్త్రం నుంచి సాహిత్యం దాకా సవాలక్ష విషయాల్లో సందేహాలను అడుగుతున్న సమయాన మా అమ్మ వచ్చి " ఎప్పుడూ చూసినా మీ నాన్న తో కబుర్లేనా? వంటింటి లోకి రా, కనీసం కూరలు తరిగి పెడుదువు గానీ!” అంటూ ఆర్డర్ పాస్ చేసింది.

అప్పుడు నా పితృదేవుడు మా అమ్మ ఆర్డర్ ని ధీటుగా ఎదిరించి " ఛత్ నా కూతురికి వంట నేర్చుకునే ఖర్మెమిటి? దానికి నేను పెట్టిన పేరేమిటి? నువ్వు చెయ్యమంటున్న పనులేమిటి? అరిసెలు వత్తడం ఎవరైనా చేస్తారు. నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. కానీ మంచి పుస్తకాలు చదవడం, రాయడం అందరికీ వచ్చే విద్య కాదు. " అంటూ ఎదురు క్లాస్ తీసుకుంటే మా అమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి లోపలకు వెళ్ళిపోయింది.



అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆ రాయటం ఏదో కష్టపడి నేర్చుకుంటే వంట చెయ్యక్కరలేదనుకున్నాను. అలా మొదలైంది నాలో రాయాలన్న తపన..తృష్ణ...

అలా మా నాన్న నన్ను వంటింటి లోకి వెళ్ళకుండా రక్షణ కల్పించటం వల్ల చాలా మంది అమ్మాయిలు పద్ధతి ప్రకారం వైనంగా నేర్చుకునే కుట్లు,అల్లికలు, పూలు మాలలు కట్టడం, కంది పచ్చడి రోట్లో మెత్తగా రుబ్బడం లాంటివి ఏవీ రాకుండానే పెద్దదాన్ని అయిపోయాను.
సామాన్యం గా మగవాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే స్వేచ్ఛ పోతుందని భయపడిపోతారు. కానీ నేను పెళ్ళి చేసుకుంటే వంట చేయాల్సి వస్తుందని భయపడి పోయాను.

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా!

అలా అనుకోని పోనీలే, వంటే కదా, పక్కవాళ్లకు నేర్పిద్దాం లే అని పెళ్ళి చేసుకున్నాను.

ఇక వంటింటి లోకి వెళితే కుక్కర్ ఎలా పెట్టాలో తెలియదు, ( ఇంట్లో మనం చేసిన పని ఏదైనా వుంటే...పది విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయ్యటమే)ఇడ్లీ పిండికి ఏ కొలతలు, గ్రైండర్ ఎలా పనిచేస్తుంది, అది ఆగకపోతే రీసెట్ బటన్ ఎక్కడుంటుంది లాంటి జనరల్ నాలెడ్జి బొత్తిగా నిల్.

నా ఖర్మ చాలక నేను వంటింట్లో కుస్తీలు పడుతున్న రోజుల్లో మా ఇంట్లోకి రెండు కూరగాయలు వచ్చి నా ప్రజ్నా పాటవాల్ని మరింత బట్టబయలు చేశాయి. ఒకటి పొట్లకాయ, రెండోది సొరకాయ . రెండూ వేటికవే గొప్ప కూరగాయలు లెండీ! ఇక చూస్కొండి నాకు డౌట్స్ మీద డౌట్స్. పొట్ల కాయకు చెక్కు తీయాలా, వద్దా? సొరకాయ కి తొక్కు తీస్తారని తెలుసు( కొంచెం పనిమంతురాలినే కదా) . అప్పటికే మనకి కొద్ది మందికి తాట తీసిన అనుభవం వుంది కదా. ఆ రెండింటి కి లోపల అదేమిటో తెల్లగా బ్రహ్మ పదార్ధం, కొన్ని గింజలు కనిపించాయి. అవేం చేయాలో తెలియలేదు. పారేయ్యాలా? లేక అవి కూడా ముక్కలతో పాటు వేసి కూర చేయాలా? అని.


