నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Showing posts with label తెలుగు సాహిత్యం. Show all posts
Showing posts with label తెలుగు సాహిత్యం. Show all posts

Sunday, July 08, 2012

కీలుబొమ్మలు నవల పై ఓ సంభాషణ


డాలస్ లోని  రేడియో ఖుషీ ఆధ్వర్యం లో  మదర్స్ డే సందర్భం గా  మహిళా సంబరాల కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలను సన్మానించటం లో భాగం గా సాహిత్య రంగం లో  మేం చేసిన కృషి ని గుర్తిస్తూ నాకు, మాలతి గారికి కూడా సన్మానం  చేశారు. సన్మాన కార్యక్రమాలు ఎలా ఉంటాయో, ఎలా జరుగుతాయో బాగానే అనుభవం వున్న మేమిద్దరం  ఆ కార్యక్రమం కంటే కూడా ఆ సందర్భంగా మేమిద్దరం ఒక పూట గడిపే అవకాశం కోసం ఎదురుచూసాము.    ప్రముఖ నవలా రచయిత జి‌.వి. కృష్ణారావు గారు రాసిన నవల “ కీలుబొమ్మలు” చదవటం అప్పుడే  మేమిద్దరం కూడా పూర్తి చేశాము కాబట్టి దాని మీద మాట్లాడాలని అప్పటికప్పుడు అనుకున్నాము. ఇదేదో పెద్ద సాహిత్య చర్చ లాగా కాకుండా చాలా మామూలుగా మేమిద్దరం మా అభిప్రాయాలూ ఒకరితో మరొకరం పంచుకున్నాము. దోసెలు, అరటికాయ కూర, మామిడి  కాయ పప్పు, చింత చిగురు పొడి  తో మంచి రుచికరమైన భోజనం పెట్టడం తో పాటు మా మాటలను ఆడియో, వీడియో ల రూపం లో భద్రపరిచిన మాలతి నిడదవోలు గారికి నా కృతజ్నతలు.
కీలు బొమ్మల పై , ఇతర సాహిత్య విషయాల పై మా ఇద్దరి సంభాషణ ఆడియో, వీడియో ల రూపం లో ఇక్కడ వినండి, చూడండి.
ఆడియో -
http://archive.org/details/InterviewWithKalpanaAndMalarhi
విడియో -
http://archive.org/details/KeeluBommaluDiscussion
రెండు లింకులకీ దారి చూపే పుట ఇదీ, -
http://archive.org/search.php?query=kalpana%20rentala

Saturday, September 03, 2011

'నండూరి' సంస్మరణ లో !

సుప్రసిద్ద పత్రికా సంపాదకుడు , రచయిత, కవి, అనువాదకుడు నండూరి రామ్మోహనరావు గారు రెండు వారాలుగా తీవ్ర అస్వస్థత తో వున్నారన్న వార్తలు వింటూనే వున్నా, ఆయన మరణం తో నిన్నటి రోజంతా ఆయన జ్నాపకాల తలపోత తో గడిచిపోయింది.
నా జర్నలిజం కెరియర్ లో తొలుత నేను పని ప్రారంభించినది నలుగురు అగ్ర శ్రేణి పత్రికా సంపాదకుల దగ్గర కావటం నా అదృష్టం. ఆంధ్ర జ్యోతి వార పత్రిక సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర జ్యోతి దినపత్రిక సంపాదకుడు నండూరి రామ్మోహన రావు, స్వాతి సపరివార పత్రికాధినేత వేమూరి బలరాం, ఆంధ్రభూమి సంపాదకుడు ఏ.బి.కె. ప్రసాద్ ల దగ్గర నా జర్నలిజం వృత్తి మొదలయింది. ఫ్రీలాన్సు జర్నలిస్టు గా కెరియర్ ప్రారంభించటం తో మొదటి ముగ్గురి దగ్గర ఏక కాలం లో పని చేశాను. అది 1985-86 మధ్య కాలం. అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక రెండూకూడా లీడింగ్ లో వుండేవి. నేను జర్నలిజం రంగం లోకి రావటానికి కారకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. ఒకమీటింగ్ కి నేను వ్యాఖ్యాత గా వ్యవహరించినప్పుడు ఎంతో ప్రేమగా వచ్చి పలకరించి, రేపు ఆఫీస్ కి వచ్చి కనిపించుఅన్నారు.సరే అని వెళ్ళి కనిపిస్తే ' మాకు కాలమ్ రాస్తావా?' అని అడిగారు. అలా జర్నలిజం లో నా రంగప్రవేశంనేరుగా ఒక ప్రసిద్ధ వార పత్రిక లో ' టీవీ సమీక్ష ' కాలమ్ తో మొదలయింది. అది చూసి నండూరి వారు తన ఆఫీస్ కిపిలిపించారు. విజయవాడ లో జరిగే అనేక సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నండూరి వారిని అనేక సార్లు అంతకు ముందు చూసినప్పటికీ ఆయన దగ్గర పని చేయటానికి గాను మొదటి సారి వెళ్ళి ఆయనను కలుసుకోవటం మాత్రం మర్చిపోలేని సంఘటన. ఆంధ్రజ్యోతి వారపత్రిక లో నా కాలమ్ చూసి, బాగా రాస్తున్నావని మెచ్చుకొని మాకు కల్చరల్ రిపోర్టింగ్ చేస్తావా? అని అడిగారు.
అలా ఆయన దగ్గర ఆంధ్రజ్యోతి దిన పత్రిక కోసం విజయవాడ లో జరిగే సంగీత, సాహిత్య, నృత్య, నాటక
కార్యక్రమాలకు హాజరై వాటి మీద సమీక్షలు రాసి అందచేసేదాన్ని.
నండూరి చాలా మితభాషి. మాటలోనూ, రాత లోనూ కూడా అనవసర వాక్యం కానీ, వ్యాఖ్య కానీ వుండదు. అందుకే
నండూరి దగ్గర మాట్లాడటమంటే అప్పట్లో భయం గా ఉండేది. కానీ పురాణం , నండూరి వారికి పూర్తి వ్యతిరేకం.
పురాణం వారు మంచి హాస్య చతురులు. మనతో చాలా ప్రేమ గా, ఆప్యాయంగా వుండటంతో పాటు బోలెడు జోకులు
వేస్తారు. ఆయన మన దగ్గర ఫ్రీ గా మెలుగుతారు కాబట్టి ఆయన దగ్గర మాట్లాడటానికి మనకు కూడా ఎలాంటి సంకోచాలు వుండవు.
నేను నండూరి తో ఎక్కువ సేపు గడిపింది 1998 లో ఆయనకు అప్పాజోశ్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ తరఫున 'ప్రతిభా
మూర్తి' జీవిత పురస్కారాన్ని రాజమండ్రి సభలో అందచేసినప్పుడు మాత్రమే. ఆయనకు అవార్డు అందచేసిన ఆ
సభలో ఆయన పరిచయ, సన్మాన కార్యక్రమం లో పాల్గొన్నాను. నండూరి , వారి సతీమణి తో అప్పుడు రాజమండ్రి లో గడిపిన ఆ నాలుగు రోజులతో వ్యక్తిగతంగా వారు మరింత ఆత్మీయులయ్యారు.

నేనూ-నండూరి 'టాం సాయర్'
ఇదంతా వ్యక్తిగత పరిచయం. కానీ ఓ రచయితగా నండూరి మొదట తెలిసినది మాత్రం ' టామ్ సాయర్ ' తోనే.టాంసాయర్, హకిల్బెరీఫిన్, రాజూ-పేద, విచిత్రవ్యక్తి, టాంసాయర్ ప్రపంచయాత్ర,కాంచనద్వీపం లాంటి పుస్తకాలు
ఎంతో ఇష్టం గా చదువుకున్న చిన్న నాటి జ్నాపకాలు ఎంత పెద్ద అయినా మనల్ని వదలవు. అన్నింటికంటే
నాకు బాగా నచ్చినది ' టాం సాయర్'. నిజంగా ఆ పుస్తకం అప్పట్లో తెలుగు అనువాదం చదివి వుండకపోతే అసలు
మార్క్ ట్వేయిన్ లాంటి రచయిత తెలుగు పిల్లలకు పరిచయమయ్యే అవకాశమే లేదు. అది కదా అనువాదం లోని
గొప్పతనం. టాం సాయర్, హాకిల్ బేరీ ఫిన్ లాంటి రచనలతో పెరగని బాల్యం ఒక బాల్యమే కాదు అని చెప్పవచ్చు.
టాం సాయర్ చదివి ఆహా, వొహో అని మురిసిపోవటం ఒక ఎత్తు. నా కిష్టమైన ఆ రచనను మనకిష్టమైన రేడియో
నాటకం గా వినటం మరో ఎత్తు. ఆ నాటకం లో ఒక పాత్ర పోషించే మంచి అవకాశాన్ని నాకు అందచేసి నన్ను
మొదటి సారి రేడియో స్టేషన్ లో అడుగుపెట్టేలా చేసింది మా ఏల్చూరి మురళి. అప్పటి దాకా రేడియో లో ఆయన
గొంతు విని విపరీతంగా అభిమానం పెంచేసుకున్న ' రామం' అన్నయ్య ని కలుసుకొని ఆయన ఆధ్వర్యం లో
సంభాషణ లు ఎలా పలకాలో నేర్చుకున్న ఆ తీపి జ్నాపకం తల్చుకున్న ప్రతి సారీ నన్నోక పసిపిల్ల గా
మార్చేస్తుంది. ఆ నాటకం సందర్భంగా ' రామం' ని, ప్రయాగ రామకృష్ణ ని కలుసుకోవటం , ఆ తర్వాత అదే రేడియో
స్టేషన్ లో వారితో కలిసి పని చేయటం నేను కల లో కూడా వూహించని విషయాలు. వారం వారం రేడియో లో ' టాం
సాయర్' శ్రవ్య నాటిక ( మేము నటించినది) ప్రసారమవుతున్నప్పుడు చెవులొగ్గి విని , మళ్ళీ ఒక సారి ఎవరికి వాళ్లమే
' టాం సాయర్' అయిపోయినట్లు వూహాలోకం లో విహరించేవాళ్లం. ఆ నాటకం లో పాల్గొన్నందుకు నాకు పారితోషికం
కూడా అందచేశారు. నేనందుకున్న ఆ చెక్ నా తొలి సంపాదన. నండూరి వారి టాం సాయర్ తెలుగు
అనువాదానికి ఆ రేడియో నాటిక అనుసరణ. దానికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు సంభాషణ లు రాశారు. ఇలా
నండూరి వారి ' టాం సాయర్' పసి తనం నుంచి నా జీవితం లో కొన్ని ప్రధాన ఘట్టాలకు నాందీవాచకమయింది.
( రామం అన్నయ్య గురించి, టాం సాయర్ శబ్ద నాటకం గురించి మరిన్ని విశేషాలు తృష్ణ రాసినది ఇక్కడ చదవండి)

' అమ్మో ఫిలాసఫీ' అనే భయాన్ని పోగొట్టిన ' విశ్వ దర్శనం'

