ఈ కథ గురించి రాసిన తొలి పలుకులు ఇక్కడ చదవవచ్చు.
కథకుడి కి జరిగిన అనుభవం సత్యమా? అతను కోరగానే అంత అలవోకగా అంతటి ఆనందానుభూతి ని ప్రసాదించిన ఆమె ఎవరూ? ఆమె వ్యక్తిత్వం ఏమిటి? ఆ సుఖానుభూతి అసలేలా కలిగింది? ఇవన్నీ ఆ కథకుడికే కాదు కథను చదివే పాఠకులకు కూడా వచ్చే సందేహాలు.
మొదటి సారి ఈ కథ చదవటం పూర్తి చేసినప్పుడు నాకు కూడా వెంటనే అర్థమైనట్లు అనిపించలేదు. మీనాక్షి తో ఆ రాత్రి అతనికి కలిగిన అనుభవం ఒక భ్రాంతి నా? లేక వాస్తవమా? అది ఒక కలనా? ఆ కలయిక జరిగిందని వూహించుకున్నాడా? నిజంగా జరిగిందా?
మొదట నిజంగా జరిగిందనుకుందాము....నిజంగా జరిగితే అనుభవం తాలూకు అనుభూతి గుర్తుండి అసలేం జరిగిందో ఎలా గుర్తుండకుండా వుంటుంది? ఎంత గొప్ప అనుభూతికి లోనైనా అతను మీనాక్షి ఇంటి నుంచి హోటల్ కి ఎలా నడిచోచ్చాడో కూడా ఎలా గుర్తుండకుండా వుంటుంది? అతను ఆమె తో పొందాను అనుకుంటున్న అనుభవం అసలు భౌతికమైనదా? లేక కేవలం మానసికమైనదా? అది లైంగికపరమైన కలయికనా? ఇలా అనేకానేక సందేహాలు వస్తాయి.
రచయిత తానేం చెప్పదల్చుకున్నాడో అది అక్షరాల్లో , పదాల్లో, వాక్యాల్లో , ఒక అనుభవం గా , ఒక గాఢమైన అనుభూతి గా మన ముందు వుంది. అక్కడితో రచయిత పాత్ర అయిపోయింది. మిగిలింది పాఠకుడి పాత్రే. అక్కడ చెప్పిన దాన్ని, చెప్పకుండా వదిలేసిన దాన్ని బట్టి సొంత వూహాలతో కథను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం.
మొదటి సారి చదివినప్పుడు ( ఎన్ని సంవత్సరాల క్రితమో గుర్తు లేదు) నాకు కథ పూర్తి కాగానే సంపూర్ణం గా అర్థం కాకపోయినా రచయిత చాలా బాగా రాశారు అనిపించింది. ఆ బాగా రాయటం కొంచెం సంక్లిష్టం గా చెప్పటం వల్లనా, లేక అర్థమై కాకుండా వదిలేయటం వల్ల వచ్చిన ఒక సొగసు వల్లనా? లేక మన మామూలు పరిధులకు అర్థమైనా కాకపోయినా రచయిత ఒక తాత్త్విక పరిధిలో ఈ కథను చెప్పారన్న మామూలు అవగాహన కలగటం వల్లనా ? ఏమో తెలియదు. ఇదీ అని చెప్పలేని కారణం. ఇలా చాలా రకాలా కారణాల వల్ల ఈ కథ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఇలా నాకు నచ్చిన , లేదా నేను మెచ్చిన కథల్ని పరిచయం చేయటం కోసమే కథానుభవం శీర్షిక ప్రారంభించాను.
మళ్ళీ ఈ కథ ఇప్పుడు సంపాదించినప్పుడు , మొదటి సారి చదివినప్పుడు ఏం అర్థమైంది అన్నది అసలు మనసు లో లేకుండా ఇప్పుడే మొదటి సారి ఈ కథ చదువుతున్నట్లు మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక మళ్ళీ అదే అనుభవం. ఏం చెప్తున్నారు? అని. వెనక్కూ, ముందుకూ మళ్ళీ మళ్ళీ చదివాక ఒక చిన్న విషయం ఏదో అర్థమైనట్లు అనిపించింది. ఈ ముగింపు ని ఎలాగైనా చెప్పుకోవచ్చు.
నా అవగాహన తప్పో, వొప్పో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. ఇది కేవలం నాకు కలిగిన అనుభూతి. మీకు కూడా ఇలాగే అనిపించవచ్చు. వేరేలాగా అనిపించవచ్చు. ఎలా అనిపించినా కరెక్టే అని నేననుకుంటున్నాను.
