‘ ప్రమాదో ధీమతా మపి’ ---బుద్ధిమంతులు కూడా పొరపాటు పడతారు. పొరబడటం అనేది సర్వజన సామాన్యం అని తెలుసు. కాబట్టి ఈ కింద నేను పేర్కొనే అంశాలు మాలతి చందూర్ గారి మీద గౌరవ ప్రపత్తులతో మాట్లాడుతోందే అని గమనించగలరు.
“ నన్ను అడగండి” శీర్షిక కింద జూన్ 25 వ తేదీ స్వాతి సపరివారిపత్రికలో “ లిటరేచర్” కేటగిరీలో అడిగిన ప్రశ్నకు మాలతి చందూర్ గారి సమాధానం నన్ను నివ్వెరపరిచింది. ఆ ప్రశ్న, ఆమె ఇచ్చిన సమాధానం,దానికి నా ప్రతిస్పందన చదవండి.
“ శరత్ చంద్రుని పోలిన తెలుగు నవలాకార్లు లేరనేవారు. అలాగే మహాశ్వేతాదేవిని పోలిన రచయిత్రులు ఎవరూలేరా?” అన్నది ప్రశ్న.
మాలతి చందూరి గారి సమాధానం చదవండి:
వేలూరి శివరామశాస్త్రి బెంగాలీ నుంచి తెలుగు లోకి అనువదించిన “ రాముని బుద్ధిమంతనం’, తీరని కోరికలు’ అనూహ్య పాఠకాదరణ పొందాయి.
ఆ తర్వాత చక్రపాణీ, బొందలపాటి శివరామకృష్ణ , గద్దె లింగయ్య వంటి వారెందరో శరత్ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. ముప్పైల ద్వితీయార్థం లోనే ‘ దేవదాసు’ పిక్చర్, సైగల్ హీరో గా బెంగాలీ, హిందీలలో కలకత్తా నుంచి వచ్చింది.
వేలూరి వారి ‘ రాముని బుద్ధి మంతనం’ ప్రకాష్ ప్రొడక్షన్స్ ‘ దీక్ష’ గా యాభైల నాటికే తెరకెక్కింది. ఇక మహా శ్వేతా దేవి విషయమంటారా? కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకొను.
తెలుగు వచనారచనా ప్రపంచం ప్రాంతాల వారీ, జిల్లాలా వారీ గీతాలు గీసుకుంటోంది. మేము ఏనాడో రాష్త్రేతరాంధ్రులయ్యాము కాబట్టి మమ్మల్ని ఇవేమీ తాకవు.
మహాశ్వేతాదేవి తో కేరళ లోని తుంజన్ మెమోరియల్ సెంటర్లో గడపగలడం మా అదృష్ట్రం. ఉదయం పూట చెట్ల మధ్య తిరుగుతూ ఎన్నెన్నో అపూర్వ విషయాలు చెప్పేవారు. సన్మిత్రులు జ్నానపీఠ్ అవార్డ్ గ్రహీత పద్మ భూషణ్ వాసుదేవన్ నాయర్ కేరళ లోని తుంబన్ కేంద్ర వ్యవస్థాపకులు , కార్య నిర్వాహకులూను. మూడు రోజుల సెమినార్. కానీ రెండో రాత్రే మహాశ్వేతా దేవి బొంబాయి వెళ్ళి పోయారు. అక్కడేదో పని వుండటం వల్ల ఆ రెండు రోజులు స్మృతి వాటికలో పచ్చనాకులా భాసిస్తాయి.
తన ముప్పైయవ ఏట 1956 లో మొదటి నవలా రచనకు పూనుకున్నారామే. ఆంగ్లేయులు తన రాజ్యాన్ని కబళీంచకుండా ఆశ్విక యుద్ధం లో కత్తి ఝళిపిస్తూవీరోచితంగా పోరాడి నెలకొరిగిన ధీరనారి ఝాన్సీ రాణి అని మనకందరికీ తెలుసు. కానీ మహాశ్వేతా దేవి ఆ నవలకు రూపకల్పన చేసే ముందు చారిత్రాకాంశాలు క్షుణ్ణంగా చదివారు. అర్కైవ్స్ పూర్తిగా పరిశీలించారు.