అలా అప్పటి నుంచి నేను , నా వంట కొద్ది కొద్దిగా ఎదుగుతూ వచ్చాము. ఇప్పుడు ఈ దేశం లో ఏదైనా పాట్ లక్ ఫంక్షన్ అంటే ఏవో నాలుగైదు రకాల వంటలు చేసుకొని తీసుకెళ్లగలిగే స్థాయి కి ఎదిగాను.

అయినా కూడా విధికి నా మీదేప్పుడూ చిన్న చూపే!

సునాయాసం గా వంట చేయగలిగే స్థాయి కి ఎదిగినా సరే...నాకు తెలుగు భాష లో నచ్చని అనేక పదాల్లో ఒకటి " రెసెపీ". అసలు ఎవరైనా ఏదైనా ఇలా చేయండి అని చెప్తే తింగరిబుచ్చి లాగా తప్పకుండా అలా చేయకుండా వుండెలా జాగ్రత్త పడతాను.

ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళు పోసి అన్నం వండమని ఎవరైనా చెపితే ఒకటి కి ఒకటిన్నరో, రెండున్నరో పోసి ఎలా వస్తుందో చూడాలని నాకు మహా ఉత్సాహం గా, క్రియేటీవ్ అవుడియాలు అన్నీ వస్తుంటాయి.

ఇండియా లో ఎప్పుడూ ఈ రెసెపీ ల అవసరం పడలేదు. బండి ఎలాగోలా నెట్టుకొచ్చేసాము. అదృష్టవశాత్తూ పేపర్ ఆఫీస్ లో ఉద్యోగం..మధ్యాహ్నం వెళితే ఏ రాత్రి 11 కో, 12 కో ఇంటికి చేరటం.చేతి కింద నలుగురు పనివాళ్ళతో " సర్వ స్వతంత్రం " గా బతికాను. నేను వంట బాగా చేయాల్సిన టైం వచ్చేసరికి ఇండియా లో రెస్టారెంట్ల కల్చర్, కర్రీ పాయింట్ల కల్చర్ పెరిగింది. అలా అవన్నీ నన్నూ, నా మాంగల్యాన్ని కాపాడాయి.

నా జాతకం లో మహర్దశ అయిపోయేటప్పటికి నేను అమెరికా వచ్చి పడ్డాను. ఇక మా నలుగురు పని మనుషులు చేసే పని, మా ఇంట్లో మా ముగ్గురి పని ( నా పని కూడా నేనే చేసుకోవాల్సి వచ్చిందని ప్రత్యేకం గా మనవి చేసుకుంటున్నాను.) కూడా నేనే చేయాల్సి వచ్చింది.

వారం వారం ఎక్కడో అక్కడ పాట్ లక్ లు. ఏదో ఒక మహత్తర వంటకం చేసి తీసుకెళ్ళాలి. అక్కడితో మన పని అయిపోదు. అది తిన్నాకా వావ్, వీవ్ అంటూ కాకుల్లా ఏవో ధ్వనులు చేసి ఎలా చేయాలి అంటూ రెసెపీ లు అడుగుతారు. ఏమిటి చెప్పటం నా మొహం వాళ్ళకు...మనకు అన్నీ ఉజ్జాయింపు గా వేయటమే తెల్సు కానీ కొందరేమో సుతారం గా ఉప్పు వేయటానికి కూడా ఒక స్పూన్ తీసుకొని తయారవుతారు. ఇంత ఉప్పు తీసుకొని అలా పడేసి ఆ చేతిని ఇలా నైటీ కో, ఫాంట్ కో పులుముకోవడం మన సంప్రదాయం, ఆచారం . ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నేను మాత్రం ఇలాంటి ఆచారాల్ని తూచా తప్పకుండా పాటిస్తాను..