ఆ రాత్రి కథకుడు పొందిన భౌతికానుభవం మానవ మీనాక్షితోనే అయినప్పటికీ మానసికంగా ఆ సమయం లో అతని మనస్సు ఆలయం లోని మీనాక్షి పై లగ్నమై వుంది. అందువల్లనే అతనికి అదొక అనిర్వచనీయమైన అనుభవంగా , తనను తాను మర్చిపోయేంత గాఢమైన అనుభవంగా మిగిలింది. ఆ అనుభవం లో అతను మిగలలేదు. అనుభవం ఒక్కటే మిగిలింది. అందుకే అతనికి ఆ సమయం లో మీనాక్షి ఏం మాట్లాడిందో , అసలు ఏమైనా మాట్లాడిందో లేదో కూడా తెలియలేదు. తను హోటల్ రూమ్ లోకి వచ్చి ఒక నిద్ర లోకి వెళ్లక హోటల్ సర్వర్ వచ్చి రాత్రి ఎనిమిది గంటలప్పుడు లేపితే మెలకువ వచ్చింది. సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది వరకూ అంటే వున్నది దాదాపు ఒక రెండు, మూడు గంటలు.
ఈ రెండు మూడు గంటల్లో ఏం జరిగిందో కొన్ని వివరాలు ఇచ్చారు రచయిత. నిజానికి ఇలా వాక్యం వాక్యం తీసి వివరణ ఇచ్చుకుంటూ పోతే ఆ కథ లోని సౌందర్యం మొత్తం విరిగిన అద్దం ముక్కల్లాగా కనిపించటం తథ్యం. ఈ తాత్త్వికమైన ముగింపు ని ఎవరికి వారు అర్థం చేసుకోవటం సులువు కానీ ఇలా చెప్పటం అంటే అందులోని ఆనందాన్ని ఇలా భాగభాగాలుగా చేయక తప్పటం లేదు.అందుకు క్షమించాలి.
అతను కలిసింది దేవాలయం లోని మీనాక్షి తో అని నేను స్పష్టం గా అనుకోవటానికి...నాకు లభించిన వివరాలు...
మీనాక్షి చనిపోయింది అని జ్నానాంబ చెప్పగానే అతనికి బాధ, దుఃఖం కలగకుండా ...మాయ గా ఆశ్చర్యం గా అనిపించింది. ఎందుకలా?
ఫోటో లోని మీనాక్షి కి, అతను తన అంతఃచక్షువులతో చూసిన ఆమె అద్భుత సౌందర్యానికి అసలు ఏ మాత్రం పోలికలే కనిపించలేదు.
మీనాక్షి తో కథకుడు తన అనుభూతి ని ఆమె మరణం తర్వాత తర్కించుకొని చూసినప్పుడు అతనికి గుర్తున్నదల్లా పుష్కరిణి దగ్గర ఆమె చెప్పిన అద్వైతం మాటలే. ఆమె ఇంటి దగ్గర కథకుడు తనని గురించి తాను చెప్పకున్నాడు తప్ప మీనాక్షి వివరాలేమీ చెప్పిన గుర్తు లేదు.
కథకుడు ఆమె మరణాన్ని కథలో ఎక్కడా మృత్యువు గా, మరణం గా ఒక్కసారి కూడా పేర్కొనకపోవడం...ఆమె దగ్ధమై, అంతర్ధానమై పోయింది అంటాడు . అలాగే జ్నానాంబ చెప్తున్న మీనాక్షి కి , తన స్వానుభవం లో తన అనుభూతి లో సత్యమై నిలిచిన మీనాక్షి కి ఎక్కడా పోలిక లేదని కథకుడు స్పష్టం గా గుర్తించగలగటం.
