నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, April 23, 2010

తొలి పుస్తకపు ప్రణయాలు- కొన్ని స్మృతులు!



అక్షరం పరః బ్రహ్మ స్వరూపం
పుస్తకం పరమౌషధం

కొందరి జీవితాలు పుస్తకాల చుటూ తిరుగుతుంటాయి. అందులో నాది కూడా ఒకటనుకుంటాను. ఆ మాటకొస్తే చాలా మంది జీవితాలు తెరిచిన పుస్తకాల్లాంటివి. అయితే ఒక్కోసారి ఆ పుస్తకం లోని పేజీల్లో అక్షరాలు మాయమైపొతాయి మంత్రజాలం లాగా. కొన్ని పేజీలు చిరిగిపోతాయి. మరికొన్ని నలిగిపోతాయి. కొన్ని కావాలని ఎవరో ఒకరు బలవంతంగా చింపేస్తారు. అంత మాత్రాన అది పుస్తకం కాకపోతుందా? మనది జీవితం కాకుండా పోతుందా?

అయిదేళ్ళకే విష్వక్సేనుడు శుధ్ధంగా పలకటం వచ్చేసిన తర్వాత పెద్దబాలశిక్ష ముందు వేసుకొని అలా అక్షరాల్ని గుర్తు పట్టుకుంటూ , చదువుకుంటూ వెళ్ళిపోవటం.అలా మొదలైంది నా సారస్వత ప్రయాణం.తెలియని అంటే చదవటానికో , పలకటానికో కష్టం గా వున్న పదాల్ని ఒకసారి అడిగి చెప్పించుకున్న తర్వాత ఇక మళ్ళీ అడగటానికి వీల్లేదు.. గుర్తు పెట్టుకు తీరాల్సిందే. తెలుగు మాట్లాడటము, చదవటం విషయంలో మాత్రం మానాన్నగారు నిరంకుశం గానే వ్యవహరించారని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ నాలుగు మాటలైనా రాయగలుగుతున్నానంటే అది ఆదిగురువైన మా నాన్నగారు పెట్టిన భిక్షే.

ఏడేళ్ళకే భగవద్గీత చదివి స్థితప్రజ్ఞుడు అంటే ఓస్! ఇంతేనా, ఇంత తేలికగా అంతా అర్ధమైపొతుంటే గీత చాల కష్టం, అర్ధంకాదు అంటారేమిటి? అని నాకు నేనే అనేసుకొని మా నాన్నగారికి అప్పుడే చెప్పేసాను. నేను పెద్దయ్యాక గొప్పదాన్ని తప్పక అవుతానని. దానికి నేను చెప్పిన వివరణ ఏమిటంటే పెద్దవాళ్ళకు కూడా అర్ధం కాని , కొరుకుడు పడని స్థితప్రజ్ఞత్వం నాకు అర్ధమైపోవటం వల్ల నేను ఖచ్చితంగా గొప్పదాన్ని అయిపోతానని నాకు గాఢ నమ్మకం. మా నాన్నగారు ఎందుకు ముసిముసిగా నవ్వుకున్నారో అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది ఆ నవ్వు వెనుక వున్నదేమిటో!ఆ పదానికి నిర్వచనం తెలియటం కాదు,అది ఆచరించి చూపిన నాడు అది నిజంగా అర్ధమైనట్టు అని ఇప్పుడు కదా తెలిసింది. అయితేనేమి అలా నా మీద నాకొక ఆత్మవిశ్వాసం కలిగించి నా వూహలకు రెక్కలు తొడిగించాయి భగవద్గీత లాంటి పుస్తకాలు. ఇప్పుడొకొక్కసారి ఆ పసితనపు ఆత్మవిశ్వాసం ఎక్కడ దాక్కుందా అని వెతుక్కుంటుంటాను.
తెలుగు నవలా సాహిత్యంలో నేను మొదట చదివిన పుస్తకం ద్వివేదుల విశాలాక్షి గారి 'గోమతి నవల. ఆ నవలలో కధానాయిక గోమతి పడే కష్టాలు, బాధలు చూసి అలా ఎందుకు బతకాలి,గట్టిగా ఎదురుమాట్లాడి తనకెలా కావాలో అలా వుండచ్చు కదా అని బోలెడంత ఆవేశం తెచ్చుకొని మా నాన్నగారితో వాదనేసుకున్నాను. అప్పుడు మా నాన్నగారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా తెలివిగా ఇంకేవొ విషయాలు చెప్పారు అచ్చమైన ఆడపిల్ల తండ్రిలాగా. ఆ రచయత్రి కధనాయికకు గోమతి అని ఎందుకు పేరు పెట్టిందో చెప్పారు. ఆ వివరణ అప్పట్లోనే అంత చికాకు తెప్పించిందంటే ఇప్పుడిక చెప్పక్కరలేదు. అదేమిటంటే గోమతి అనేది నది పేరు. నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టకూడదని, ఎందుకంటే ఆ నదుల జీవితాల్లాగే వాళ్ళ జీవితాలు కూడా దుఃఖభాజితాలవుతాయని. పాపం పిచ్చి నాన్న,ఈ ప్రపంచంలో నదుల పేర్లు పెట్టుకోని ఆడపిల్లల జీవితాలు కూడా లాటరి టికెట్ల లాంటివని ఆయనకు తెలియలేదు.
అలా నాకు అయిదేళ్ళ వయస్సు నుంచి ఒక్కో అక్షరాన్ని, ఒక్కో పదాన్ని, ఒక్కో పదానికి అర్ధాన్ని కూడబలుక్కుంటూ క్రమంక్రమంగా అర్ధం చేసుకుంటూ, అబ్బురపడిపోతూ, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, పగలబడి నవ్వుకుంటూ, భక్తితో కళ్ళకద్దుకుంటూ, నవరసభావాలతో, నవవిధ భక్తి భావనలతో మొదలెట్టిన చదువు ఇంకా పూర్తి కాలేదు. తల్లీ నిన్ను దలంచి అంటూ చెప్పుకున్న పద్యాలు, గురుః బ్రహ్మ,గురుః విష్ణు అంటూ చెప్పుకున్న శ్లోకాలు అన్ని నరనరాన, అణువణువునా నిండిపోయాక, ఇప్పటికీ కాళ్ళకు ఏ పుస్తకమో, ఒక చిన్న కాగితముక్కో తగిలితే బాబోయి చదువు రాదేమో అన్న భయమే మొదట నా మనసులో మెదిలేది.