పసి తనం లో ' టాం సాయర్' ' రాజు-పేద' పుస్తకాల రచయిత గా తెలిసిన నండూరి తర్వాతర్వాత ఒక
సంపాదకీయుడిగా అర్థమయ్యారు. ఆయన సాహిత్య సంపాదకీయాల ద్వారా ప్రముఖ సాహితీవేత్తలెందరి గురించో
తెలుసుకునే వీలు కలిగింది. అన్నింటికంటే నాకు బాగా నచ్చినది ఆయన ' విశ్వ దర్శనం'. 'అమ్మో ఫిలాసఫీ నా '
అన్న భయాన్ని, అది మనకు కోరుకుడు పడని, అవసరం లేని సబ్జెక్టు అన్న అనవసర దురభిప్రాయాన్ని రెండింటిని
ఏక కాలం లో పోగొట్టగలిగిన రచన అది. ' విశ్వ దర్శనం' అప్పట్లో 1980-87 మధ్య ఆంధ్రజ్యోతి వారపత్రికలో
ధారావాహికగా వచ్చేది. అమ్మబాబోయి ఫిలాసఫీనా అనుకునేవారిని ఆహా ఫిలాసఫీ అనిపించేలా మారుస్తుంది ఈ
పుస్తకం . పేరు చూసి విజ్నాన శాస్త్రమేమో ( సైన్సు) అనుకున్నాను. ఇది తత్త్వ విజ్నానమని చదువుతుంటే
అర్థమయింది. చాలా క్లిష్టమైన విషయాన్ని కూడా సరళంగా, సూటిగా ,అర్థమయ్యేలా రాయగలగటం నండూరి
ప్రత్యేకత. తత్త్వ శాస్త్రం లో ఆసక్తి వున్న వారు చదవగలరు కానీ ఆ విషయ పరిజ్నానం , ఆసక్తి లేని వారిని కూడా
చదివింపచేసి దాని పట్ల అభిరుచి, అనురక్తిని పెంచగలిగే రచన ఇది. అందుకు నండూరి ఎంచుకున్న రచనావిధానం
కారణమన్నది నిర్వివాదాంశం. విశ్వదర్శనం ( మొదటిభాగం) పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత దర్శనం. రెండో భాగం
భారతీయ తత్త్వ చింతనా రచన. అసలే ఫిలాసఫీ, పైగా పాశ్చాత్య తత్త్వశాస్త్రం అనగానే భయమో, బోరుగా
ఉంటుందేమో అన్న చిన్న అనుమానం మొదట కలగటం సహజం. ఆ విషయం ఆ రచన ప్రారంభించటానికి ముందే
నండూరి కి తెలుసు. అందుకే ఆయన భిన్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. పాశ్చాత్య తత్త్వ శాస్త్ర పరిచయాన్ని
కేవలం సిద్ధాంతం ద్వారా చెప్పకుండా దార్శనికుల ద్వారా చెప్పారు. కేవలం దార్శనికుల సిద్ధాంతాల పరిచయానికే
కట్టుబడకుండా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓ కథ లాగా మధ్యలో కలగలిపి చెప్పారు. అలా చెప్పటం వల్ల
విషయం సులభంగా అర్థమవటమే కాకుండా చాలా సాఫీ గా సాగిపోయింది. పాశ్చాత్య తత్త్వ సిద్ధాంత పరిచయ
ఉపోద్ఘాతం ఆయన రాముడు ,వశిష్టుడు వారి దగ్గరకు వెళ్ళి యోగవాశిస్ఠమ్ చెప్పించుకునే పరిచయం తో
ప్రారంభించారు. అలా అవాకాశం దొరికినప్పుడల్లా మనకు తెలిసిన భారతీయ తత్త్వ సిద్ధాంత ఉదాహరణలతో
చెప్పటం వల్ల పాఠకుడి కి అదేదో అసలు తమకు సంబంధం లేని విషయం అని ఏ మాత్రం అనిపించదు. పైగా నండూరి
ది ఒక ప్రత్యేకమైన సున్నితమైన హాస్యం. అది మనకు ఆయన రచనలన్నింటిలోనూ కనిపిస్తూఉంటుంది. దాని వల్ల
కూడా అంత సీరియస్ విషయాన్ని కూడా పాఠకుడు చాలా హాయిగా చదివి అర్థం చేసుకోగలుగుతాడు. సోక్రటీస్ '
సింపోజియం ' గురించి రాసినప్పుడు అగాథాన్ అందరికీ మద్యం అందిస్తున్నాడు అని మామూలుగా రాయకుండా '
మధ్య మధ్యే పానీయం సమర్పయామి' అన్నట్లు అందరికీ మద్యం పోశాడు అని రాశారు. పూజా తంతు లోని ఒక
చర్య ను నండూరి ఆ సందర్భం లో వాడినప్పుడు పాఠకుడికి ఆ సీన్ కళ్ల ముందు కదిలి పెదవులపై ఒక హాస్య రేఖ
మెరిసే వీలుంది.
అలాగే సోక్రటీసు, ప్లేటో ల మధ్య గురు శిష్య సంబంధాన్ని చెప్పేందుకు ఆయన వాడిన పోలిక వారిద్దరూ రామకృష్ణ
పరమహంస, వివేకానందుడు లాంటి వారు అని. ఆ ఉదాహరణ ఒక్కటి చాలు సోక్రటీస్, ప్లేటో ల సంబంధాన్ని సరిగ్గా
అర్థం చేసుకునేందుకు. ఇలా నండూరి ఆ వ్యాసాలు కదళీపాకం లా వుండేందుకు కావల్సిన అన్నీ
జాగ్రత్తలు ఇంత శ్రద్ధగా తీసుకోవటం వల్లనే ' విశ్వ దర్శనం' మామూలు పాఠకుడి హృదయం లోకి చేరి అక్కడ అలా
నిలిచిపోయింది . తత్త్వ శాస్త్రం లో విషయం కన్నా ముందు ఆ పరిభాష అర్థమవటానికి కొంచెం కష్టపడాలి.
ఆ విషయాన్ని ముందే అర్థం చేసుకున్న నండూరి ప్రతి తెలుగు అనువాదానికి ఇంగ్లీష్ పదాన్ని కూడా బ్రాకెట్ లలో
ఇచ్చి, పుస్తకం గా వేసినప్పుడు మొత్తం పారిభాషిక పదాల లిస్ట్, ఆసక్తి మరింత వుంటే లోతైన విశ్లేషణ కోసం
చదవాల్సిన పుస్తకాల జాబితా కూడా అందచేశారు. ఈ రకంగా ఒక పాఠకుడు ఒక రచన ను చదివి అర్థం
చేసుకోవాలంటే ముందు రచయిత ఏమేం చేయాలో అవన్నీ చాలా జాగ్రత్తగా ముందు చూపుతో నండూరి చేసి
పెట్టడం వల్ల ' విశ్వ దర్శనం' నేరుగా పాఠకుడి కి చేరవలసిన పద్ధతి లో సులువు గా చేరింది. అప్పట్లో ఆ ధారావాహిక
కు, తర్వాత పుస్తకం గా వేసినప్పుడు కూడా మంచి పేరు లభించింది. మొత్తంగా ఆ సీరియల్ పూర్తయ్యేటప్పటికి (
ఏడేళ్ళ సుదీర్ఘ కాలమనుకోండి) నాలాంటి కొందరికీ తప్పనిసరిగా ఫిలాసఫీ అన్న బెరుకు పోయి ఉంటుంది. ఆయన
ఆ రచన రాసిందే అందుకు. ఆ విషయం లో ఆయన కృతకృత్యులయ్యారు. ఒక రచయిత గా తాను
రాయవలసినవన్నీ రాసేసి ,తరతరాల తెలుగు వారికోసం 'విశ్వదర్శనా'న్ని అందించిన 'నరావతారం' నండూరి
శాశ్వత నిద్ర లోకి జారుకున్నారు. ఇప్పుడు మేల్కొనాల్సింది ఆయన రచనలు చదవకుండా నిద్రాణమైనవారు.

కల్పనారెంటాల

Thursday, September 01, 2011

ఒకే ఒక్క సరస్వతీ పుత్రుడు " పుట్టపర్తి" !



అది ఒకానొక సంవత్సరం.(1985-90 మధ్య)
స్థలం: విజయవాడ
విజయవాడ నార్త్ రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో మాట్లాడటానికి సరస్వతీ పుత్ర,, పద్మశ్రీ శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వచ్చారు. ఆయన బహు భాషా పాండిత్యం గురించి మా నాన్న గారి దగ్గర విని ఉండటమే కాకుండా, శివతాండవం లాంటివి ఒక సారి అలా తిరగేసిన మిడి మిడి జ్నానంతో ఆయనను ఇంటర్వ్యూ చేయటానికి సాహసం చేసి వెళ్ళాను.
కడప నుంచి ఆ మీటింగ్ కోసం వచ్చిన పుట్టపర్తి వారు విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగుండా వున్న దుర్గాభవన్ లాడ్జీ లో దిగారు. నేను వెళ్ళేసరికి అప్పటికే పుట్టపర్తి గారి దగ్గర నాగళ్ళ గురుప్రసాద రావు గారు, పుట్టపర్తి గారి అనుంగు శిష్యుడు,( దత్తపుత్రుడులాంటి) కవి, ఆకాశవాణి ఉద్యోగి శశిశ్రీ వున్నారు.
పుట్టపర్తి వారిది మంచి నిండైన విగ్రహం. ఖద్దర్ జూబ్బా, ధోవతీ కట్టుకున్నారు.ఎడమచేతి పై కండువా వేసుకొని కూర్చొని వున్నారు. ఆయనవి పద్మాల్లాంటి కళ్ళు.
14 భాషలు ఆయన సొంతం
పుట్టపర్తి వారు14 భాషల్లో పండితుడు. శతాధిక గ్రంథ కర్త. కవి, విమర్శకుడు, వాగ్గేయకారుడు. సాంప్రదాయికంగా గురువు దగ్గర సంగీత, నాట్యాలను అభ్యసించారు ఆయన. 14 భాషలను కేవలం చదవటానికో, మాట్లాడటానికో మాత్రమే నేర్చుకోలేదు. ఆయా భాషల్లో రచనలు చేసేంత సామర్ధ్యం సంపాదించారు. “Leaves in the Wind" అనేది ఆయన ఇంగ్లీష్ కవితల సంకలనం పేరు. " భక్తాచే గాథే" అనేది ఆయన మరాఠీ పుస్తకం పేరు. విశ్వనాథ సత్యనారాయణ గారి " ఏకవీర" నవలను మలయాళం లోకి పుట్టపర్తి వారు అనువాదం చేసిన సంగతి చాలా మందికి తెలియదు. " శివ సహస్రం " ఆయన సంస్కృత రచన. జీవితాంతం ఆయన జాతీయవాదిగా గడిపారు. గాంధీజీ మరణం తో ఆయన రాసిన " గాంధీజీ mahaaప్రస్థానం" మరువ లేని రచన గా చెప్పుకుంటారు. అనంతపురం జిల్లా పెనుగొండ వాసి కావడం తో తెలుగు , కన్నడ భాషలు సహజంగానే వచ్చాయి. శ్రీవైష్ణవుడు కావడం తో తమిళం అలవడింది. సంత్ సాహిత్యం చదవడం కోసం మరాఠీ, గుజరాతీ భాషలు నేర్చుకున్నారు. హిందీ భాష అంటే ఆయనకు ప్రాణం. పుట్టపర్తి వారి కుటుంబం లోని వారందరికీ తులసీ దాస్ రాసిన " రామచరిత మానస్ " కంఠతా వచ్చు. అది వారికి నిత్య పారాయణ గ్రంథం. పుట్టపర్తి వారి సతీమతి కనకమ్మ కూడా గొప్ప పండితురాలు. కవయిత్రి. శ్రీవైష్ణవులకు శరణాగతి వేదం లాంటి వాల్మీకీ రామాయణం లోని ఆరు కాండ లను 24 గంటల్లో పారాయణ చేసి ఉద్యాపన చెప్పగలిగిన భక్తురాలు. ఆ సరస్వతి పుత్రుడి కి ఆమె నిజంగా సహ ధర్మచారిణి.
శివాయ విష్ణురూపాయ!
సంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుంబం లో పుట్టి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఆచరించినప్పటికీ శైవ, విష్ణు భేదాలు ఆయన్ని కట్టి పడేయలేదు .' శివాయ విష్ణురూపాయ' అని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టే ఆయన ప్రొద్దుటూరు లోని అతి పెద్ద ఆగస్తీశ్వర స్వామి గుళ్ళో నియమంగా 108 ప్రదక్షిణాలు ప్రతి రోజూ చేసి అక్కడ కూర్చొని రాసిన రచన " శివ తాండవం". నేను ప్రొద్దుటూరు వెళ్ళి ఆ గుడి ని దర్శించి పుట్టపర్తి వారిని, వారి ' శివతాండవాన్ని' తలుచుకున్నప్పుడు " సంగీత, నృత్య , సాహిత్యాల సమ సమ్మేళనమైన ఆ రచన కేవలం దైవకృప కు నిదర్శనమని" ఆయన చెప్పిన మాట గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి.
ఆయన జీవించినది 76 ఏళ్ళు మాత్రమే . కానీ ఆయన చేసిన సాహిత్య కృషి మాత్రం ఒక జీవిత కాలం కంటే ఎంతో ఎక్కువ. " సరస్వతి పుత్ర" అన్న ప్రతిష్టాత్మకమైన బిరుదు ఆయనకు అక్షరాలా సరిపోతుంది.
ఇంత ప్రతిభావంతుడి కి ఎలాంటి అకడమిక్ క్వాలిఫికేషన్స్ అక్కరలేదు. పరీక్షల ద్వారా ఆయన పాస్ అయినది మద్రాస్ విశ్వ విద్యాలయం నుంచి తెలుగు లో " విద్వాన్" కోర్సు మాత్రమే. పద్నాలుగేళ్లకే కవి, రచయిత అయిన కుర్రవాడికి అకడమిక్ చదువులు నిజంగా అవసరమా? అవసరం లేదని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పవచ్చు. పుట్టపర్తి వారు విద్వాన్ పరీక్షలకు వెళ్లినప్పుడు ఆయన రచన ' పెనుగొండ లక్ష్మి' ఆయన పాఠ్య గ్రంథంమయింది. ఆయన రచన కు ఆయనే విద్యార్థి. ఇది ఒక్క పుట్టపర్తి వారి విషయం లో తప్ప బహుశా ఏ రచయిత జీవితం లోనూ జరిగి ఉండదు.