మొదట్లో ఈ పాట్ లక్ లకు పులిహోర చేసి తీసుకెల్ళేదాన్ని.అదైతే వీజీ...వీజీ...అప్పట్లో మా దగ్గర ఒక్క తెలుగు మొహంకూడా వుండేది కాదు. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటూ ఏది తీసుకెళ్ళినా మొత్తం గిన్నె అంతా ఖాళీ చేసెసేవారు. కానీ ప్రతి సారీ అదే తీసుకెళ్లలేమ్ కదా. అలా తీసుకేళితే మనకు పెద్దగా వంటలు రావన్న విషయం తెలిసి పోతుంది కదా. పైగా వాళ్ళేమే కష్టపడి రాజ్మా కూర్మా లాంటివి చేసుకొస్తుంటే మనకు కూడా ప్రేస్టేజి పాయింట్ వచ్చేసింది. అది నాకె కాదు మొత్తం సౌత్ కె అవమానం గా ఫీల్ అయి వెరైటీ వంటలు నేర్చుకోక పోతే ఇక్కడ ఐడెంటిటీ ఇస్యూ వస్తుందని భయపడ్డాను.

ఇక అప్పటి నుంచి నా కష్టాలు మొదలండీ బాబూ...రెసెపీ ల కోసం వెతకటం..నెట్ ఎక్కి కూర్చొని ఆంధ్ర వెజిటేరియన్ అని కొట్టగానే వందలాది వెబ్సైట్లు, రెసెపీలు, యూ ట్యూబ్ లింక్ లు కూడా. ఇండియాలో వున్నప్పుడు ఎవరైనా చేసి పెడితే తినడం, లేకపోతే కొనుక్కోని తినడం తప్ప..ఈ కుక్ బుక్ ల కల్చర్ బొత్తిగా మనకు అలవాటు లేదయ్యే! అలాంటిది నెట్ లో నుంచి రెసెపీ లు ప్రింట్ చేసుకోవడం, పక్కన పెట్టి అది చదువుతూ వంట చేయడం...

అదేమిటో నేను రెసెపీ ప్రకారమే చేద్దామని కొన్ని సార్లు అనుకునేదాన్ని కానీ ఎప్పుడూ కూడా అందులో చెప్పినవి ఒకటో రెండో నా దగ్గర వుండేవి కావు. పోనీలే లేని వాటిని వదిలేసి వున్న వాటితో చేసుకుందాం అని అలా చేసెసేదాన్ని. ఈ సారి షాపింగ్ కి వెళ్ళినప్పుడు గుర్తు గా అవి తెచ్చేదాన్ని. కానీ ఇంకో రెసెపీ లో ఇంకేవో అడిగేవాడు.ఇలా నా కిచెన్ కౌంటర్ నిండా వెనెగర్, సోయి సాస్ లాంటి బ్రహ్మ పదార్దాలు అన్నీ వచ్చి చేరిపోయాయి కానీ వాటిని నేను మూత తీసి వాసన చూసే సందర్భాలు కూడా రాలేదు.

ఇలా వుండగా...నాకు ఇంట్లోనే ప్రతిపక్షం తయారైంది.

నాకెమో ఏవీ లేకపోతే వేడి అన్నం, కంది పచ్చదో, పొడి నో వుంటే చాలు. అఫ్సర్ కెమో కక్కా, ముక్కా తిన్న నోరు....మనమేమో ప్యూర్ ఆంధ్రా వెజిటేరియన్ ఫుడ్ తో సంవత్సరాల తరబడి వాయించేస్తున్నాము. కంది పొడి తోనా అంటూ అయోమయం గా చూస్తాడు. మా చిన్నూ గాడికి మాటలు రానంత కాలం అన్నం నోట్లో కుక్కేస్తే సరిపోయేది. వూహ తెలిశాక, ఇదేమిటి అని అడగటం కాకుండా, ఎందుకిలా వుంది అని ప్రశ్నించటం కూడా నేర్చుకున్నాడు. అలాంటప్పుడు మాత్రం ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ని పగల గొట్టాలనిపిస్తుంది. వాడు నెమ్మదిగా ఎదిగాడు.ఎంత దాకా ఎదిగాడు అంటే రోజూ నా వంటకు మార్కులు వేసే వరకూ...పప్పో, కూరో నోట్లో పెట్టుకొని పది కి మూడు, పోనీలే నాలుగు అంటాడు...అవి నాకు ఆ రోజు వచ్చిన వంట కి మార్కులన్న మాట. నేను నోట్లో పెట్టుకొని తిని బాగానే వుంది కదరా అంటూ వాడి వైపు, చెప్పవేమిటి అంటూ తన వైపు ( ఎవరో తెలుసు లే మీకు) ఉరిమి చూస్తే...” మీ టేస్ట్ బడ్స్ పాడైపోయాయి.” అంటాడే గానీ వాడి అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోడు.