జ్నానాంబ ఇంట్లో అద్దెకుంటున్న ఫిలాసఫీ లెక్చరర్ , స్వయంగా అద్వైతీ, కథకుడి కి అద్వైతానుభూతి ని విశదం గా వివరించి చెప్పిన మీనాక్షి సాక్షాత్తూ ఆ అమ్మవారి భౌతిక స్వరూపమే. కనీసం కథకుడి అనుభవం వరకూ. తామిద్దరి కలయిక లో ధార్మిక విచికిత్స పొడచూపనే లేదు అని కథకుడి ద్వారా స్పష్టం గా చెప్పించిన దాన్ని బట్టి కథకుడు మధుర మీనాక్షి లో ఒక శృంగార స్త్రీమూర్తి ని చూశాడు. అమ్మవారిని అలా చూడటం అనేది సర్వ సాధారణం కాదు కానీ అసాధారణం కూడా కాదు. మీరా కృష్ణుడిని భర్తగా ఆరాధించటంలో, శ్రీరంగనాథుడ్ని గోదా దేవి ప్రేమించడం లో లేని అభ్యంతరం మీనాక్షి దేవి ని ఒక సంపూర్ణ స్త్రీ గా ఒక పురుషుడు చూడగలగటం లో ఉండనక్కరలేదు. అది ఒక రకమైన తంత్రసాధనేమో కూడా.
లోకాలనేలే ఒక అమ్మ గా కాకుండా మధుర మీనాక్షి ని కథకుడు ఒక అద్భుత సౌందర్య రాశి గా ఆమె లోని అపూర్వమైన సౌందర్యాన్ని ఛూశాడు, ఆమె పట్ల ఒక లైంగికేచ్చ ను కలిగి వున్నాడు అన్నది ప్రధానంగా రచయిత ఈ కథ లో ప్రతిపాదించదలుచుకున్న విషయం . అది ఎంత మాత్రం తప్పు కాదు అని చెప్పటం తో పాటు, దానికొక అద్వైత తాత్త్వికత ను కూడా జోడించి అందించారు.
కథలోని ప్రతి వాక్యం ఎంతో ప్రతీకాత్మకంగా, నర్మగర్భంగా వుంది.
మీనాక్షి అతనికి చేసిన బోధ ఒకటే. ఇద్దరు మీనాక్షులు లేరు.ఉన్నది ఒకటే. అందుకే కథకుడు మానవ మీనాక్షి తో లైంగికంగా కలిస్తే అతను అమ్మవారితో ఐక్యం చెందినట్లు అనుభూతి చెందాడు. అంత మధురమైన అనిర్వచనీయమైన సుఖాన్ని పొందాక అతను ఒక రాత్రి ఒక పగలు అలా మత్తుగా నిద్రపోతున్నప్పుడు కథకుడికి ఒక కల వస్తుంది. అతను చనిపోయినట్లు వచ్చిన కల అది. ఆ అనుభవం ద్వారా అతను తాను ,తన శరీరం వేరు అన్న భావం నుండి ఆ రెండూ ఆ అనుభవం తో, ఆ అనుభూతి తో, ఆ అనుభూతి ప్రసాదించిన మీనాక్షి అనే స్వస్వరూపం తో ఏకమైపోయాడు అని రచయిత ప్రతీకాత్మకం గా చెప్పాడు.
కథలోనే ఒక చోట చెప్పినట్లు ఆశాశ్వతమైన దాన్ని శాశ్వతమైన దాని ద్వారానే పొందటం సాధ్యమవుతుంది. ఆశాశ్వతమైన మీనాక్షి ద్వారానే కథకుడు శాశ్వతమైన దేవత ని పొందగలిగాడు.ఆ తాదాత్మ్యాన్ని చెప్పటమే మొత్తం మధుర మీనాక్షి కథ.
వున్నవి రెండు కాదు, ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని ఒక కథలో ఇంత చక్కగా, ఇంత అందంగా చెప్పగలగటం మామూలు రచయితల వల్ల జరిగే పని కాదు. ఫిలాసఫీ ని జీవితమంతా అధ్యయనం చేసి పాశ్చాత్య, భారతీయ తత్త్వ శాస్త్రాలకు ఒక అనుసంధానం చేయాలని జీవితమంతా తపించి అందుకోసమే కృషి చేసి తన రచనలన్నింటి ద్వారా తాను నమ్మిన, తాను అవగతం చేసుకున్న ఫిలాసఫీ ని అందించే ప్రయత్నం చేసిన ఆర్. ఎస్. సుదర్శనం లాంటి రచయిత మాత్రమే రాయగలిగిన కథ మధుర మీనాక్షి. మళ్ళీ అలాంటి కథ తెలుగు లో మరొకటి వస్తుందన్న నమ్మకం లేదు కానీ వస్తే మంచిదే.
The Road Within Has No Finish Line
-
* Zero to 26.2*
This is the story of a journey.
The great literary philosopher, Joseph Campbell, in his seminal work, "The
Hero's journey" makes the foll...
4 weeks ago