ఉత్తమ పాఠకుడే సద్విమర్శకుడు
స్వ పరిచయం చేసుకొని వచ్చిన పని చెప్పగానే ' పుట్టపర్తి ' వారు ఎంతో ఆదరంతో ' దానికేం భాగ్యమమ్మా కూర్చో' అన్నారు. అటు నాగళ్ళ గారు, ఇటు పుట్టపర్తి వారు కూడా మొదట మా నాన్నగారి గురించి కుశల ప్రశ్నలు వేశారు.
తర్వాత నాగళ్ళ వారు " ఈ తెలుగు సాహిత్య విమర్శకులంతా అదేమిటో రాయలసీమ వారే. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, రాచమల్లు రామచంద్రారెడ్డి, వల్లంపాటి అందరూ రాయలసీమ వారే. ఆంధ్రా నుంచి టి. ఎల్. కాంతారావు లాంటి వారు వున్నారనుకోండి' అన్నారు. అప్పుడు పుట్టపర్తి వారు సాహిత్య విమర్శ, విమర్శకులకు సంబంధించి తన అభిప్రాయాలూ ఇలా చెప్పారు. సీరియస్ సాహిత్య విమర్శకులంతా అంటూ ఒక తిట్టు పదం లాంటిదేదో ఉపయోగించారు. సీనియర్ సాహిత్య విమర్శకులుగా పేరు పడ్డ వాళ్ళ గురించి
విమర్శిస్తూ ఆయన , విమర్శకుడు అనే వాడు ఎలా వుండాలో చెపుతూ " ఉత్తమమైన పాఠకుడే మంచి విమర్శకుడు కాగలడు. వాళ్ళ జీవిత సంస్కారం, అభిరుచి ఇవన్నీ కలిసి ఒకరిని మంచి పాఠకుడి గా తయారుచేస్తాయి" అన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన ఆ మాట అలా నా మది లో నిలిచిపోయింది. ఇప్పటికీ " కొందరి సాహిత్య విమర్శలు" చూస్తే ఆ రోజు పుట్టపర్తి వారు అన్న మాట గుర్తుకు వస్తుంది.
సరే, ఇలాంటి మామూలు మాటలేవో అయ్యాక నాగళ్ళ గారు సెలవు తీసుకున్నారు.
నన్ను పరీక్ష చేసేందుకొచ్చినావా ఏందీ?
ఆ తర్వాత నా ఇంటర్వ్యూ మొదలయింది." మీరు బహు భాషా పండితులు కదా. 14 భాషల్లో కూడా రాయడం, చదవడం అంతా క్షుణ్ణంగా వచ్చా?" అని నెమ్మదిగా మొదటి ప్రశ్న వేశాను.
" ఏమ్మా! ఇప్పుడు గానీ నువ్వు నన్ను పరీక్ష చేసేందుకొచ్చినావా ఏందీ? " అంటూ ఆయన నోరారా నవ్వేశారు.
' అయ్యయ్యో లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. మీకు తెలియనిది కాదు, పాఠకులకు తెలియటం కోసం కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది" అంటూ నేను నీళ్ళు నములుతుంటే తల వూపుతూ అడుగు లే అన్నారు.ఇక అక్కడి నుంచి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వివరంగా చెప్పుకుంటూ వచ్చారు.
ఆ ఇంటర్వ్యూ లో ఆయన తన ప్రసిద్ధ రచన ' శివతాండవం' గురించే కాకుండా ఆనాటి సాహిత్య విమర్శ, విలువల
గురించి కూడా ఎన్నో విలువైన అభిప్రాయాలు వెలువరించారు. ' సాహిత్యం అనేది పిచ్చివాడి చేతిలో రాయి లాగా
మారిపోయిందని' ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారల్ మార్క్స్ ఓ మహర్షి అని మెచ్చుకున్నారు.
మహోన్నత మూర్తులు
ఆ ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు మా నాన్నగారు నన్ను కూర్చొబెట్టుకొని పుట్టపర్తి వారి గొప్పతనం ఎలాంటిదో,
ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు ఎలాంటివో చెప్పుకొచ్చారు. దానితో పాటు కొన్ని హెచ్చరిక లు కూడా చేశారు.
పుట్టపర్తి లాంటి పండితుడి ని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్లినప్పుడు ఎంత వినయం గా ఉండి ప్రశ్నలు వేయాలో ,
అసలు ఆయనను కలుసుకొని మాట్లాడటం ఎంత అదృష్టమో వివరించి చెప్పారు. నిజంగా పుట్టపర్తి వారిని కలిసి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాక మా నాన్నగారు చెప్పిన విషయాలు ఎంత అక్షర సత్యాలో నాకు అర్థమయింది. అంత పండితుడి లో లేశమాత్రమైనా గర్వపు ఛాయలు కనిపించలేదు. ఆయనకంటే వయస్సులోనే కాదు , జ్నానం లో కూడా అతి చిన్న దాన్ని అయిన నన్ను ఆయన ఎంత ప్రేమ గా, ఎంత గౌరవించి మాట్లాడారో తలుచుకున్నపుడు మన పూర్వ తరం నుంచి మనం నేర్చుకోవాల్సిన సంస్కారం ఇదే కదా అనిపిస్తుంది. తన కూతురు ఒక పండితుడి ని కలుసుకొని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు పెద్దవారితో వినయంగా ఎలా మాట్లాడాలో ఒక తండ్రి నేర్పి పంపిస్తే, మరో 'అయ్య ' అపర సరస్వతీ పుత్రుడైనప్పటికీ వచ్చినది తన సొంత బిడ్డ అన్నట్లు ప్రేమాభిమానాలతో ఆదరించి విలువైన విషయాలను విశదంగా చెప్పి పంపారు.
పద్మశ్రీ వస్తే ఏంటీ? నా నిద్ర చెడగొడతావా?
పుట్టపర్తి వారి వర్థంతి అనుకోగానే రేడియో రోజుల నాటి నాకు పరిచయమున్న వారి కుమార్తె నాగపద్మిని గుర్తొచ్చారు. ఆమెకు ఫోన్ చేస్తే మా అయ్య అంటూ ఎన్నో విలువైన జ్నాపకాలను నాతో ఆత్మీయంగా పంచుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆమె చెప్పారు.
" రాత్రి పన్నెండున్నర గంటలప్పుడు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పేరిట " పుట్టపర్తి వారి సాహిత్య కృషి కి గుర్తింపు గా పద్మశ్రీ అవార్డ్ ను అందచేస్తున్నట్లు" టెలిగ్రామ్ వచ్చింది. అప్పటి దాకా నిద్ర పట్టక అవస్థ పడుతున్న అయ్య అప్పుడే నిద్ర లోకి జారుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ వచ్చిందన్న సంతోషం తో నేనేళ్లి అయ్య ను నిద్ర లేపి అవార్డ్ సంగతి చెప్పాను. అయ్య అసలు ఆ అవార్డ్ ని ఏ మాత్రం పట్టించుకోలేదు. " పద్మశ్రీ వస్తే ఏం? నా నిద్ర చెడగొట్టి చెప్పాలా? వస్తే వచ్చింది. పొద్దుట చూసేవాడిని కదా" అన్నారు. అయ్య అంత సింపుల్ గా వుండేవారు.
పుట్టపర్తి కల నెరవేరెనా?
మార్క్స్, అరబిందో సిద్ధాంతాల మేలుకలయిక తో ఓ కొత్త సిద్ధాంతానికి రూపకల్పన చేయాలని పుట్టపర్తి ఎంతో తపించారు. ఆ కొత్త సిద్ధాంతమే సమాజం లోని అన్నీ సమస్యలకు పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి వారి కి ఇచ్చిన నాలుగన్నర గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూ లో తన తండ్రి పుట్టపర్తి వారు చెప్పిన ఈ సంగతి ని గుర్తు చేసుకొని ఆయన కల సాకారమయ్యే సుదినం ఏదో ఒక నాడు వస్తుందేమో ఆశిద్దామని ఆమె అన్నారు.

లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రుడు
ఆ అపర సరస్వతి పుత్రుడికి సహజంగానే పెద్దలు చెప్పినట్లు లక్ష్మీ కటాక్షం కలగలేదు. ఎన్నో క్లిష్టమైన ఆర్థిక సమస్యల్లో వున్నప్పుడు స్నేహితులు, ఆయన దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులు ఆయనకు సహాయపడ్డారు. " ప్రబంధ నాయికలు" లాంటి పుట్టపర్తి వారి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్య పుస్తకంగా పెట్టినప్పటికీ అది ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఉపయోగం లభించలేదు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించినా, ప్రతిష్టాత్మకమైన " సరస్వతి పుత్ర" " మహాకవి" లాంటి బిరుదులు ఆయనను వరించినా ఆయనకు లభించింది కీర్తి మాత్రమే కానీ కుటుంబ జీవనానికి అవసరమైన కాసులు ఆయనకు దక్కలేదు.
'శివతాండవ' కృతికర్త మాటలు
శివతాండవం రచన ను 1985 లో గుంటూరు కు చెందిన రవి కళాశాలల అధినేత, సహృదయుడు ' ధన్' పునర్ముద్రించినప్పుడు పుట్టపర్తి వారు తన ముందుమాట లో శివతాండవం రచన గురించి రాసుకున్న మాటలు ఈ సందర్భం లో గుర్తు చేసుకోవడం ఎంతైనా సముచితం.
" ఇప్పటికీ శివతాండవం కనీసం పది సార్లు అయినా ప్రింట్ అయి ఉంటుంది. కానీ నేను ఆర్థికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరూ, ప్రతిష్టా సంపాదించుకోవాలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితం లో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఒక సారి గుంటూరు కి సాహిత్య మిత్రులు కొందరు నన్ను ఆహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యం కూడా సరిగా లేదు అప్పుడు. ప్రయాణానికి కావల్సిన జాగ్రతలన్నీ వారే చూచుకున్నారు.రామాయణం పైన నా ఉపన్యాసం. ఒక వెయిన్నూట పదహార్లు ఇచ్చి సత్కరించినారు. ఆ సందర్భం లో శ్రీ ధన్ గారు నాకు పరిచయమైనారు. ఆయన సాహితీ ప్రేమికుడు. జీవితం లో కష్టసుఖాలనేరిగిన వాడు. నన్ను గూర్చి వారికంతకు ముందే తెలుసు. వారు కొన్ని వేలు ఖర్చు పెట్టి మంచి బొమ్మలతో పాటు శివతాండవాన్ని మరలా ముద్రించి ఇస్తానని పూనుకున్నారు. వారి యౌదార్యాన్ని నేనెట్లు గౌరవించవలెనో నాకు తెలియదు. చిరంజీవి రామమోహనరాయ్, మరి కొందరు వారి ప్రయత్నానికి హర్షించి వారికి తోడైనారు. వీరందరికిన్నీ గూడా మనస్ఫూర్తిగా కృతజ్నతలు తెలుపుకోవడం తప్ప మరేమీ చేయలేను.
'శ్రీశ్రీ' గారి ' మహా ప్రస్థానం' లాగా ' శివతాండవా'న్ని ముద్రించి వెల పెట్టి నాకార్థికంగా యేదైనా ఉపయోగపడేటట్లు చూడాలని శ్రీ ధన్ గారు సంకల్పించారు. ఋణానుబంధాలు మహా విచిత్రంగా ఉంటాయి. భౌతికాలైన కారణాలతో వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం నా యోగ్యత కు మించిన పని.
నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో వినిపించడం జరిగింది. వినిపించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలే తప్ప , మరేమీ వినలేదు. ఇతర భాషల వారూ, తెనుగు రాని వారూ కూడా దీన్ని విని ఎంతో మెచ్చుకునేవారు. తిరువాన్ కూర్ లో వున్నప్పుడు , ఢిల్లీ లో వున్నప్పుడు గూడా దీన్ని గూర్చిన పొగడ్తలే. ఢిల్లీ లో రష్యన్ ఎంబసీ వారు కూడా ' శివ తాండవా'న్ని చదివించుకొని విన్నారు. ఆ కావ్యం లో అనుభూతంగా వచ్చే ' లయ' వాళ్లనంతగా ఆకర్షించి ఉంటుందనుకున్నాను. దీనిని వ్రాసేటప్పుడు ప్రొద్దుటూరు లో ఆగస్తీశ్వర స్వామికి చాలా నియమం గా ప్రదక్షిణాలు చేసేవాడిని. రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. అప్పుడు వ్రాసినదీ కావ్యం. కావ్యం చాలా చిన్నగా ఉందని, కొద్దిగా పెంచుదామని ఎంతెంతో ప్రయత్నించినాను. కానీ నాకు సాధ్యం కాలేదు. భగవదిచ్చ ఇంతేనెమో అనుకున్నాను.
ఈ కావ్యం లో సంగీత , నాట్య, సాహిత్య సంకేతాలు పెనవేసుకొని వున్నాయి. ఆ మూడింటి యొక్క సాంప్రదాయాలు కొంతకు కొంత తెలిస్తే గానీ, ఈ కావ్యం అర్థం కాదు. దీనిపైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బావుంటుందని చాలా మంది నాకు సూచించినారు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం. ఆ పని ఎప్పుడూ చేయలేదు.
అంతమాత్రమే కాదు. కాలం లో ఒక పుస్తకం వ్రాయడం ఒక నేరం చేసినంత పని. రాస్తే, ప్రింట్ కావడం కష్టం. ఎవ్వడో పబ్లిషర్ వేటగాడి వలె కాచుకొని ఉంటాడు. ఇక మనమే అమ్ముకోవాలంటే హత్యానేరం చేసినవాడు తప్పించుకోవడానికి చేసేంత ప్రయత్నం చేయాలి. బాధలు ప్రతి రచయితా అనుభవిస్తున్నవే.
నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యము, పద్యమూ రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరు శివతాండవ గ్రంథం పెనవేసుకొని పోయినవి. ఇది కూడా ఒక భగవత్ చిత్రమే. ఈ గ్రంథం ఇతర భాషల్లో కూడా పరివర్తితమయింది. జర్మన్ లోకి ఎవరో చేసినారు.హిందీ లోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు.నేను వానిని చూచినాను కూడా. ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం కూడా చాలా కష్టం. ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దం పైన ఆధారపడుతుంది. ఇంగ్లీష్ లోకి తెద్దామని నేనే ఎన్ని సార్లు ప్రయత్నించినాను. కానీ ఆ భాషాంతీరీకరణం ఎప్పుడూ నాకు తృప్తీ నిచ్చింది లేదు. కాళిదాసు ఎన్నో గ్రంథాలు వ్రాసినాడు. ఆయన మేఘసందేశానికేందుకో గొప్ప అదృష్టం పట్టింది. విశ్వనాథ వారు ఎక్కడకు పోయినా కిన్నెరసాని పాటల్నే చదవమనేవారు.
శ్రీ బాపు గారు ప్రసిద్ధ చిత్రకారులు. వారికేన్నో పనులు. బహుకార్యవిష్టులైన్నీ నాపై దయ తో చిత్రాలని గీచి ఇచ్చినారు.వారికి నా మనః పూర్వక కృతాంజలి. ఇంకొక సారి శ్రీ ధన్ గారికి, తక్కిన మిత్రులకు నా కృతజ్నతలు తెలుపుకుంటున్నాను.
పుట్టపర్తి నారాయణాచార్య , నవంబర్, 1985.