మా ఇల్లొక అక్షర దేవాలయము. అక్కడ దొరకని పుస్తకం లేదు. మా నాన్నగారు మాకు వివరించి చెప్పలేని కఠినమైన విషయం లేదు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు మా నాన్నగారొక వారధిలాగా కనిపించేవారు.భారతం, భాగవతం, రామాయణం, పంచ మహాకావ్యాలతో పాటు శరత్ సాహిత్యం, నవలలు, కధలు, అభ్యుదయ కవితాలు, రష్యన్ సాహిత్యపు అనువాదాలు అన్నీ మా సొంత లైబ్రరి లో వుండేవి. అందుకే మాకు వ్యాసుడు, వాల్మీకి తో పాటు టాల్ స్టాయి, దోస్తోవిస్కీ, అలెగ్జాండర్ కుప్రిన్ కూడా అంత బాగా తెలుసు. ఒక పక్క భారతం, మరో పక్క యుధ్ధం-శాంతి చదివిన తర్వాత ఇక జీవితంలో యెటువంటి పరిస్థితుల్లో కూడా యే దేశమైనా,ఏ దేశప్రజలపైనైనా యుధ్ధం చెయ్యటం ఎంత తెలివితక్కువ పనో అప్పుడే బలంగా నాటుకుపోయింది. ఇలా ఒక్కో పుస్తకం నుండి ఒక్కో పాఠం నేర్చుకున్నాను.
అనుబంధాలు, ఆకలి, మరణం --ఇవన్నీ కలిసి ఒక సమగ్రజీవితమనిపిస్తాయి. నన్ను బాగా కదిలించిన పుస్తకాలు అన్నా కెరినినా, మృత్యు ముఖంలో తుదిరోజు (సుప్రసిధ్ధ ఫ్రెంచ్ రచయత విక్టర్ హ్యుగో రచన ' ది కండెమ్నడ్ ' కి తెలుగు అనువాదం), ఆకలి((నోబెల్ బహుమతి గ్రహీత నట్ హాంసన్ రచన ' హంగర్ ' కి తెలుగు అనువాదము). .జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితో, మనసుకి ఒక దుఃఖపు తెరో తాకినప్పుదు వెంటనే మనసు జ్ఞాపకపు పొరల నుంచి ఏదో ఒక పుస్తకాన్ని గుర్తు చేస్తుంది. అది తీసుకొని చదివాక, దాని నుండి ఏదో ఒక గొప్ప బలం వచ్చేది. ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి దొరికినట్టనిపించేది. 1995 లో అలా ఒక మానసిక సంఘర్షణని తట్టుకునే శక్తి నాకు ' అన్నా కెరినినా ' ఇచ్చింది. ఇక కళాపూర్ణోదయం, మాళవికాగ్నిమిత్రం,క్రీడాభిరామం చదివినప్పటి అనుభూతులు అందరికి పైకి చెప్పేవి కావు పదిలంగా పుస్తకంలో నెమలీకల్లా దాచుకోవాల్సినవే. ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో ఒక్కో దశలో ఒక్కో పుస్తకం నిజమైన స్నేహితునిలా ఓదార్చేది. అమ్మలా ఆదరించేది. రహస్య ప్రణయంలా కొన్ని తీపి కలలనిచ్చేవి.
అందుకే నాశనం లేని అక్షరానికి, ఆదిగురువైన కన్న తండ్రికి అంజలి ఘటిస్తూ.....

