నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Saturday, July 31, 2010

మహాశ్వేత రచనలు తెలుగు లో ఎవరూ చదవలేదా?

‘ ప్రమాదో ధీమతా మపి’ ---బుద్ధిమంతులు కూడా పొరపాటు పడతారు. పొరబడటం అనేది సర్వజన సామాన్యం అని తెలుసు. కాబట్టి ఈ కింద నేను పేర్కొనే అంశాలు మాలతి చందూర్ గారి మీద గౌరవ ప్రపత్తులతో మాట్లాడుతోందే అని గమనించగలరు.


“ నన్ను అడగండి” శీర్షిక కింద జూన్ 25 వ తేదీ స్వాతి సపరివారిపత్రికలో “ లిటరేచర్” కేటగిరీలో అడిగిన ప్రశ్నకు మాలతి చందూర్ గారి సమాధానం నన్ను నివ్వెరపరిచింది. ఆ ప్రశ్న, ఆమె ఇచ్చిన సమాధానం,దానికి నా ప్రతిస్పందన చదవండి.

“ శరత్ చంద్రుని పోలిన తెలుగు నవలాకార్లు లేరనేవారు. అలాగే మహాశ్వేతాదేవిని పోలిన రచయిత్రులు ఎవరూలేరా?” అన్నది ప్రశ్న.
మాలతి చందూరి గారి సమాధానం చదవండి:

వేలూరి శివరామశాస్త్రి బెంగాలీ నుంచి తెలుగు లోకి అనువదించిన “ రాముని బుద్ధిమంతనం’, తీరని కోరికలు’ అనూహ్య పాఠకాదరణ పొందాయి.

ఆ తర్వాత చక్రపాణీ, బొందలపాటి శివరామకృష్ణ , గద్దె లింగయ్య వంటి వారెందరో శరత్ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేశారు. ముప్పైల ద్వితీయార్థం లోనే ‘ దేవదాసు’ పిక్చర్, సైగల్ హీరో గా బెంగాలీ, హిందీలలో కలకత్తా నుంచి వచ్చింది.

వేలూరి వారి ‘ రాముని బుద్ధి మంతనం’ ప్రకాష్ ప్రొడక్షన్స్ ‘ దీక్ష’ గా యాభైల నాటికే తెరకెక్కింది. ఇక మహా శ్వేతా దేవి విషయమంటారా? కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకొను.

తెలుగు వచనారచనా ప్రపంచం ప్రాంతాల వారీ, జిల్లాలా వారీ గీతాలు గీసుకుంటోంది. మేము ఏనాడో రాష్త్రేతరాంధ్రులయ్యాము కాబట్టి మమ్మల్ని ఇవేమీ తాకవు.

మహాశ్వేతాదేవి తో కేరళ లోని తుంజన్ మెమోరియల్ సెంటర్లో గడపగలడం మా అదృష్ట్రం. ఉదయం పూట చెట్ల మధ్య తిరుగుతూ ఎన్నెన్నో అపూర్వ విషయాలు చెప్పేవారు. సన్మిత్రులు జ్నానపీఠ్ అవార్డ్ గ్రహీత పద్మ భూషణ్ వాసుదేవన్ నాయర్ కేరళ లోని తుంబన్ కేంద్ర వ్యవస్థాపకులు , కార్య నిర్వాహకులూను. మూడు రోజుల సెమినార్. కానీ రెండో రాత్రే మహాశ్వేతా దేవి బొంబాయి వెళ్ళి పోయారు. అక్కడేదో పని వుండటం వల్ల ఆ రెండు రోజులు స్మృతి వాటికలో పచ్చనాకులా భాసిస్తాయి.

తన ముప్పైయవ ఏట 1956 లో మొదటి నవలా రచనకు పూనుకున్నారామే. ఆంగ్లేయులు తన రాజ్యాన్ని కబళీంచకుండా ఆశ్విక యుద్ధం లో కత్తి ఝళిపిస్తూవీరోచితంగా పోరాడి నెలకొరిగిన ధీరనారి ఝాన్సీ రాణి అని మనకందరికీ తెలుసు. కానీ మహాశ్వేతా దేవి ఆ నవలకు రూపకల్పన చేసే ముందు చారిత్రాకాంశాలు క్షుణ్ణంగా చదివారు. అర్కైవ్స్ పూర్తిగా పరిశీలించారు.

