నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label కె.రామలక్ష్మి. Show all posts
Showing posts with label కె.రామలక్ష్మి. Show all posts

Sunday, March 12, 2023

కాలానికి ముందే నిలచిన కె. రామలక్ష్మి “ పార్వతి కృష్ణమూర్తి” కథలు!



కె. రామలక్ష్మి అంటే కేవలం ఆరుద్ర సతీమణి మాత్రమే కాదు. ఆమె కంటూ చాలా ప్రత్యేకతలున్నాయి. రచయిత్రి గా ఆమె కొక విలక్షణత కూడా ఉంది. స్వాతంత్ర్యానంతర తొలి తరం రచయిత్రుల జాబితాలో మొదటి వరుస లో ఉంటుంది కె. రామలక్ష్మి పేరు. 50 వ దశకానికే  స్వతంత్ర ఇంగ్లీష్ దినపత్రిక లో సబ్ ఎడిటర్ గా పని చేసిన ఘనత ఆమెది. ఖాసా సుబ్బారావు లాంటి జర్నలిస్ట్ వద్ద శిక్షణ పొందారు ఆమె. ఆమె తొలి కథా సంపుటి “ విడదీసే రైలు బళ్ళు ” 1954 లోనే ప్రచురించారు. అప్పటి నుంచి దాదాపు ఏడెనిమిది ఏళ్ల క్రితం వరకూ ఆమె కథా సంపుటాలు, నవలలు ప్రచురిస్తూనే ఉన్నారు. ఆమె రాసిన “ పార్వతీ కృష్ణమూర్తి కథలు” 50 వ దశకం నుంచీ అందరి అభిమానానికి నోచుకున్నాయి . కె. రామలక్ష్మి అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేవి ఆ కథలే. అవి ఇప్పుడు అందుబాటు లో లేవనుకుంటాను నాకు తెలిసినంతవరకూ. తర్వాతర్వాత ఆమె కథల నుంచి నవలా రచనలోకి మళ్ళారు.

అయితే ఆమె కథా రచనను మలుపు తిప్పిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారని ఆమె ఒక చోట చెప్పుకున్నారు. రామలక్ష్మి మొదట్లో చిన్నచిన్న కథలు రాసే వారు. అయితే ఒక రోజు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వచ్చి “ ఈ గాజులు తొడిగించుకునే కథలు ఎన్ని రాసినా ఒకటే ! ఇవి తగ్గించి కొత్త పంథా తొక్కితే బావుంటుందేమో ఆలోచించు” అన్నారట. ఆ సలహాతో ఆమె “ పార్వతి కృష్ణమూర్తి” పాత్రలను సృష్టించి కొత్త స్త్రీపురుష లోకాన్ని సృజించారు. “ ఇప్పుడు నువ్వు దారి కనిపెట్టావు. ఇవి రాయి. చూడ ముచ్చటైన జంట అవుతారు. కుర్ర పఠితల మనసు తాకుతారు” అని ఆశీర్వదించారట. తన సాహిత్య జీవితాన్ని మలుపు తిప్పిన మల్లాది వారికి తానెప్పుడూ కృతజ్ఞురాలిగానే ఉంటానని ఆమె “పెళ్లి” అనే నవలకు రాసిన ముందు మాట లో చెప్పుకున్నారు. “ మల్లాది వారికి ఋణపడి ఉన్నాను. లేకపోతే ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఆత్మహత్యలు, లేచి పోవడాలు ఇవే రాస్తూ ఉండే దాన్నేమో” అని కూడా ఆమె రాసుకున్నారు. స్త్రీ వాదం అనే మాట వినపడక ముందే రామలక్ష్మి కథలలో పార్వతి తో సహా సుందరి లాంటి పాత్రలు కాలాని కంటే ముందుగా ఆలోచించి స్వతంత్రం గా నిలబడిన సందర్భాలను సృష్టించిన రచయిత్రి ఆమె.