సరస్వతీ పుత్రుడు ఒక్కడే!

పుట్టపర్తి వారు తన బిరుదు కు తగినట్లు నిస్సందేహం గా సరస్వతి పుత్రుడు. ఆ బిరుదు కేవలం ఆయనకొక్కరికే
సొంతం. ఆ బిరుదు ఆయన పేరుతో చక్కగా కలిసిపోయింది. తెలుగు సాహిత్య లోకం లో మనకున్నది ఒకే ఒక్క
సరస్వతి పుత్రుడు. ఆ పేరు చెప్పగానే ఎవరికైనా స్పురించేది, స్ఫురించాల్సింది పద్మశ్రీ పుట్టపర్తి
నారాయణాచార్యులు మాత్రమే. ఆ బిరుదు ని ఇవాళ్టి వార్తాపత్రికల్లో " సరస్వతి పుత్రుడికి సహాయం చేయండి" లాంటి శీర్షికల దగ్గర చూస్తుంటే కొంచెం బాధ కలుగుతుంది. తెలివైన విద్యార్థి అనో, పేద విద్యార్థి అనో రాస్తే సరిపోయే దానికి అని ఓ పదో క్లాస్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి ని " అపర సరస్వతీ పుత్రుడు" అనటం ఎంత సమంజసమో పత్రికల వారు ఆలోచించుకోవాలి.
సెప్టెంబర్ 1, 1990 న పుట్టపర్తి వారు భౌతికంగా కాల ధర్మం చెందారు. ఇది ఆయన 21 వ వర్థంతి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ తెలుగు సాహితీ లోకం ఆయనను ఎన్నటికీ మరువదు.ఎప్పటికీ ఆయనొక్కడే " సరస్వతి పుత్రుడు".

కల్పనా రెంటాల

Friday, September 24, 2010

చుప్కే...చుప్కే...చోరీ-2





అఫ్సర్ నా నోరు మూయించారని నేను బ్లాగుముఖంగా వొప్పుకునేటప్పటికి ఎంత మంది పురుషులు కళ్ళు, యాంటీ స్త్రీవాదుల కళ్ళు చల్లబడ్డాయో.....నాకు తెలుస్తూనే వుంది...

అఫ్సర్ నాకు చెప్పిన విషయ కథాక్రమంబెట్టిదనిన....

ఇంక హాస్యం గా రాయటం మన వల్ల కాదు బాబు....నా ఒరిజినల్ స్టయిల్ లోకి వచ్చేస్తున్నాను....

శారద నటరాజన్, రావూరి భరద్వాజ, ఆలూరి భుజంగరావు ముగ్గురూ తెనాలిలో వుండగా మంచి మిత్రులు..ఒకే చోట కలిసి బతికారు. స్నేహాన్ని, ప్రేమను, కష్టాల్ని కన్నీళ్ళను కలిసి పంచుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు. శారద నటరాజన్ హోటల్ లో సర్వర్ గా పనిచేసిన సమయం లో రావూరి భరద్వాజ గారు ఏవో చిన్న చిన్న కూలీ పనులు చేసుకొని బతికారట. సరే, ఇక ఆలూరి భుజంగరావు గారి వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మనకు వివరాలు తెలియదు కానీ ఆయన ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆయన కొన్ని రచనలు అచ్చం చలం లాగా రాశారట. మరీ ముఖ్యంగా డబ్బు కోసం రాసిన శృంగార/ డిటెక్టివు రచనల్లో చలం శైలిని బాగా అనుసరించరే వారట.
ఇక శారద కథ “స్వార్థ పరుడు” విషయానికి వస్తే, ఆ కథ వెనక కథ ఏమిటో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం లేదు.
ముగ్గురూ కలిసి మెలిసి వుంటున్న ఆ కాలంలో సాహిత్య చర్చలు చేసేటప్పుడు కొన్ని రకాల ఇతివృత్తాల్ని అనుకొని వాటి మీద రచనలు చేయాలని అనుకొనివుండొచ్చు. అంతే తప్ప రావూరి భరద్వాజ గారికి శారద రచనల్ని అనుసరణ చేయాల్సిన అవసరం వుంటుందనుకోనని అఫ్సర్ అంటాడు. పైగా, వాళ్ళ మధ్య వున్న స్నేహబలం కూడా గట్టిదే.

శారద సాహిత్యాన్ని 2002 లో తెనాలి లో శారద సాహిత్య వేదిక వాళ్ళు ప్రచురించి ఆవిష్కరణ సభ చేసినప్పుడు రావూరి భరద్వాజ ఆ సభలో ప్రసంగించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారట. ఆలూరి భుజంగరావు గారు శారద జీవితం గురించి " సాహిత్య బాటసారి శారద" పేరుతో ఒక పుస్తకమే ప్రచురించారు. ఈ పుస్తకం తనకి నచ్చిన పుస్తకాల్లో వొకటి అంటాడు అఫ్సర్. రచయితల మధ్య స్నేహాలు కనుమరుగయిపోతున్న ఈ కాలంలో ఆ పుస్తకం ప్రతి వొక్కరూ చదవదగిందని అంటాడు.

ఇంత చెప్పాక...ఇక నోరు తెరిచి మాట్లాడటానికి ఏముంటుంది? అసలైనా డ్రైవింగ్ చేసేటప్పుడు సాహిత్య చర్చలేమిటి? అంటూ సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతూ తల పక్కకు తిప్పేసుకున్నాను.

నా గ్రహచారం బాగలేదని తెలుసు కానీ ఇంత అడ్డంగా అఫ్సర్ కి దొరికిపోతాననుకోలేదు..

సరే, ఈ విషయం గురించి నేరుగా రావూరి భరద్వాజ గారినే అడిగి ఆయన ఏం చెప్తారో తెలుసుకుందామనుకున్నాను కానీ పాపం ఆయనకు వొంట్లో బాగుండక ఆస్పత్రి లో వున్నట్లు తెలిసింది. నిజానికి ఆయన ఆరోగ్యం బాగుంది వుంటే, ఈ వారం టెంపుల్ టెక్సాస్ లోనూ, వచ్చే నెల ఇండియానాపాలిస్ లోనూ జరగనున్న సాహిత్య సభలకి రావాల్సింది.
ఎన్నో మంచి మంచి అనువాదాలు చేసి చివరి రోజుల వరకూ సాహిత్యపరం గా ఎంతో యాక్టివ్ గా వున్న ఆలూరి భుజంగరావు గారు రెండేళ్ళ క్రితమే మరణించారు...ఎవరికైనా భుజంగరావు గారి " సాహిత్య బాటసారి శారద" పుస్తకం దొరికితే మనకు శారద జీవితం గురించి , సాహిత్యం గురించి మరీన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.

చివరగా నేను చెప్పబోయేదేమిటంటే....ఇంతకు ముందు పెట్టిన డిమాండ్ నే మళ్ళీ పెట్టడం....
అఫ్సర్ బుర్రలో చాలా సాహిత్య విశేషాలున్నాయి. ఇలా ఏదో సందర్భం వచ్చినప్పుడు నాకు చెప్తూనే వుంటారు గానీ వాటిని అక్షరబద్ధం చేయమంటే బద్దకిస్తూ వుంటారు.
చాలా సంవత్సరాలు ఆంధ్ర జ్యోతి తదితర సాహిత్య పేజీలు, ఆదివారం సంచికల నిర్వాహకులుగా వుండడమే కాక, చాసో నించి ఈ తరం రచయితల దాకా కనీసం మూడు తరాల సాహిత్య వేత్తలతో తనకి వున్న సన్నిహిత పరిచయాలు ఎంతో విలువయినవి. అలాగే, ఎన్నో వాద వివాదాలకి ప్రత్యక్ష సాక్షి కూడా. వాటి గురించి విలువైన సమాచారాన్ని తన బ్లాగు ద్వారానైనా మనందరికి తెలియచేస్తే బావుంటుంది కదా....

ఈ పోస్ట్ రాయడానికి ప్రధాన కారణం కొన్ని సార్లు కొన్ని విషయాల్లో పైకి కనిపించేది చూసి అదే నిజమని మనం పొరపాటు పడతాం. భరద్వాజ గారిది అనుసరణేమో అని నేను పొరపాటు పడ్డాను అని వొప్పుకోవటమే ఈ టపా ఉద్దేశం...

శారద రచనల మీద సమగ్ర వ్యాసం రాయటం, ఆయన కథ ను చర్చకు పెట్టడం ద్వారా ఈ చర్చకు మూల కారణమైన మాలతి గారికి కృతజ్నతలు...

చోరీ కి గురైన అఫ్సర్ కవిత ---” సగమే గుర్తు"


అఫ్సర్ గారి ఏ కవిత చోరీ కి గురైంది అన్న విషయం తెలుసుకోవాలని, ఆ కవిత చదవాలని కొందరు ఆసక్తి చూపిస్తున్న కారణం గా ఆ కవిత ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ కవిత " ఊరి చివర" కవిత్వ సంకలనం లో వుంది. మొదటి సారి ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురితమైంది. కాపీ కి గురైన తర్వాత కూడా అదే టైటిల్ తో కవి పేరు మార్పు తో మళ్ళీ ఆంధ్రజ్యోతి లోనే ప్రచురితమైంది. ఈ కవిత ని అఫ్సర్ కవిత గా గుర్తించిన కవి నందిని సిధారెడ్డి.
సగమే గుర్తు

1.

వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా.
దేహం పిచ్చుక సందేహ స్నానాల కింద తడుస్తూ.
వాన
లోపల్నించి కురుస్తుందా?
బయట్నించా?
నీకు గుర్తుండకపోవచ్చు
బహుశా నిన్న కురిసి వెళ్ళిపోయిన బచ్ పన్.
నీ వంటిని
ఇంటి ముంగిటి నీళ్ళల్లో
విడిచి వెళ్ళిపోయిన కత్తి పడవల్లో ఏముందో!
ఇప్పుడింక కురవడం మానేశాయేమో గాని
కాళ్ళ కింద తడి, బురదా అల్లాగే అంటుకునున్నాయి.

2.

లాగూ చొక్కా ఇంకా అట్లా జ్నాపకానికి వేలాడుతున్నాయి
మరీ చిన్నప్పటి వాసనేస్తున్నానా?
నిజమే!
మరపు తెరలు మరీ పల్చగా, మసగ్గా.
కనీ కనిపించని దూరపు మంచు మబ్బుల పరుగులు.

3.

మృగశిర ని మింగలేక
బయటికి కక్కలేక
కడుపులో పగుల్తున్న దుంప నేల
నీటి చినుకు పడంగానే ముందు పొగలు చిమ్ముతుంది
తరవాత
మళ్ళీ గతాన్ని తవ్వి తోడేసే పచ్చి వగరు వాసనవుతుంది.