ఝాన్సీ నగరం వెళ్లారు. ఝాన్సీ రాణి గురించి ఎడారి తెగలు పాడుకొనే పాటలు, మైదానాల్లోని జానపదుల గీతాలు శ్రద్ధగా ఆలకించి , నిగూఢ వృత్తాంతాన్ని ఆకళింపు చేసుకొని మనోముద్రితమైన వాటితో నవలారచనకి ఉపక్రమించినప్పుడు అదేలా వుంటుందో వేరే చెప్పాలా?

ఇదీ మాలతి చందూరి గారి సమాధానం. ఆమె తన సమాధానం లో “ కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకోనూ”. అన్నారు. విశ్వసాహిత్యాన్ని చదువుకున్న రచయిత్రి మాలతి చందూర్ గారి కలం నుంచి వచ్చిన ఈ వ్యాఖ్య ని చదివి నేను ఆశ్చర్యపోయాను.

మహాశ్వేత దేవి ని పోలిన రచయిత్రులు తెలుగు లో ఎవరూ వుండి వుండకపోవచ్చు. కానీ మహా శ్వేత దేవి రచనలు కూడా ఎవరూ చదివి వుండరని వ్యాఖ్యానించడం శోచనీయం. మహాశ్వేత దేవి రచనల్లో ముఖ్యమైనవి తెలుగు లో అనువాదమయ్యాయి. ఆ అనువాదాలే కాక ఇంగ్లిష్ లో అనువాదమైన ఆమె ముఖ్యమైన రచనలు ( గాయత్రి చక్రవర్తి స్పైవాక్ క్రిటికల్ అనాలిసిస్ తో సహా) నేను చదివి కొన్నేళ్ళ క్రితం వార్త ఆదివారం దినపత్రికలో ఒక వ్యాసం రాశాను. నాతో పాటు అనేకమంది రచయిత్రులు మహాశ్వేత దేవి రచనలు చదివి విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. బహుశా ఆంధ్ర దేశ సాహిత్యానికి దూరం గా వుందటం వల్ల మాలతి చందూర్ గారికి మహాశ్వేతాదేవి కథలు తెలుగు లోకి అనువాదమయ్యాయన్న విషయమైనా తెలిసో లేదో నాకు తెలియదు.

మహాశ్వేతాదేవి రచనలు ఒక తల్లి ( హజార్ చౌరాసీ మా), ఎవరిదీ అడవి? ( జంగల్ కి అధికార్), దయ్యాలున్నాయి జాగ్రత్త ( దాయిన్) బషాయిటుడు, రుడాలీ కథలు, చోళీకే పీచే ....ఇవన్నీ కేవలం హెచ్ బి టి వాళ్ళు చేసిన ప్రచురణలు. మాలతి చందూర్ గారు భ్రమపడినట్లు తెలుగు రచయిత్రులే కాదు మామూలు పాఠకులు కూడా ఎవరైనా ఇప్పటివరకూ ఆమె రచనలు చదివి వుండకపోతే( నేననుకొను) బహుశా ఇప్పుడు పైన నేను చెప్పిన పుస్తకాలన్నీ హెచ్ బి టీ వాళ్ళ దగ్గర ఇంకా దొరుకుతూ వుండవచ్చు. ప్రయత్నించి చూడండి.

ఇవి కాక ఆమె రచనలు దాదాపుగా అన్నీ ఇంగ్లీష్ లో విరివిగా దొరుకుతాయి.

ఒక బాధ్యతాయుతమైన రచయిత్రిగా, విజ్నురాలిగా మాలతి చందూర్ లాంటి ప్రముఖులు కూడా తోటి రచయిత్రుల పట్ల బాధ్యాతారహితంగా, పత్రికాముఖం గా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు.

నేను పోగొట్టుకున్న రచనల్లో మహాశ్వేతా దేవి రచనల మీద రాసిన వ్యాసం కూడా వుంది. కాబట్టి ప్రస్తుతానికి అది ఇక్కడ పెట్టలేను కానీ. ఈటీవీ లో మార్గదర్శి కార్యక్రమం కోసం మహాశ్వేతా దేవి జీవితం గురించి 2006-07 మధ్య నేను రాసి ఇచ్చిన వ్యాసం త్వరలో పోస్ట్ చేస్తాను.