ఆనాటి, ఈనాటి రచయిత్రి కె. రామలక్ష్మి మరణం తో మళ్ళీ అందరూ ఒక్క సారి గా ఆమె రచనలను గుర్తు చేసుకోవటం అవసరం. అభినందనీయం కూడా.

ఒకే ఒక్క రామలక్ష్మి !

కొంత మంది ఉంటారు, వాళ్ళ లాగే మరెవ్వరూ ఉండలేరన్నట్లు. ఎవరేం అన్నా పట్టించుకోనట్లు ఉంటారు. ఎవరిని ఏం అనాలన్నా జంకు,గొంకు లేకుండా మొహం మీద బోలెడు కుండలు బద్దలు కొట్టినట్లు చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళను, ఇంకెవరూ ఏమీ అనలేకపోవటం కాదు. ఎవరేం అన్నా జానే దో అన్నట్లు వాళ్ళుంటారు.  ఇలాంటి కొంత మంది ఆడవాళ్ళ గురించి తెలుగు లో ‘గయ్యాళి గంపలు’ “నోటి దురుసు”లాంటి మాటలున్నాయి. రామలక్ష్మి గారి గురించి, ఈ మాటల  విశేషణాలతో కలిపి విన్నాను కొంత సాహిత్య ఊహ తెలిసిన పిల్ల వయసులో. దాదాపు ఇలాంటి పొగడ్తలతో వున్న మరో రచయిత్రి మా విజయవాడ లోనే కళ్లెదుటే కనిపించే వారు. ఒకరు లత. మరొకరు రామలక్ష్మి. వాళ్ళను చూడటం, వాళ్ళతో మాట్లాడటం చాలా ఫాసినేషన్ గా ఉంటుంది. రామలక్ష్మి ని  నేను రెండు,మూడు సందర్భాలలో కలిశాను. మన గురించి ఆమె ఏం అనుకుంటున్నారో, మనతోనే చెప్పగలిగిన ధైర్యశాలి. అందుకు ఆమె ను మెచ్చుకోవాలి.

అందరూ నడిచిన దారిలో నడవని ఇలాంటి రచయిత్రుల వ్యక్తిత్వం గురించి సమాజానికి చాలానే అభిప్రాయాలుంటాయి. వాటిని ధిక్కరించి వాళ్ళ మొహం మీదనే తిరిగి ఉమ్మేసేంత ధైర్యం ఉన్న రచయిత్రులు మన తెలుగు సాహిత్యం లో  వేళ్ళ మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మార్చి 3 వ తేదీ మరణించిన కె. రామలక్ష్మి.

రామలక్ష్మి గురించి ఇలాంటి మాటలు  వ్యాసంలో  రాయటం నాకేం సంతోషం కాదు. కానీ తప్పదు. నిజాయితీ గా మాట్లాడాల్సిన సందర్భం ఇది.





స్త్రీల గురించి చెప్పటానికి సభ్య సమాజం ( అది సాహిత్య సమాజం కూడా ) కి ఉన్న రెండు ముఖ్య ఉపకరణాలు వారి వైవాహిక జీవితం, రెండోది వారి శీలం లేదా బాహ్య ప్రవర్తన. రామలక్ష్మి, లత లాంటి వాళ్ళ విషయం లో ఇది బాగా నిరూపణ అయింది. రామలక్ష్మి ని రచయిత్రి గా చూడటానికి ముందు ఆమె ను ఆరుద్ర భార్య గా, భర్త ను ‘ అదుపు’లో పెట్టి పెత్తనం చెలాయించే వ్యక్తిగా చూడటం తో పాటు ఆమె “నోటి దురుసు తనం” గురించి మాట్లాడతారు. స్త్రీల గయ్యాళి తనం గురించి మాట్లాడగలిగే సమాజానికి, మగ మహానుభావుల తప్పుల గురించి మాట్లాడే ధైర్యం లేదు. ఇటీవల కొద్ది కాలం క్రితం కొన్ని వీడియో ఇంటర్వ్యూల్లో  ఆమె చేసిన వివాదాస్పద వాఖ్యలతో  నేను కూడా వంద శాతం విభేదిస్తాను. కానీ రామలక్ష్మి  గురించి మొదటి నుంచికూడా ఇలాంటి మాటలతోనే మాట్లాడేవారు కానీ ఆమె సాహిత్యం గురించి మాట్లాడిన వారు తక్కువే.