4.
ఎన్ని వానలు చూళ్ళేదని?
మళ్ళీ
ప్రతి వానా అదేదో కొత్త వాసనేస్తుంది.

5.

అన్నీ గుర్తుండాలనేం లేదులే!
కొంత గుర్తూ, కొంత మరపూ
కొంత శబ్దం, కొంత నిశ్శబ్దమూ,
వొకటి లేనప్పుడు ఇంకోటి
ఇంకోటి లేనప్పుడు వొకటి


6.

వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్నరొట్టే కాలుతోంది
వొంటి సెగల మీద

అఫ్సర్

Thursday, September 23, 2010

చుప్కే...చుప్కే...చోరీ!(గ్రంధ చౌర్యాలు ---కొన్ని పిట్ట కథలు..)

మాలతీ గారి బ్లాగ్ లో " శారద" “ స్వార్ధ పరుడు" మీద జరిగిన చర్చ లో ఆస్ట్రేలియా శారద ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు...రావూరి భరద్వాజ గారి కాదంబరి నవల, స్వార్ధపరుడు కి చాలా దగ్గర పోలికలున్నాయని...దాదాపుగా రెండూ ఒకేలా వున్నాయని, అందులో ఒక హోటల్ సర్వర్ పేరు నటరాజన్ అని కూడా.. ఇంత ఆసక్తికరమైన వివరాలు తెలియచేసినందుకు శారద గారికి ధన్యవాదాలు.

అది చూడగానే...నాకు వచ్చిన మొదటి ఆలోచన...శారద రాసిన చిన్న కథ ని చదివి ఆ స్ఫూర్తి తో రావూరి భరద్వాజ గారు ఓ నవల రాసివుంటారని...ఆ మాట ఒకరిద్దరితో కూడా అన్నాను...పాపం శమించు గాక!

అలా అనుకోవటానికి అంతకు ముందు ఒకరిద్దరితో అంతకు ముందు జరిగిన కొన్ని చర్చల ఫలితం కూడా వుందనుకోండి...ఈ మధ్య కాలం లో తరచూ రచయితలు కాపీలు కొట్టేసి వేరే వాళ్ల వర్క్ ని తమది గా చెప్పుకోవటం, లేకపోతే " ఆ, ఈ కథో, ఆ నవలో ఎవరు చదివి వుంటారు లే...” అనుకోని మార్చి రాసేసుకోని తమ పేరుతో చెలామణీ చేయించుకోవటం...లాంటి సంఘటనలు వింటూనే వున్నాము..ఈ రకమైన పనులు చేసిన వాళ్ళల్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి మహా మహా పేరు పొంది రచయితలుగా ట్రెండ్ సెట్టర్స్ ముద్ర వేయించుకున్నవాళ్ళ దాకా అన్నీ స్థాయిల్లో వున్నారు.

ఈ సందర్భంలో మా స్వానుభవం ఒకటి ఇక్కడ గుర్తు చేసుకుంటాను.

2005 లోనో, 2006 లోనో కాలిఫోర్నియా లో ఆటా సమావేశాలు జరిగినప్పుడు యథావిధిగా కథలు, కవితలు, నవలల పోటీ లు నిర్వహించారు..నాకు జ్నాపకం వున్నంత వరకూ ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఆ ఏడాది ఆ పోటీలు నిర్వహించినట్లున్నారు. సరే, పోటీలకు రచనలు ఆహ్వానించారు. అందులోంచి కథల్ని, కవితల్ని ఎంపిక చేసి బహుమతులు ప్రకటించారు. అప్పుడు ఒక తమాషా జరిగింది. కవితాల్లో ఒకాయన కి ( ఆయనో, అబ్బాయో మాకు తెలియదు) కి మొదటి బహుమతి వచ్చింది. ఆ విజేతల పేర్లు కూడా పేపర్లో ప్రకటించేశారు. ఇక ఆ బహుమతి పొందిన కవితలు సువనీర్ లో అచ్చు కావాల్సి వుంది. ఆ సమయం లో తెలిసిన విషయం...ఆ మొదటి బహుమతి వచ్చిన కవిత....కాపీ కవిత...అది శివారెడ్డి నో, మరెవరో ప్రముఖ కవి ఆ కవిత ని గుర్తు పట్టి ఆ విషయాన్ని వెల్లడించారు. దాంతో ఆ కవిత కి ఆ బహుమతి ని వెనక్కు తీసేసుకున్నారు. అలా ఆయనెవరో కాపీ కొట్టిన కవిత ఎవరిదో కాదు...అఫ్సర్ ది..ఆ విషయం తెలియగానే...ఆటా వాళ్ళు నాలికకరుచుకొని అఫ్సర్ కి సారీ చెపుతూ మైల్స్ చేశారు. పాపం ఆ కాపీ కొట్టే ఆయనకు ఆ కవిత అఫ్సర్ ది అని తెలియదనుకోవాలో, లేక ఆ కవిత ని ఎవరూ గుర్తు పట్టలేరనుకున్నాడో ఆ పైన్న వాడికి తప్ప మరొకరికి తెలియదు. అప్పుడు అఫ్సర్ ఒక జోక్ చేశాడు...కాపీ కొడితే కొట్టాడు కానీ.. అప్పుడు ఇప్పుడు కూడా నా కవిత కి మొదటి బహుమతి వచ్చే విలువ వుందన్న విషయం తెలిసేలా చేశాడు అని....అదీ అఫ్సర్ కవిత్వానికి వున్న బలం అని తెలుసుకోవాలి.

ఇక ఇంకో ఉదాహరణ చెప్తాను...ఆ మధ్య కొద్ది కాలం క్రితం సీతాలక్ష్మి గారని మంచి తెలుగు పండితురాలు ( చాలా మందికి తెలిసే వుంటుంది..కానీ తెలియని వారి కోసం....బ్లాగు లో మలక్పేట రౌడీ గా సుప్రసిద్ధులైన వెలమకన్ని భరద్వాజ కు జన్మనిచ్చిన పుణ్యాతురాలు....భరద్వాజా...మీ స్టైల్ లో...హెహెహే.. ..)

మేమిద్దరం ఏదో సాహిత్య చర్చ చేస్తుంటే ఆవిడ ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు...అడవి బాపిరాజు గారి నవల తుఫాన్ కి, యద్ధనపూడి సులోచనారాణి గారి ప్రసిద్ధ సెక్రెటరీ నవల కి దగ్గర పోలికలున్నాయని. అడవి బాపి రాజు గారి రచనలంటే ఆమెకు ప్రాణం. అలాగే సులోచనారాణి గారి అంటే అమితమైన అభిమానమున్న ఆవిడ నోటి నుంచి ఈ అభిప్రాయం విని నోరెళ్ళబెట్టడం నా వంతు అయింది...అదేమిటండీ బాబూ..ఇంత మంచి విషయాన్ని ఎక్కడా రాయకుండా ఇలా మీ దగ్గరే దాచుకున్నారు....ఇక లాభం లేదు...మీరొక వ్యాసం రాసేసేయండి..ఏ ఆంధ్రజ్యోతి వివిధ వాళ్లకే ఇచ్చేసి అచ్చేయిద్దాము. అసలే వాళ్ళకు ఈ మధ్య మంచి వ్యాసాలు ఏవీ దొరకటం లేదు...( సారీ కె. శ్రీనివాస్) ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలియచేద్దాము అన్నాను....పాపం ఆ తెలుగు టీచర్ గారు...కొంచెం మొహమాటపడి రాస్తానండీ అన్నారు కానీ...ఇప్పటి వరకూ రాయలేదు...ఈ విషయం మలక్ పేట రౌడీ కి తెలియదు..లేకపోతే 500 కామెంట్లు వచ్చే పోస్ట్ ఒకటి రాసే పడేసేవారు...( సారీ రౌడీ గారు....మీకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు).

ఇక మూడో విషయం...ఈ కాపీ కొట్టే రచనల గురించి ఒక ప్రముఖ రచయిత్రి అనుభవం మీలో ఎంత మందికి తెలుసో లేదో అని మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
మనందరి అభిమాన రచయిత యద్దనపూడి సులోచనారాణి నవలలు మొత్తం తమిళం లోకో, కన్నడం లోకో పూర్తిగా అనువాదమైపోయాయి. అది మంచి విషయమే కదా అనుకొకండి. అనువాదమైంది ఆమె పేరుతో కాదు,,,వేరేవరి పేరుతోనో. ఆ విషయం తెలుసుకున్న సులోచనారాణీ గారు ఒక మూడు నాలుగేళ్ళ క్రితం అనుకుంటాను...ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ విషయం లో ఆమె కోర్టుకీ కూడా వెళ్ళినట్లు తెలుసు,దానివల్ల పెద్ద గా ఉపయోగం లేకపోయినా....సులోచనారాణి గారి కథనం ప్రకారం దీని వెనుక వున్న ప్రసిద్ధ రచయత( ఆమె పేరు బాహాటం గా చెప్పకపోయినా ) ఎవరో ( యండమూరి వీరేంద్రనాథ్ అని వినికిడి) అందరికీ తెలుసు.

” ఎనకు తమిళం తెరియాదు...కన్నడ కురియాదు ( కన్నడం రాదు కాబట్టి ఏదో ప్రాస కోసం వాడాను.} కాబట్టి నేను చదివి చెప్పలేను. ఎవరైనా తమిళ తంబి లు...( సోదరీమణులను ఏమంటారబ్బా తమిళం లో.?)చెప్పాల్సిందే..అది నిజమైతే...అదే...నిజమైతే....హా..హతవిధీ...

ఇది కాక తాజా గా ఈ ఇతివృత్తం అలియాస్ కథాంశం చోరీల వివాదం లో చిక్కుకున్న ఖదీర్ బాబు, గోపిని కరుణాకర్ ల విషయం లో కూడా ఆరోపణలే తప్ప...నిజానిజాలు..ఎనకు తెరియాదప్పా....

ఇప్పుడు మళ్ళీ పాపం రావూరీ భరద్వాజ గారి దగ్గ్రకు వస్తాను....

నిన్న కారు లో వెళ్ళేటప్పుడు ” ఏంటీ మాలతి గారి దగ్గ్రర విశేషాలు? ఈ మధ్య నువ్వు బొత్తి గా ఆమె తో మాట్లాడినట్లు లేవు? అని ..పతి దేవుడు ఎంతో ప్రేమతో మాలతి గారి గురించి అడిగాడు...
నాకు టక్కున శారద గారి కామెంట్ గుర్తొచ్చి....కాదంబరి వెర్సస్ స్వార్ధ పరుడు మీద ఆవేశం గా లెక్చర్ ఇచ్చేశాను...పాపం ఆ మానవుడు డ్రైవ్ చేస్తూ కూడా నా ప్రసంగానికి తట్టుకున్నాడు..నా ఆవేశం చల్లారాక...అతి నిదానం గా నా నోరు మూయించాడు....
అఫ్సర్ చెప్పిన విషయాలు ఏమిటంటే....ఆహా. ఆ విషయం అంత తొందరగా చెప్పేస్తే ఎలా...సహనం స్త్రీలకే కాదండీ ....పాఠకులకు కూడా వుండాలి...( ఇది నా కొత్త స్లోగన్)

( ఇంకో టపా కోసం ఎదురుచూడండి...చూస్తూనే వుండండి....)

నోట్: బాబూ, ఈ పోస్ట్ లో చాలా చోట్ల స్మైలీ లు పెట్టాలని ప్రయత్నించి విఫలమైనాను. అర్థం చేసుకోండి.

Tuesday, June 29, 2010

కళాపూర్ణోదయం లో వున్నది కేవలం ' బూతే' నా?


ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అభిమానించి ఆదరించేవారందరిని ఇవాళ ఈ ప్రశ్న తొలిచివేస్తోంది. కారణం యోగి వేమన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వినోదిని జూన్ 28 సోమవారం ఆంధ్రజ్యోతి వివిధ లో రాసిన వ్యాసం “ క్లాస్ రూమ్ లో కళా ‘పోర్నో’ దయమ్!-” లో అశ్లీల కావ్యాలను సిలబస్ గా పెట్టొచ్చా? అంటూ సంధించిన ప్రశ్నలు. ( మూల వ్యాసాన్ని ఇక్కడ చదవొచ్చు)."

అసలీ కథకు పాఠ్యాంశం గా వుండే అర్హత ఏమిటి? కామోద్దీపనకు తప్ప జ్నానానికి ఏ మాత్రం ఉపయోగపడని కావ్యం ఇది.స్త్రీలను కించపరిచే, స్త్రీ వ్యతిరేకమైన అంశాలు, నడవడికనిసూచించే అంశాలు, భార్యగా స్త్రీ భర్తకు దాసిలా వుండాల్సిన భార్య భర్తల సూడో సంబంధాన్ని ఈ కావ్యం ప్రబోధిస్తుంది.పెళ్ళి ని కేవలం సెక్స్ దృష్టి లొంచే ఈ కావ్యం చర్చిస్తుంది. 16 వ శతాబ్దం లో రచించిన ఈ కావ్యం లోని ఆలోచనలు భావాలు అత్యంత పురాతనమైనవి." ఇవీ కళాపూర్ణోదయం కావ్యం గురించి స్థూలంగా వ్యాస రచయిత అభిప్రాయాలు .