16 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

ఈ మధ్య మాలతీ చందూర్ గారి సమాధానాలు పొంతన లేకుండా వుంటున్నాయని బ్లాగుల్లోనే ఎక్కడో చర్చ నడిచింది. అసలు ఈమధ్య వారే రాస్తున్నారా లేక వేరే వారితో వ్రాయిస్తున్నారా అని కొంతమంది సందేహ పడ్డారు కూడానూ. నేనయితే ఇంకా మహాశ్వేతాదేవి రచనలు చదవలేదు.

Kathi Mahesh Kumar said...

ప్రశ్నకు సమాధానానికీ పొంతనే లేదు. పొంతనేని సమాధానంలోని ఒక assumption ని తీసుకుని బాధపడి ఏంలాభం చెప్పండి!ఆ అనుకోలు ఆవిడ స్వయానుభవమేమో అనుకోవచ్చుకదా!

బాలాజీ said...

బషాయిటుడు, రుడాలీ... మాటీవీలో పనిచేసేటప్పుడు మా ఇన్చార్జ్ టీవీఎస్ గారి పుణ్యమా అని మహాశ్వేతాదేవి రచనలు ఈ రెండూ చదివానండీ. ఆవిడ తీరిగ్గా ఇంట్లో కూర్చుని రాసే రచయిత్రి కాదనీ జనం మధ్య తిరిగి వారితో మమేకమై (మా జర్నలిస్టు పరిభాషలో చెప్పాలంటే లెగ్ వర్క్ చేసి మరీ) రాస్తారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ రెండు పుస్తకాలూ చదివాక ఆ మాట నిజమే అనిపించింది.

బాలాజీ said...

సారీ, ‘మా జర్నలిస్టు పరిభాషలో’ అని పొరపాటున అన్నాను. ‘మన జర్నలిస్టు పరిభాషలో’ అని నా ఉద్దేశం.

సుజాత వేల్పూరి said...

మీరు ఏమైనా అనుకోండి కల్పనా, మాలతీ చందూర్ గారి సమాధానాలు ప్రతి వారమూ చదువుతాను..ఒక్క వారమైనా relevent గా సమాధానం ఒక్క ప్రశ్నకైనా చెప్తారేమో అని! ఊహూ!( ఆమె రచనలు మొత్తం నా వద్ద ఉన్నాయి. శతాబ్ది సూరీడు నాకెంతో నచ్చిన నవల. ఇంకా అనేకం నచ్చుతాయి).ఆ శీర్షికకు "నన్ను అడగండి"అని కాక "నాకే తెలుసు" అని పెడితే బావుండేమో అనిపిస్తుందీ మధ్య!

బహుశా మాలతీ చందూర్ గారు కాలములూ,కథలు రాసే రచయితలూ రచయిత్రులనీ మాత్రమే గమనిస్తూ సామాన్య పాఠకులని చిన్న చూపు చూస్తున్నారేమో! తెలుగు సాహిత్యం చదివే పాఠకులు ఇదివరకటి స్థాయిలో కాకపోయినా ఉత్తమ సాహిత్యం చదివే వారు ఇప్పటికీ ఉన్నారన్న సంగతిని ఆమె విస్మరిస్తున్నారానుకుంటాను. అదీకాక ఈ మధ్య ప్రతి జవాబులోనూ వారి వ్యక్తిగతానుభవాలు చేర్చి విసిగిస్తున్నారు.

ఆవిడ మొదటినుంచీ ఆంధ్ర దేశానికి దూరగా ఉంటూనే ఆంధ్ర సాహిత్యాన్ని సృష్టించారు కదా! ఇదివరలో లేని "ఇది"ఇప్పుడెందుకో అర్థం కాదు.

HBTవాళ్ళు వేసిన ఆమె అనువాదాలు ఇప్పటికీ కొన్ని దొరుకుతూనే ఉన్నాయి.రుడాలి సినిమాను నేను ఆమె నవల చదివాకనే మరింతగా అర్థం చేసుకున్న అనుభూతిని పొందగలిగాను.హజార్ చౌరాసీ మా నేను ఇంగ్లీష్ లోనే చదివాను.


పాఠకులు జనరల్ గా అడిగిన ప్రశ్నకు అనుకోళ్ళకు స్వీయానుభవాలు చేర్చి చెప్పడం ఏమి న్యాయం?

Praveen Mandangi said...