శ్రీశ్రీ తాగుబోతు తనం గురించి, ఆయన వైవాహిక జీవితం గురించి బాహాటంగా తెలిసినా, ఆయన రచనల వైశిష్ట్యం గురించి మాట్లాడటం ఎప్పుడూ ఆపలేదు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన సాహిత్య గౌరవ మర్యాదలకు ఏ మాత్రం ఆటంకం కాలేదు. కానీ స్త్రీల విషయం లో అలా జరగదు. ఎప్పుడూ వారి వ్యక్తిగత జీవితమే సాహిత్య సమాజానికి చర్చనీయాంశం అవుతుంది.

భార్య భర్తలిద్దరూ ( లేదా సహచరులిద్దరూ) రచయితలైతే, ఫలానా వారి భార్య గానే వారికి  గుర్తింపు తప్ప వారి రచనలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకపోవటం సాధారణమైపోయింది. శివరాజు సుబ్బలక్ష్మి గారికి మరణానికి కొద్ది కాలం క్రితం వరకూ, బుచ్చిబాబు గారి భార్య గానే గుర్తింపు. రామలక్ష్మి విషయం అందుకు మినహాయింపు కాదు. రామలక్ష్మి  మరణ వార్త కు మీడియా వెంటనే ఎన్నుకున్న శీర్షిక “ ఆరుద్ర సతీమణి కన్నుమూత”. తర్వాత దాన్ని మార్చుకున్నాయి. మొన్న మొన్నటి వరకు వికీ లో కూడా రామలక్ష్మి గురించి ఉన్న సమాచారం కేవలం ఆమె ఆరుద్ర భార్య అని మాత్రమే. నిడదవోలు మాలతి పూనుకొని దాన్ని మార్చారు.





రామలక్ష్మి ముందు చనిపోయి ఉంటే “ ఆరుద్ర కు సతీ వియోగం” శీర్షిక గా పెట్టి ఉండే వారు. ఆరుద్ర చనిపోయినప్పుడు “ రామలక్ష్మి కి భర్తృ వియోగం” అని పెట్టలేదు, పెట్టరు కూడా. ఎన్ని పోరాటాలు చేసినా,ఎన్ని ఉద్యమాలొచ్చినా సహచరికి, సహచరుడి పేరు ప్రఖ్యాతులతోనే గుర్తింపు, గౌరవం. ఎప్పటికీ ఆమె ఫలానా వారి భార్య నే.

ఇలాంటి రెండు నాల్కల ధోరణి మీద నే రామలక్ష్మి లాంటి రచయిత్రుల ధిక్కరింపు. చాలా మంది రచయితలు దొంగ చాటు గా మాట్లాడుకునే విషయాలను తప్పుకో, ఒప్పుకో రామలక్ష్మి బహిర్గతం చేశారు. అది శ్రీశ్రీ, ఆరుద్ర ల తగువు కావచ్చు. మరొకటి కావచ్చు. రామలక్ష్మి తాను ఎంపిక చేసుకున్న దారి లో నడిచారు. అది ముళ్ళ బాటే అయినా పూల బాట గా స్వీకరించారు. రామలక్ష్మి సాహిత్య వ్యక్తిత్వం, ఆమె రచనలు దాన్నే ప్రతిబింబించాయి. 60 ల నాటి తరం లో మరో రచయిత్రిని కోల్పోయాము. ఎప్పటిలాగానే, ఎవరైనా చనిపోయినప్పుడే వాళ్ళను , వాళ్ళ రచనలను గుర్తిద్దాము.ముఖ్యం గా రచయిత్రుల విషయం లో.

కల్పనారెంటాల

 

 

 

 

 

 

 
Real Time Web Analytics