ప్రాచీన తెలుగు సాహిత్యం లో అధికశాతం శృంగార మయం అయినంత మాత్రాన అవి బోధనకు పనికిరావు , అందులో నేర్చుకోవడానికి ఏమీ లేదు అనడం సరికాదు. కళాపూర్ణోదయం మీద వినోదిని చేసిన కామెంట్లు అర్ధ రహితమైనవి. శృంగారం ఎక్కువ పాళ్ళల్లో వుందనో, స్త్రీలను, కింది కులాల వారిని కించపరిచేవిధంగా వుందనో నిషేధించుకుంటూ పోతే ఇక తెలుగు సాహిత్యం లో చదవటానికి, తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి, రసాస్వాదన చేయటానికి ఏమీ మిగలదు. సెన్సారింగ్ చేయబడటం లో వున్న కష్టానష్టాలు తెలిసి కూడా, ఇన్నేళ్ళ స్త్రీవాద, దళిత స్త్రీవాద ఉద్యమాల తర్వాత కూడా వినోదిని ఆ సెన్సారింగ్ కోరుకోవడం, ఆ దిశగా అడుగులు వేయడం కొంచెం ఆశ్చర్యం కలిగించే అంశం.

ప్రాచీన తెలుగు సాహిత్యం మనకొక సాంస్కృతిక సంపద. దాన్ని గుర్తించి గౌరవించాలి.

ఒక చరిత్ర గా దాన్ని తప్పక చదువుకోవాలి కూడా. ప్రాచీన సాహిత్యాన్ని క్లాస్ లో బోధించేటప్పుడు ఇప్పటి సమాజానికి తగిన అంశాల్ని కూడా కలుపుకుంటూ ఒక రచనగా అప్పటి సాహిత్య సామాజిక అంశాల్ని చర్చించవచ్చు.అలా కాకుండా కళా పూర్ణోదయం లోని సుగాత్రి శాలీనుల శృంగారాన్ని కేవలం ఒక adultery గా ఆమె అభిప్రాయపడటం తప్పు.

" కళాపూర్ణోదయం రచన ఉద్దేశం లోనే " బూతు" వుంది. పైగా రచన మొత్తం కూడా విశృంఖల వర్ణనలతో, విచ్చలవిడి వాక్యాలతో వుంటుంది." అన్న వినోదిని ఆరోపణ కేవలం నిరాధారం. ఆమెకున్న అవగాహనారాహిత్యమనే చెప్పుకోవాలి. మొదట వినోదిని అర్ధం చేసుకోవాల్సిన అంశం రొమాన్స్ కి adultery కి వున్న తేడా. ఆలాగే 16 వ శతాబ్దం సాహిత్య, సామాజిక విలువల్ని ఇప్పటికి అన్వయించి, అంగీకరించమని ఎవరూ అడగరు. ఒక ప్రొఫెసర్ గా ఆ పని ఆమె చేయనక్కర లేదు. కళాపూర్ణోదయం లాంటి కావ్యాల్ని క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు వుండే ఇబ్బందులు అర్ధం చేసుకోదగ్గవి.అయితే అందుకు పరిష్కారం ప్రాచీన కావ్యాల నిషేధం కాదు. శృంగారం పాఠ్యాంశానికి పనికి రాదని చెప్పటం మరీ విడ్డూరం. అసలు తెలుగు ప్రాచీన కావ్యాలు , ప్రబంధాలు చదివే వారు తరం తరానికి తగ్గిపోతున్నారు, తెలుగు వాళ్ళకు తెలుగు సాహిత్యం గురించి కంటే ప్రపంచ సాహిత్యం గురించే ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని ఒక వర్గం వారు బాధ పడుతుంటే, ఇప్పుడు విశ్వ విద్యాలయ స్థాయిలో కూడాప్రబంధాలు టీచింగ్ కి పనికిరావని వినోదిని లాంటి వారిది కేవల అర్ధ రహిత వాదన.

అసలు వాస్తవానికి కళాపూర్ణోదయం కావ్యానికి తెలుగు సాహిత్యం లో వున్న విశిష్ట స్థానం ఏమిటి? వినోదిని లాగా తెలుగు సాహిత్యాన్ని అకడెమిక్ గా కూడా క్షుణ్ణంగా చదువుకున్న వారు భ్రమపడుతున్నట్లు అందులో వున్నది కేవలం శృంగారమేనా? లేక ఒక సాహిత్య సృష్టి గా అందులో నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా వున్నాయా?

నేను ఎంఏ తెలుగు చేసిన విద్యార్ధిని కాదు కాబట్టి ఒక కావ్యం గా కళాపూర్ణోదయం గొప్పతనాన్ని వివరించి చెప్పలేను. అయితే నాకు అర్ధమైనంత వరకూ అదొక అద్భుత కథాకథనం. కథ ఎలా చెప్పాలి, కథ ని ఎలా నడిపించాలి? కథ లో మలుపులు ఎలా తీసుకురావాలి? లాంటి టెక్నిక్కులు తెలుసుకోవాలనుకుంటే పింగళి సూరన రాసిన కళాపూర్ణోదయం కావ్యం చదివి తీరాల్సిందే.

కళా పూర్ణోదయం కావ్యం కేవలం సుగాత్రి శాలీనుల కథ మాత్రమే కాదు. అది అందులో ఒక భాగం మాత్రమే. ఆ కథ లో పాత్రలు కేవలం ఒక కాలానికి సంబంధించినవి కావు. మూడు, నాలుగు జన్మలకు సంబంధించిన కథ. పాఠ్యపుస్తకం లో ఒక భాగం పెట్టాల్సి వస్తే ఏదో ఒక భాగం ఎంచుకోవాలి కాబట్టి సులువుగా అర్ధం కావటానికి సుగాత్రి శాలీనుల కథ పెట్టి వుంటారు. ఈ ప్రత్యేక కథ లో వినోదిని చెప్పినట్లు వారిరువురి మధ్య తొలి కలయిక కి సంబంధించిన వర్ణనలుంటాయి. అసలు ఈ కావ్యం లో శృంగార రసానికి సంబంధించి ఒక విశిష్టత వుందని చెప్తారు.. కవి నాలుగు రకాల శృంగారభావానల గురించి ఇందులో వర్ణిస్తాడు. మొదట బ్రహ్మ, సరస్వతుల మధ్య దివ్య శృంగారం. కలభాషిణి, మణికందరుల మధ్య గంధర్వ శృంగారం, సుగాత్రి, శాలీనుల మధ్య ప్రజాపత్య శృంగారం, సల్యాసురుడు, అభినవ కౌముది ల మధ్య రాక్షస శృంగారం. ఈ నాలుగు రకాల శృంగార స్వభావాల్ని సూరన తన అద్భుతమైన కథాకథన చాతుర్యం తో వర్ణించాడు.

ప్రాచీన సాహిత్యం లో చంద్రకాంతి తప్ప సూర్యకాంతి లేదన్న అపప్రధకు ఎదురు నిలబెట్టాలంటే ముందు మనకున్న అచ్చ తెనుగు ప్రబంధం కళాపూర్ణోదయం. పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయం ధ్వర్ధి కావ్యాన్ని పంచ మహా కావ్యాల్లో ఒకటిగా చేశారు కానీ నాకైతే కళాపూర్ణోదయానికి ఆ గౌరవం దక్కి వుండాల్సిందనిపిస్తుంది. మిగతా ప్రబంధ కవుల్లో కనిపించని ప్రతిభా, అద్భుతమైన భావనా శక్తి, పాత్రోచిత పద్య రచనా అన్నీ ఈ కావ్యం లో కనిపిస్తాయి. ఈ కావ్య రచన ఉద్దేశం వినోదిని అభిప్రాయపడినట్లు బూతు కాదు. సూరన ఈ కావ్యానికి రాసిన సంకల్పం లోనే " సకల లక్షణ లక్షితంబైన మహా ప్రబంధం " తానెందుకూ రాశాడో చెప్పాడు. మామూలుగా ప్రబంధ కావ్యాల్లో నవరసాలు అన్నింటికి సముచిత స్థానం దక్కదు. ప్రబంధం లో ఎప్పుడూ శృంగార రసానికే ప్రాధాన్యత. కానీ సూరన తన కావ్యం లో అన్నీ రసాల్ని చూపించాలన్న పట్టుదలతో రాసిన కావ్యం కళా పూర్ణోదయం. అపూర్వ కథా సంవిధానం, కథాకథన చాతుర్యం గురించి తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మళ్ళీ మళ్ళీ కళాపూర్ణోదయం చదువుతూ వుండాల్సిందే.తెలుగు భాష వున్నంత వరకూ పింగళి సూరన కు , కళాపూర్ణోదయం కావ్యామ్ రెండూ సజీవం గా ప్రజల హృదయాల్లో సుస్థిరం గా నిలిచి వుంటాయనటం లో ఎలాంటి సందేహం లేదు.

కళా పూర్ణోదయం కావ్యాన్ని తేట తెలుగులో కె.వి. ఎస్. రామారావు గారు చేసిన అనువాదాన్ని ఇక్కడ చదవచ్చు.

Friday, March 05, 2010

తెలుగు డయాస్పోరా ఒక మూస ఘోష ?

డయాస్పోరా తెలుగు సాహిత్యం గురించి కొంచెం సీరియస్ గా చర్చించుకోవాలని, మాట్లాడుకోవాలని అనుకుంటున్న అనేక మంది లో నేను కూడా ఒకరిని. తెలుగు సాహిత్యం లో డయాస్పోరా సాహిత్యం ఒక పాయ గా మొదలైందని, ముందు ముందు దాన్ని కూడా కలుపుకొని తెలుగు సాహిత్యాన్ని సమగ్రం గా విశ్లేషించాల్సి వుంటుందని నా అభిప్రాయం. అందుకనే “ 20 వ శతాబ్దం లో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం “ పుస్తకం వస్తోందని ఓ ఏడాది క్రితం అనుకుంటాను వంగూరి చిట్టెన్ రాజు గారు చెప్పగానే ఆసక్తి గా ఎదురుచూడటం మొదలు పెట్టాను. పుస్తకం చేతికి వచ్చింది కానీ 600 కంటే ఎక్కువ పేజీలున్న ఈ బృహత్ గ్రంధాన్ని ఇంకా చేతిలో పట్టుకొని చదివే సాహసం మాత్రం ఇంకా చేయలేదు.

ఆ సాహసం చేసి దాని మీద పెద్ద వ్యాసం కూడా రాసేశారు ఈమాట ప్రధాన సంపాదకులు వేలూరి వెంకటేశ్వరరావు.
ఈ పుస్తకం చదివి మాట్లాడటం ఉత్తమం. అయితే పుస్తకం చదవకపోయినా కూడా ఈ పుస్తకం పై వేలూరి వ్యాసాన్ని చదివి మాట్లాడుకోవచ్చు.

డయాస్పోరా తెలుగు సాహిత్యం గురించి మొదటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్న వారిలో ప్రధములు వేలూరి. డయాస్పోరా తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడటమే కాకుండా సీరియస్ గా ప్రచురణలు కూడా మొదలుపెట్టిన వ్యక్తి వంగూరి చిట్టెన్ రాజు. ఇప్పుడు ఈ పుస్తకం ప్రచురించినది చిట్టెన్ రాజు . వ్యాసం రాసింది వేలూరి. ఆ రకంగా ఇద్దరు ఉద్దండులకు సంబంధించిన అంశం ఇది.