ఇలా అమెరికా లో ఏదో మా ఇంట్లో మా వంటలు మేం తిని మా మానాన మేం బతుకుతూ వుంటే ఇండియా నుంచి ఒక స్నేహితుడు అమెరికా ట్రిప్ కి వచ్చాడు. నేను అలవాటు ప్రకారం రోజూ ఎవడు వంట చేస్తాడు అనుకోని అతను వచ్చిన మొదటి రోజు ప్రేమ గా సాంబారు , కూర, పప్పు చేశాను. అందరం తిన్నాక ఇంకా బోలెడు మిగిలింది. అన్నీ ఫ్రిజ్ లో పెట్టాను. అవి అయితే కానీ కొత్తవి చేయటానికి లేదు. ఎందుకంటే అవి మిగిలితే పెట్టడానికి ఫ్రిజ్ లో ఖాళీ వుండోద్దు? ఈ రకమైన టెక్నికల్ డిఫికల్తీ వల్ల అతను వున్న మూడు రోజులు అదే సాంబారు, పప్పు, కూర పెట్టి పంపించాను. అందుకని ఇప్పటికీ నన్ను దెప్పుతుంటాడు " మీ ఇంటికి వస్తే చద్ది కూడు పెట్టారు " అని.
అదేమిటో ఎవ్వరూ అర్థం చేసుకోరూ....!

ఇది ఇలా వుండగా...నా టైం బాగుండక క్రితం సారి ఇండియా వచ్చినప్పుడు మా వాడు మా అమ్మ చేతి వంట, మా అక్క చేతి వంట తిన్నాడు. మా అక్క చాలా బాగా వంట చేస్తుంది. అన్నింటి లో మనకు పూర్తి వ్యతిరేకం. మా అక్క అచ్చంగా " డొక్కా సీతమ్మ" టైపు. పెద్దల ఎదుట నోట్లోంచి మాట రాదు. వినయ విధేయతలు పూర్తిగా పుణికి పుచ్చుకున్న సాధ్వీమ తల్లి. ఇక్కడకు తిరిగి వచ్చేసే ముందు మా అక్క వాళ్ళింటికి వెళ్ళి భోజనం చేసాకా మా వాడు " ఆమ్మా! నువ్వు కూడా అమెరికా వచ్చేసి మాతో వుండిపో" అని తెగ గొడవ చేస్తుంటే మా అక్క అబ్బా, వీడికి నా మీద ఎంత ప్రేమ అని మా బావ గారికి చెప్పి మురిసిపోతుంటే...ఓసీ పిచ్చిమొహమా! అది నీ మీద ప్రేమా కాదే తల్లీ,,,నువ్వు వస్తే హాయిగా కడుపు నిండా భోజనం చేయచ్చని వాడి ఆశ అంటే..ఇక మా అక్క....పిల్లాడికి ఇష్టం గా వంట చేసి పెట్టక నువ్వు చేసే పనేమిటే అని నాకు హితబోధలు మొదలుపెట్టింది.

నేను విననట్లు పక్కకెళ్లిపోయాను. అంతకన్నా మనమేం చేయగలమ్ చెప్పండి....

ఏదో ఇలా వంట వచ్చీ రాక...ఇలా బ్లాగుల్లో కళ్ళనీళ్ళు వత్తుకుంటూ ఏవో నా బాధలు రాసుకుంటూ బతికేస్తుంటే...ఇప్పుడు నా ప్రాణానికి జ్యోతక్క తయారైంది. షడ్రుచుల పేరుతో...ఏవో ఒకటి రాయడం, ఇది చాలా ఈజీ..చాలా టేస్టీ అంటూ ఏదో ఒక పోస్ట్ రాయడం , దానికి రెసెపీ లు ఇవ్వడం,పైగా నోరూరిస్తూ ఫోటోలు ఒకటి....