ఝాన్సీ నగరం వెళ్లారు. ఝాన్సీ రాణి గురించి ఎడారి తెగలు పాడుకొనే పాటలు, మైదానాల్లోని జానపదుల గీతాలు శ్రద్ధగా ఆలకించి , నిగూఢ వృత్తాంతాన్ని ఆకళింపు చేసుకొని మనోముద్రితమైన వాటితో నవలారచనకి ఉపక్రమించినప్పుడు అదేలా వుంటుందో వేరే చెప్పాలా?
ఇదీ మాలతి చందూరి గారి సమాధానం. ఆమె తన సమాధానం లో “ కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకోనూ”. అన్నారు. విశ్వసాహిత్యాన్ని చదువుకున్న రచయిత్రి మాలతి చందూర్ గారి కలం నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ని చదివి నేను ఆశ్చర్యపోయాను.
మహాశ్వేత దేవి ని పోలిన రచయిత్రులు తెలుగు లో ఎవరూ వుండి వుండకపోవచ్చు. కానీ మహా శ్వేత దేవి రచనలు కూడా ఎవరూ చదివి వుండరని వ్యాఖ్యానించడం శోచనీయం. మహాశ్వేత దేవి రచనల్లో ముఖ్యమైనవి తెలుగు లో అనువాదమయ్యాయి. ఆ అనువాదాలే కాక ఇంగ్లిష్ లో అనువాదమైన ఆమె ముఖ్యమైన రచనలు ( గాయత్రి చక్రవర్తి స్పైవాక్ క్రిటికల్ అనాలిసిస్ తో సహా) నేను చదివి కొన్నేళ్ళ క్రితం వార్త ఆదివారం దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. నాతో పాటు అనేకమంది రచయిత్రులు మహాశ్వేత దేవి రచనలు చదివి విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. బహుశా ఆంధ్ర దేశ సాహిత్యానికి దూరం గా వుందటం వల్ల మాలతి చందూర్ గారికి మహాశ్వేతాదేవి కథలు తెలుగు లోకి అనువాదమయ్యాయన్న విషయమైనా తెలిసో లేదో నాకు తెలియదు.
మహాశ్వేతాదేవి రచనలు ఒక తల్లి ( హజార్ చౌరాసీ మా), ఎవరిదీ అడవి? ( జంగల్ కి అధికార్), దయ్యాలున్నాయి జాగ్రత్త ( దాయిన్) బషాయిటుడు, రుడాలీ కథలు, చోళీకే పీచే ....ఇవన్నీ కేవలం హెచ్ బి టి వాళ్ళు చేసిన ప్రచురణలు. మాలతి చందూర్ గారు భ్రమపడినట్లు తెలుగు రచయిత్రులే కాదు మామూలు పాఠకులు కూడా ఎవరైనా ఇప్పటివరకూ ఆమె రచనలు చదివి వుండకపోతే( నేననుకొను) బహుశా ఇప్పుడు పైన నేను చెప్పిన పుస్తకాలన్నీ హెచ్ బి టీ వాళ్ళ దగ్గర ఇంకా దొరుకుతూ వుండవచ్చు. ప్రయత్నించి చూడండి.
ఇవి కాక ఆమె రచనలు దాదాపుగా అన్నీ ఇంగ్లీష్ లో విరివిగా దొరుకుతాయి.
ఒక బాధ్యతాయుతమైన రచయిత్రిగా, విజ్నురాలిగా మాలతి చందూర్ లాంటి ప్రముఖులు కూడా తోటి రచయిత్రుల పట్ల బాధ్యాతారహితంగా, పత్రికాముఖం గా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు.
నేను పోగొట్టుకున్న రచనల్లో మహాశ్వేతా దేవి రచనల మీద రాసిన వ్యాసం కూడా వుంది. కాబట్టి ప్రస్తుతానికి అది ఇక్కడ పెట్టలేను కానీ. ఈటీవీ లో మార్గదర్శి కార్యక్రమం కోసం మహాశ్వేతా దేవి జీవితం గురించి 2006-07 మధ్య నేను రాసి ఇచ్చిన వ్యాసం త్వరలో పోస్ట్ చేస్తాను.
My Notes to my Daughter: 6. Literary Trends and Readership
-
As I wrap up these Notes, I would like to address a few topics that changed
my perception of Telugu literary field in my lifetime. I’ll try to be brief
for...
6 days ago