డయాస్పోరా సాహిత్యం గురించి వేలూరి చాలా చోట్ల ప్రసంగాల్లోనూ, వ్యాసాల్లోనూ చెప్పిన విషయాల్ని మరింత వివరంగా సమగ్రం గా ఈ వ్యాసం లో మరో సారి చెప్పారు.. దానికి సందర్భం 20 వ శతాబ్దం లో తెలుగు కథానిక పై ఆయన చేసిన సమీక్ష అనుకోండి. విశ్లేషణ అనుకోండి, లేదా ఆ పుస్తకం చదివాక ఆయనకు కలిగిన అభిప్రాయాలు అనుకోండి. అది ఈ వ్యాసం. పుస్తకం లో వున్న అక్షరదోషాలు, జనరల్ గా అమెరికా తెలుగు కథల్లో లోపించిన నాణ్యతా మొదలైన విషయాల్ని కూడా వ్యాసంలో ప్రస్తావించారు. పుస్తకం లో వున్న కథల మీద మాత్రం సమీక్ష లేదు. అసలు ఈ 40 ఏళ్ళల్లో మంచి కథలు రాలేదా? లేక ఈ సంపాదకులు ఎంచుకున్న కథలు అలా నాసిరకంగా వున్నాయా అన్నది స్పష్టం గా చెప్పి వుండాల్సింది. ఈ సంకలనం లో వున్న కథల్లో అసలైన డయాస్పోరా కథ ( వేలూరి గారు, జంపాల గారి ప్రమాణాల మేరకు) ఒక్కటి కూడా లేదా? వుంటే ఆ కథ మిగతా వాటికంటే ఏ రకంగా భిన్నమైంది? అనేది చర్చించి వుంటే ఒక సమగ్రత వచ్చేది. అసలు ఒక్క డయాస్పోరా కథ కూడా లేకపోతే ఆ సంగతినే స్పష్టం గా చెప్పాల్సింది. డయాస్పోరా సాహిత్యం మీద వేలూరి తన అభిప్రాయాల్ని మొదట ఒక వ్యాసం గా రాసి, రెండో భాగం ఈ పుస్తకం మీద సమగ్ర విశ్లేషణ చేస్తే సముచితం గా వుండేది. సమీక్షిస్తున్న పుస్తకం లోని విషయాల కంటే, డయాస్పోరా కి సంబంధించిన ఇతర విషయాలతో నిండి వుండి ఈ వ్యాసం మొత్తం.

““అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలయ్యిందా? లేదా, డయాస్పోరా రచన అంటే నాకున్న అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలా?” అని. వేలూరి అడిగారు. అలాగే “ఈ సంకలనంలో అధ్యక్షుల ముందుమాటలో “డయస్పోరా ఇతివృత్తాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం,” అన్నమాటలు చూసిన తరువాత, ఈ డయాస్పోరా అనే ‘వింత పదం’ ఊత పదంగా తయారయ్యిందా అన్న అనుమానం వస్తుంది. “ అన్నారు వేలూరి. ఆయన లేవనెత్తిన ఈ రెండు కూడా ముఖ్యమైన విషయాలు. దాని మీద ఎంత సమగ్రమైన విశ్లేషణ జరిగితే అంత మంచిది. ఈ సంకలనాన్ని పై పైన చూసినప్పుడు నాకు అదే ఆలోచన కలిగింది. ఎందుకంటే వంగూరి వారి కథా సంకలనానికి పెట్టుకున్న టైం పీరియడ్ 1964-2000. ఆ టైమ్ లో రచయితలు ఏం కథ రాస్తే దాన్నే ఈ సంకలనం లో చేర్చినట్లు కనిపించింది. ఆ రకంగా ఆ టైమ్ పీరియడ్ లో వాళ్ళు మామూలు కథ ( అమెరికాకు సంబంధించిన ఇతివృత్తం కాకపోయినా ) రాసినా ఇందులో చేర్చి వుండాలి.

వేలూరి తన వ్యాసం లో అమెరికా లో వచ్చే తెలుగు కథల ఇతివృత్తాల గురించి సోదాహరణం గా పేర్కొన్నారు. కుటుంబం లో విషయాలు, భార్యాభర్తల గొడవలు,పిల్లల పెళ్ళిళ్ళు , నోస్తాల్జియా, ఇవేమీ డయాస్పోరా కాకపోతే ఇక ఏది డయాస్పోరా? సింగపూర్ చైనా వారి డయాస్పోరా సాహిత్యం లో వున్న ఇత్రివృత్తాలు , అనుభవాలు ఏవేమిటి? అవి ఏ రకంగా తెలుగు సాహిత్యానికంటే విభిన్నమైనవి, ఉత్తమమైనవి అని వేలూరి గారు అనుకుంటున్నారో అది చెపితే ఈ వ్యాసానికి ప్రత్యేక ప్రయోజనం వుండేది.

వంగూరి వారు ఈ పుస్తకం లో ఇచ్చిన వివరాల ప్రకారం అమెరికాలో 1964 లో తెలుగు వారి కలం నుండి మొదట కథ వెలువడింది. అమెరికా తెలుగు వారి సాహిత్య కృషి 1970 నుంచి ప్రారంభమైనట్లు వివరాలిచ్చారు ఈ పుస్తకం లో. అంటే అమెరికా తెలుగు సాహిత్యం వయస్సు ఇంకా నలభై ఏళ్లు కూడా లేదు. ఈమాట సాహిత్య కృషి వయస్సు ఓ 12 ఏళ్లు. చిట్టెన్ రాజు గారి ప్రచురణాల సంస్థ వయస్సు 15 ఏళ్లు. దీన్ని బట్టి కూడా డయాస్పోరా తెలుగు సాహిత్యం , రచయితలు ఇంకా శైశవ దశ లోనే వున్నారని అర్ధం చేసుకోవచ్చు. అమెరికా లో తెలుగురచయితలు ఎవరు? వారి రచనలు ఏమిటి? ఎవరెవరు ఎలాంటి రచనలు చేస్తున్నారు, అనేది సరిగ్గా అర్ధం చేసుకుంటే తప్ప మనకు డయాస్పోరా సాహిత్యం ముందు ముందు ఎదుగుతుందా, లేక ఇలాగే వుంటుందా అనేది కూడా తెలియదు.

ఈ సంకలనం లోని కథల నాణ్యత గురించి మాట్లాదేముందు అసలు ఇంత మెటీరీయల్ ఒక చోట దొరకడం ఒక మంచి విషయం గా మనం గుర్తించాల్సి వుంది.

వేలూరి వ్యాసం ఈ నెల ఈమాట లో వచ్చింది. దానిని ఇక్కడ చదవండి.
తెలుగు డయాస్పోరా సాహిత్యం పై ఆసక్తి వున్న వారు నేను రాసిన వ్యాసం ఇక్కడ , సావిత్రిమాచిరాజు వ్యాసం ఇక్కడ , అఫ్సర్ రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

కల్పనారెంటాల

Wednesday, February 17, 2010

తెలుగు సాహిత్యం పై అంత చిన్న చూపు ఎందుకు?


మొన్నామధ్య పుస్తకం.నెట్ లో హేలీ రాసిన వ్యాసం “ మనం “ ఫాంటసీ “ బస్సు మిస్ అయినట్లేనా?” చదివిన తర్వాత నా అభిప్రాయాలు ఇవి. హేలీ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఇవి నా ఎదురు ప్రశ్నలు అనుకోండి. తెలుగు సాహిత్యం పై నా అభిప్రాయాలు ఇవి.
హేలీ తన వ్యాసం లో తానే వొప్పుకున్నాడు. ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఒక చిన్న అని.. హేలీ ఒక కొత్త తరానికి పాఠక ప్రతినిధిగా వూహించుకుంటే అతను వేసిన ప్రశ్నలు కేవలం వ్యక్తిగతం కాకుండా ఒక తరానికున్న అభిప్రాయాలుగా నేను భావించాను. అందుకే వాటికి సమాధానాలు అని కాదు కానీ నా గోడు కూడా కాస్త చెప్పుకోవాలనిపించింది. తెలుగు సాహిత్యానికి, ఇంగ్లీష్ సాహిత్యానికి పోలికలు తెచ్చి మాట్లాడటం ఎందుకు వీలు పడదో ప్రధానంగా చెప్పటం నా ఉద్దేశం.
తెలుగు సాహిత్యం అంటే హేలీ లాంటి కొత్త తరం యువతకు ఎందుకు ఈ చిన్న చూపు ? తెలుగు సాహిత్యం లో వాళ్ళు నచ్చిన స్థాయిలో, వాళ్ళు మెచ్చుకోదగ్గ స్థాయిలో పుస్తకాలు రాలేదని హేలీ లాగానే చాలా మంది అభిప్రాయం . ఈ మాట తెలుగు సాహిత్యం చదివిన వాళ్ళు ఎవరైనా చెపితే మనం ఒక క్రమ పద్ధతిలో చర్చించుకోవచ్చు.తెలుగు సాహిత్యం చదివి ఇలా మాట్లాడుతున్నారా, అసలు చదవకుండా ఇలాంటి అభిప్రాయాలు ఎవరైనా ఏర్పర్చుకుంటున్నారా అని నాకొక సందేహం.
నేటి తెలుగు యువతకు రావిశాస్త్రి, విశ్వనాధ, శ్రీశ్రీ వద్దు. ఒక వూపు వూపిన యద్ధనపూడి, యండమూరి కూడా పనికి రారు. ఇంకేమిటి కావాలి వాళ్ళకు? కేవలం ఫాంటసీ సరిపోతుందా? ఒక్క ప్రక్రియ మన మొత్తం తెలుగు సాహిత్యానికి దర్పణం పట్టగలదా?
మన తెలుగు సాహిత్యం నన్నయ్య మహాభారతం అనువాదం మొదలుకొని తాజా కేశవ రెడ్డి “ మునెమ్మ” వరకూ వచ్చిన అనేకానేక మంచి పుస్తకాల్లో , ఈ తరం యువత ఎన్ని ప్రక్రియాల్లో , ఎన్ని పుస్తకాలు చదివి వుంటుంది ?తెలుగు సాహిత్యం గొప్పతనం అర్ధం కావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. పీరియడ్.ఆ పని చేయకుందా హఠాత్తుగా ఏదో ఒక ఉదయం జ్నానోదయమై కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే మనకు నచ్చిన పుస్తకాలు మన చేతిలో వచ్చి పడవు. అది ఎంత “ ఫాంటసీ” ప్రపంచమైనా.
గొప్ప తెలుగు సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది?
గత రెండు , మూడు తరాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదువుకొని తెలుగు మాట్లాడటమే గొప్ప , అరుదు అయిన సందర్భాల్లో పాపం తెలుగు రచయితలు ఎవరి కోసం రాసుకుంటారు? తెలుగు పుస్తకాలకు పాఠకులు ఎవరు? పిల్లలా, యువత నా, నడి వయస్కులా?, ముసలివాళ్ళా? ఆర్ధికంగా, సామాజిక పరం గా, భాషా పరం గా కూడా .వీళ్ళంతా ఏ స్థాయిలో వారు?
ఇటీవల కాలంలో అనేక మంది ఇంగ్లీష్ సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి తెస్తున్న అకారణ, అనవసర పోలిక చూస్తే కోపం , కొంత జాలి కూడా కలుగుతోంది. మన దగ్గర ఏ పుస్తకాలు లేవో మాట్లాడుకునే ముందు మన దగ్గర ఏమున్నాయో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరముంది.

కనీసం గత శతాబ్దంలో వచ్చిన ఉత్తమ, లేదా ప్రాచుర్యం పొందిన పుస్తకాల్లో నేటి యువత ఎన్ని చదివి వుంటుంది? అసలు నేటి యువతరం లో తెలుగు చదవటం, అచ్చుతప్పులు లేకుండా రాయగలిగిన వాళ్ళు ఎంత మంది వుండి వుంటారు? దీనికి కారకులు ఎవరు? పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చేర్పిస్తున్న తల్లి తండ్రులదా? ఇంట్లో తెలుగు మాట్లాడటం తప్ప, తెలుగు పుస్తకాలు పరిచయం చేయని పెద్దలదా? క్లాస్ పుస్తకాలు బట్టీలు కొట్టించడం, నూటికి నూరు శాతం మార్కుల కోసం రెసిడెన్షియల్ కాలేజీల్లో బండ మీద చేపల్ని తోమినట్లు తోముతూ జీవితానికి సంతృప్తి నిచ్చే ( వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కాదు) పుస్తక పఠనం ఒక అభిరుచి లాగా ప్రోత్సహించలేని విద్యా వ్యవస్థ దా?

తెలుగు సాహిత్యం లో ఎన్ని ప్రక్రియలు వున్నాయో, ఎందులో ఎవరెవరు ఏమీ రాస్తున్నారో కనీస పరిజ్నానమ్ కూడా లేని వాళ్ళకు తెలుగు సాహిత్య క్రమ పరిణామం, గొప్పతనం ఎలా తెలుస్తుంది?

ఇప్పుడు హేలీ కెంత వయస్సుందో, హేలీ పుట్టినప్పుడు నాకు అంతకన్నా ఒక నాలుగేళ్ళు తక్కువ వయస్సు ఉంది. అప్పటికి నేను తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన పుస్తకాలు చదివి వున్నాను. ఆ వయస్సులో నేను చదివిన ఇంగ్లీష్ పుస్తకాలు ఏమైనా వుంటే అవి మిల్స్ అండ్ బూన్స్ సిరీస్ మాత్రమే. మిగతావన్నీ నేను చదివినవి అనువాదాలే. ఇప్పుడున్న కొందరు ప్రముఖ రచయితల్లో చాలా మంది ఆ తరంలో హేలీ లాగానే యవ్వనం లో వున్నారు. అప్పుడు మేం చదివిన పుస్తకాలు ఇప్పుడు హేలీ చెప్తున్న ఇంగ్లీష్ పుస్తకాల జాబితా లాంటిది మాత్రం ఖచ్చితం గా కాదు. తెలుగు మీడియం స్కూల్స్ లో చదువుకొని, ఇంగ్లీష్ ని రెండో భాషగా మాత్రమే అవసరార్ధం నేర్చుకున్న తరం మాది. తెలుగు ని రెండో భాష గా నేర్చుకున్న తరం హేలీ లాంటి వారిది .అది ప్రధాన తేడా. అదే అసలైన తేడా. ఆ ప్రధాన తేడా నే ఇవాల్టీ తెలుగు సాహిత్యం పరిస్థితి. అది దుస్థితి అని నేననుకోవడం లేదు. ఆ తేడా ని గుర్తించకుండా, ఆ తేడా ను అంగీకరించకుండా తెలుగు సాహిత్యం తీరు తెన్నుల గురించి ఇప్పుడేమీ మాట్లాడలేం.