వొట్స్ తో ఇవి చేసుకోవచ్చు. అవి చేసుకోవచ్చు. ఓట్స్ దద్దోజనం, ఓట్స్ పులిహోర, ఓట్స్ పాయసం, ఓట్స్ తద్దినం అంటూ....ఒక చేంతాడంతా లిస్ట్.

అది చూశాక ప్రాణం వొప్పదు. తెల్లారి లేచి వంటింటిలోకి వెళితే అక్కడ ఆ ఓట్స్ డబ్బా కనిపిస్తుంది. చేయాలో, వద్దో తెలియదు. మళ్ళీ ఆ కంప్యూటర్ మీదకెక్కి ఆ రెసెపీ చదివి వచ్చి అలా చేసి అది ఎందుకు అంత బాగా రాలేదో అర్థం కాక బాధపడి, మళ్ళీ అక్కడ కామెంట్ పెట్టి, ఆమె మరో సలహా ఇచ్చి ...ఇదంతా నాకిప్పుడు అవసరమా....అనుకోని కామ్ గా అంతఃసాక్షి ని, మనఃసాక్షి ని. ...ఇంకేం సాక్షులున్నాయో వాటినన్నింటిని అణగతొక్కేసుకొని ఎప్పటిలాగానే అందులో ఇన్ని పాలు పోసుకొని ఒక నిముషం మైక్రో వేవ్ లో వేడి చేసుకొని హాయి గా తింటూ " Eat, Pray, Love” చదువుకున్నాను.

అది అయిపోయిందా ఆండీ...మళ్ళీ మొన్న రకరకాల సమోసాలు అంటూ...ఇంకో పోస్ట్ పెట్టింది. అసలు సమోసాలు చేయటమే కొంచెం టైం తో కూడుకున్న వ్యవహారం. చాలా వోపికగా, నిదానం గా, కొన్ని గంటలు వంటింటి లో కష్టపడితే ఓ కే ... కొన్ని సమోసాలు వస్తాయి. మనమేమో వారానికి ఒకసారి ఆ ఇండియన్ షాప్ కి వెళ్ళి డాలర్ కి ఒక సమోసా కొనుక్కోని తినేసి వస్తున్నాం కదా. మళ్ళీ ఇదంతా ఎవరు పడతారు అనుకోని చూసీ చూడనట్లు వూరుకున్నాను.

ఇంతలో లాప్ టాప్ మీద నుంచో,లోపల నుంచో ఒక కేక....ఎందుకంటే ఆ లాప్ టాప్ ఎదురుగుండా చాలా సేపు కూర్చున్నాక ఏమవుతుంది అంటే వారే వీరు, వీరే వారు అయిపోతారు. ఎవరు లాప్ టాప్ నో? ఎవరు రూప స్వరూపమో తెలియదు. అలా ఒక కేక వినిపిస్తే వెళ్ళి మళ్ళీ ఏంటీ అని అడిగితే....ఎన్ని రకాల సమోసాలో చూడు...కొంచెం ట్రై చేయచ్చు కదా...ఆ తన్హాయి రాసుకునేబదులు రోజంతా..అన్నాడు. ఇక చూడు...నా సామి రంగా...అరికాలి మంటలు ఇలా మౌస్ మీదకు వచ్చేశాయి.

చాలా మంది మహిళలు ఇలా తమకు వచ్చిన వంటలన్నీ రెసెపీలు, ఫోటోలతో కూడా బ్లాగుల్లో పెట్టడం వల్ల నాలాంటి అమాయక స్త్రీలు ఇంట్లో నానా రకాలా వేధింపులకు గురవుతున్నారని , కాబట్టి ఇక నుంచి వంటలు అని టాగ్ వున్న బ్లాగుల్నీ ముఖ్యం గా షడ్రుచుల్ని యాగ్రి గేటర్ ల నుంచి తీసేయ్యాల్సింది గా కోరుతూ కూడలి,మాలిక, హారం,జల్లెడ కి ఒక విజ్నాపనపత్రం పంపించేశాను.

ఇప్పుడు చెప్పండి.ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా? పంపిస్తే....


( సరదాగా రాసిన ఈ పోస్ట్ లో ....జ్యోతి, షడ్రుచుల పేర్లను వాడుకున్నందుకు క్షమాపణలు)
 
Real Time Web Analytics