ఓసారి మాలతీ చందూర్ గారిని భ్రూణ హత్యలు (కడుపులోని ఆడ పిండాల అబార్షన్) గురించి అడిగితే కుటుంబ నియంత్రణ పేరు చెప్పి జస్టిఫై చేశారు. మాంసాహారం గురించి అడిగితే వ్యవసాయం అంతగా అభివృద్ధి చెందని టిబెట్, మంగోలియా లాంటి ప్రాంతాలలో రోజూ మాంసం తినేవాళ్ల పరిస్థితి గురించి చెప్పనేలేదు.

మాలతి said...

:D) నేను మాహాశ్వేతాదేవి రచనలు చదవలేదు. అందుకేనేమో నా ఉత్తరాలకి యన్నార్ చందూర్ సమాధానాలు ఇచ్చారు :(. మంచి పాయింటే చర్చకి పెట్టేవు కల్పనా. వ్యాఖ్యలు కూడా బాగున్నాయి.

భాను said...

charcha baagundi

Kalpana Rentala said...

@శరత్ గారు,
అవునా. మాలతి చందూర్ గారి మీద జరిగిన చర్చ నేను చూడలేదండీ. టైం దొరికితే ఆమె రచనలు చదవండి.
@మహేశ్, పొంతన లేని సమాధానం ఇచ్చిందని, ఇస్తోందని నేనొక్కదాన్నే అనుకున్నాను. ఇక్కడ రాయటం వల్ల మీరంతా కూడా అలాగే అనుకుంటున్నారని తెలిసింది.
@బాలాజీ..అవును. మన జర్నలిస్ట్ పరిభాష లోనే.ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు?
@ సుజాత, అనుకోవడం ఏమీ లేదు. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. కానీ నేను ఆ మాట అనటానికి కొంచెం మొహమాటపడ్డాను.మీరు చెప్పినట్లు శీర్షిక పేరు మార్చమని ఎవరైనా సలహా ఇస్తే బావుంటుంది. సరిగ్గా సరిపోతుంది.తెలుగు సాహిత్యం చదివే మామూలు రీడర్లను అటు రచయితలు, ఇటు విమర్శకూలు ఇద్దరూ విస్మరిస్తున్నారనుకుంటాను.
@ప్రవీణ్-- మీ ఒబ్జర్వేషన్ కి నా నో కామెంట్
@మాలతి గారు, అదృష్టవంతులు. మీకు ' సమాధానాలు ' వచ్చాయి. కాకపోతే అవి మీరు అడిగిన వాటికా? అడగనివాటికో చూసుకోండి. ఎందుకైనా మంచిది.హిహిహి..
@భాను, థాంక్స్.

ఆ.సౌమ్య said...

మాలతీ చందూర్ గారి సమాధానాల గురించి ఇక్కడ ఒక చర్చ జరిగింది, వీలైతే చూడండి.

http://rani-ratnaprabha.blogspot.com/2010/06/blog-post_18.html

S said...

"మహా శ్వేతా దేవి విషయమంటారా? కథలూ, కాలమ్స్ రాసే తెలుగు రచయిత్రులు ఆమె పేరు వినివుండవచ్చు గాని రాసినదేదీ చదివి వుంటారనుకొను."
-That's too demeaning!!

మాలతి said...

కల్పనా, నిస్సందేహంగా అడగనివాటికే. నేను ఆవిడకథగురించి అడిగితే, ఆయన తెలుగు కథలు ఇంగ్లీషులోకి అనువదించవలిసిన అవుసరం, రాజారావు సేవ లాటివి రాసేడు. అందుకే ఒళ్ళు మండి, ఇలాటివాళ్ళతో పెట్టుకోకూడదనే నిశ్చయానికి వచ్చేను. ఇంత ఆలస్యంగానా అని అడక్కు మరి. :p

మాలతి said...

అన్నట్టు నేనో శీర్షిక మొదలు పెడదాం అనుకుంటున్నా అడక్కండి మరి అనీ :))

Anonymous said...

"అడక్కపోయినా చెప్తాను"..... ఈ శీర్షిక ఎలా ఉంటుందో ఆలోచించండి :-))

మాలతి said...

అడక్కపోయినా - అవునండీ. ఇదే కరెక్టు శీర్షిక ... ఇంక ఏం రాయాలని ఆలోచించఖ్ఖర్లేదు కూడాను. =:))

Anonymous said...

inkem ledu correctemo?

 
Real Time Web Analytics