20 ఏళ్లలో ఆంగ్ల సాహిత్య ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పుస్తకాల్ని హేలీ తన వ్యాసం లో ప్రస్తావించారు. అసలు తెలుగు లో ‘ బెస్ట్ సెల్లర్స్ “ కాన్సెప్ట్ నే లేదు.మనకున్నదల్లా మూడో ముద్రణా, పదో ముద్రణా లాంటి లెక్కలు మాత్రమే. ఒక్కసారి శ్రీపాద, మల్లాది కథలుపుస్తకాలు ఎన్నేసి ముద్రణాల్లో వున్నాయో చూస్తే, అవి తరతరాలుగా ఎందుకు మళ్ళీ మళ్ళీ చదువుతున్నారో తెలుస్తుంది. అవన్నీ మన తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని కొంత వరకైనా అంచనా వేయటానికి పనికి వస్తాయి. ఎప్పటికప్పుడు కాలానుగుణం గా వస్తున్న రామాయణ భారతాలే కాదు, మాండలీకపు సాహిత్యం, అస్తిత్వ సాహిత్యం ఇవన్నీ హేలీ అడిగిన 20 ఏళ్ళ కాలంలో వచ్చినవే. హేలీ అడిగింది మొత్తం తెలుగు సాహిత్యం గురించి కాదు, ఫాంటసీ ఫిక్షన్ గురించే. అయినా సరే, తెలుగు సాహిత్యం మీద అతని కున్న చిన్న చూపు వల్ల ఇవన్నీ ప్రస్తావిస్తున్నాను. కాశీ మజిలీ కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి లాంటివి చదివి చిన్నతనంలో మాకంటూ ఒక వూహా లోకాన్ని సృష్టించుకున్నాము ఆ రోజుల్లో. వేల సంవత్సరాల తరబడి దక్షిణ దేశం లో వీధి నాటకంగా ప్రదర్శించబడుతూ వచ్చిన ఈ కథ కొవ్వలి కలం నుంది వెలువడినది ఒక్కసారి చదివితే పెద్దలకు కూడా రోమాంచితమవుతుంది. దానికి హేరీ పాటర్ ఎదురు నిలబడగలదు అని కూడా నేను అనుకోవటం లేదు. ఇక మీరు చెప్పిన గోల్డెన్ కంపాస్ లాంటి పుస్తకాల కంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు మనకు పంచతంత్రం వుంది.
ఇప్పటి పిల్లలు ఆ పుస్తకాలన్నీ చదివి , హెరీ పాటర్ కూడా చదివితే రెండింటికి వున్న తేడా తెలుస్తుంది. అంతే కానీ, తెలుగు లో వున్న ఫాంటసీ పుస్తకాలు చదవటం మానేసి, హేరీ పాటర్ లాంటి ఫిక్షన్ కోసం తెలుగు లో ఎదురు చూడటం అనవసరం.అది మన సంస్కృతి కాదు. మన సాహిత్యం మన సంస్కృతి నుంచి వస్తుంది. లేదా మీలాగా బాగా చదువుకున్న యువతరం తెలుగు లో కలం పట్టి సరికొత్త రచనలు చేస్తే వస్తుంది.

మనకు హేరీ పాటర్ ( పొట్టర్ కాదు) లార్డ్ ఆఫ్ రింగ్స్ లాంటివి ఎందుకు రాలేదని ప్రశ్న. అసలెందుకు రావాలి అనేది నా ప్రశ్న. విశ్వవ్యాప్తంగా పిల్లల్ని మంత్ర తంత్రాలు, దెయ్యాలు, భూతాలు, అడవి నక్కలు (వేర్ ఉల్ఫ్స్ ) వాంపైర్లు, జాంబీ లతో ఫాంటసీ ప్రపంచం చుట్టూ తిప్పటం అద్భుతం గా కనిపిస్తోంది. మనదగ్గరేమో ఒక్కప్పుడు చెప్పుకున్న భేతాళుడి కథలు, విక్రమార్కుడి సాహసాలు లాంటివి పిల్లలకు చెప్పాలంటే అవన్నీ అభివృద్ధి నిరోధకాలు అనిపించి పక్కన పెట్టేస్తున్నారు. చందమామ కి , ఇంగ్లీష్ పుస్తకాల్ని ముడిపెట్టడం అంత అన్యాయం మరొకటి లేదు. ఇప్పటికీ బ్లాగ్స్ లో కూడా ఉన్న చందమామ అభిమానులకు అది అవమానమే.చందమామ మన సంస్ర్కుతి. మీరు చెప్పే ఇంగ్లీష్ పుస్తకాలు వాళ్ళ సంస్కృతి. ఆ సంస్కృతి ని అభిమానించవచ్చు. కానీ , మన సంస్కృతి ని అగౌరవపరచనక్కరలేదు.
అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో క్రియేటీవ్ రైటింగ్ కోర్సులకు ఎంత డిమాండ్ వుంటుందో చాలా మందికి తెలిసిన విషయమే అనుకుంటాను. MFA కోర్సులంటే క్రేజ్. కానీ , మనకు రచన ఒక అభిరుచి. ఒక వృత్తి కాదు. అదొక ప్రవృత్తి. గ్లోబలైజేషన్ తో మన సమాజం లో వచ్చిన పెను మార్పుల్ని పట్టుకొని రచనల్లో చూపిస్తున్న రచయితలే ఇంకా తక్కువ మనకు. మన సమాజం, మన సంస్కృతి, మన జీవన విధానం నుంచి మన రచయితలు పుట్టుకొస్తారు. మన రచనలు పుట్టుకొస్తాయి . మాజిక్ స్కూల్స్, మంత్ర తంత్రాలు, వాం ఫైర్ లు లాంటివి మన సమాజం లో అంత విస్తృతంగా ప్రాచుర్యం లో లేవు. కాబట్టి ఇక్కడ నుంచి హెరీ పాటర్ రాదు. రాలేదు కూడా. వచ్చినా అది చాలా కృతకంగా కూడా వుంటుందెమో మరి. కాబట్టి వాటికి, మన దగ్గర వస్తున్న పుస్తకాలకు పోలికలు తెచ్చి వెతకడం వృధా ప్రయాస.
మన దగ్గర “ ట్వైలైట్ “ లాంటి పుస్తకాలు రాసే రచయితలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అని అడిగితే సరి కొత్త రచయితల నుంచి వస్తాయీ అని నేను చెప్తాను. . ప్రతి తరం నుండి భిన్నమైన రచయితలు వస్తే మీరు అడుగుతున్న పుస్తకాలు కాకపోయినా కొంతైనా విభిన్నమైన రచనలు వస్తాయి. పిల్లలకు, యూత్ కి మన దగ్గర కావాల్సిన సాహిత్యం లేదని ఒక నిందారోపణ. ఇప్పటి యూత్ ఎంతమంది తెలుగు సాహిత్యం చదువుతున్నారో ఎవరైనా లెక్కలు తీయగలిగితే ఎందుకు రావటం లేదో వూహించవచ్చు. యువత తెలుగు పాఠకుల లిస్ట్ లో పెద్ద సంఖ్యలో వున్నారని నేననుకోవటం లేదు. ఉంటే మంచిదే.

విభిన్న రచనలకు ఒక ఉదాహరణ చెప్తాను. యండమూరి తులసీదళం కున్న సాహిత్య విలువల్ని కాసేపు పక్కన వుంచి, ఒక సాహిత్య ప్రయోగం గా తీసుకొని మాట్లాడితే దాని మీద రచయితలు, సాహిత్యాభిమానులు చేసిన రచ్చ ఇప్పటి యువతరానికి తెలిసి వుండదు.కాష్మోరా , చేతబడులు లాంటివి మాట్లాడినందుకు, రాసినందుకు యండమూరిని ఊరి తీసినా తప్పు లేదన్నవాళ్ళున్నారు. తెలుగు సంస్కృతి ని యండమూరి భ్రష్టు పట్టించాడు అని దుమ్మెత్తి పోసిన వాళ్ళున్నారు. అయినా సరే, మామూలు పాఠకులు ఎగబడి ఆ పుస్తకాలు కొన్నారు, చదివారు, మెచ్చుకున్నారు.
ఒక తరం వరకూ నవలలంటే యద్ధనపూడి, లేదా యండమూరి. ఆ మూస ను బద్దలు కొట్టి ఒక మంచి నవల , సమాజానికి అవసరమైన నవల ఒకటి భిన్నమైన దృక్పథంతో , భిన్నమైన ఇతివృత్తం తో వచ్చింది. అదే “ దృశ్యాదృశ్యామ్”. చంద్రలత రాసిన నవల. చంద్రలత ఆ నవల ఎలా రాయగలిగింది? ఆమె కు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో వున్న పట్టు, ఆమెకున్న ఎక్స్ పోజర్, విస్తృత ప్రపంచ సాహిత్య పరిజ్నానమ్, గ్లోబర్ వార్మింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అవగాహన, వీటన్నింటి కి తోడు తెలుగు జీవన సరళి మీద ఆమెకున్న పట్టు అదీ ఆమె ఆ నవల రాసేలా చేయగలిగింది. ఆ నవల ను ఒక వాసిరెడ్డి సీతాదేవో, ఒక యద్ధనపూడి నో, చివరకు ఒక వోల్గా కూడా రాయగలిగివుండేవారు కాదు.

ఒక్కో తరం నుండి ఎప్పటికప్పుడు కొత్త తరం రచయితలు పుట్టుకు రావాలి. వారి నేపధ్యం నుంచి కొత్త రకం రచనలు వస్తాయి. మన పని ఏమిటంటే అలా వచ్చిన కొత్త రచనల్ని చదివి, బావుంటే మెచ్చుకొని ప్రోత్సహించడం. ఆ ఉత్సాహంతో మరో కొత్త రచయిత కి అవకాశం ఇవ్వడం.అప్పటి దాకా తెలుగు సాహిత్యం ఇలానే నెమ్మదిగా పురోగమిస్తూ వుంటుంది. తెలుగుగడ్డ మీద పుట్టిన తెలుగు పిల్లలకు తెలుగే రెండో భాషగా ఉన్నంత కాలం మన సాహిత్యం ఇలాగే వుంటుంది. పారడైమ్ షిఫ్ట్ ఇక్కడ ఉన్నట్లుండి ఒక ఉదయం జరిగి పోతుందని నేననుకోవటం లేదు.
..మన తెలుగు సమాజం లో ఇప్పుడున్న ఫ్యూచర్ సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్ కాదు, కాబోయే అమెరికన్, కెనెడియన్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. వారికి కావాల్సింది ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రమే. తెలుగు పుస్తకాలు కాదు. మాలాంటి వాళ్ళకు అభిరుచి దృష్ట్యా ఇంగ్లీష్ పుస్తకాలు చదివినా, మనస్సంతా తెలుగు పుస్తకాల చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. తెలుగు సాహిత్యానికి కూడా ఒక గొప్పతనం ఉంది, దాన్ని గౌరవించడం అంటే ఆ భాషలో మాట్లాడటం, ఆ భాషలో రాయడం, ఆ భాషలో రచన చేయడం అని మాలాంటి వాళ్ళు కొందరు ఇంకా భ్రమపడుతున్నారు వెనకబడ్డ మాలాంటి తెలుగు అభిమానుల్ని ఇలా వదిలేయ్యండి. మమ్మల్ని ఇలా తెలుగు సాహిత్యాన్ని ఎంజాయ్ చేయనివ్వండి. తెలుగు వ్యాసాలకు ఇంగ్లీష్ లో కామెంట్లు పెట్టె మహోన్నత స్థితి కి మమ్మల్ని తీసుకెళ్లద్దు. మేం ఎదగలేము. మేమిలాగే వుంటామ్. మమ్మల్ని ఇలాగే వుండనివ్వండి.

(తెలుగేప్పుడూ రెండో భాషనే అంటూ నిడదవోలు మాలతి గారు రాసిన మరో మంచి వ్యాసం ఇక్కడ చదవండి.)


కల్పనారెంటాల
 
Real Time Web Analytics