కల్పనారెంటాల

9 వ్యాఖ్యలు:

భావన said...

చాలా బాగా చెప్పేవు కల్పన. ఎక్కడుంది నా బాల్యం, దాగుడు మూతల దోబుచులాటలో మాయ మయ్యిందేమో ... మాయమైన అక్షరాల చాటున దాచిన నిట్టూర్పుల సవ్వడుల వూర్పుల వుప్పెనల గాలికి ఎగిరి పోయిందేమో .... చాలా బాగా చెప్పేవు.. పుస్తకమే స్నేహమై, ఆ స్నేహమిచ్చే ఆలోచన, ఓదార్పు, ఆలోచన, ఆవేదన, ఆనందం అనుభవిస్తే కాని తెలియని ఒక జీవ రహస్యం. ఆ అక్షరానికి, అది మీకు అందించిన మీ నాన్న గారి కి నా అంజలి కూడా.

శ్రీలలిత said...

పుస్తకం ఎప్పుడూ మనకి తోడుండే మంచి మిత్రుడన్నవిషయం మీ టపా చదివిన తరవాత మరింత బలపడింది. మా నాన్నగారు కూడా మీ నాన్నగారి లాగే సంగీత, సాహిత్యాల పట్ల మక్కువ కలిగినవారు. పిల్లలందరికీ వాటి మీద అభిరుచిని పెంచారు. అత్తవారింటికి వస్తుంటే ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. అవి ఇప్పటికీ అంటే ముఫ్ఫై అయిదు సంవత్సరాలయినా కూడా గుర్తు చేసుకుంటే, ఇన్నేళ్ళ సంసారయాత్ర లో అప్పుడు చాదస్తంగా అనిపించినవి ఎంత నిజమా అనిపిస్తుంది. అవేమిటంటే..
"అమ్మాయీ, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి కాదు. ఇల్లాలివి. సంసార మన్నాక కష్టం సుఖం రెండూ వుంటాయి. కష్టమొచ్చినప్పుడల్లా అమ్మా, నాన్నా వచ్చి నీకు సాయం అందివ్వడం వీలుపడక పోవచ్చు. అది నీ ఇల్లు. నువ్వే సద్దుకోవాలి. మనసుకి కష్టం వచ్చినప్పుడు, మేం గుర్తొచ్చినప్పుడు వీణ వాయించుకో. లేదా ఒక మంచి పుస్తకం చదువుకో. అప్పుడే నిన్ను నువ్వు బేలన్స్ చేసుకోగలవు. లేకపోతే నీ విసుగంతా పిల్లల మీద పడుతుంది, లోకువ వాళ్ళే కనుక. పిల్లల్ని విసుక్కోవడం అన్నంత నేరం మరొకటి లేదు. అందుకని నీ పిల్లల్ని బాగా పెంచుకోవాలంటే నీ నేస్తాలు వీణ, పుస్తకమే"
అన్నారు.
ఏమిటో కల్పనా,
మీ నాన్నగారి గురించి చదివిన తర్వాత మా నాన్నగారి మాట గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయనకి తొంభై అయిదేళ్ళు.
ఇప్పటికీ ఆయన పని ఆయన చేసుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ వుంటారు. ఎప్పుడు చూసినా ఆయన దగ్గర ఇంకా ఏదో నేర్చుకునేది వుంటూనే వుంటుంది.
మా నాన్నగారి గురించి ఇలా రాయడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.

cbrao said...

మీ నాన్న గారు వేసిన జ్ఞానమొలక మీలో పెద్దదైనందుకు ప్రమోదం. ఈ వ్యాసం పెంచి బుద్ధులు చెప్పిన నాన్న కు గౌరవ కృతజ్ఞతాంజలి. ఒకరి స్నేహితులు, చదివే పుస్తకాల ఆధారంగా వారెటువంటివారో అంచనా వెయ్యవచ్చు. మనము చదివే పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలవు. సుసాంగత్యం మనలోని విలువలను పెంచుతుంది.

ప్రేరణ... said...

చాలా బాగాచెప్పారు...ఎక్కడుంది నా బాల్యం, దాగుడు మూతల దోబుచులాటలో మాయ మయ్యిందేమో ...

మాలతి said...

అమ్మో, కల్పనా, నీచదువు అనుభవాలు చదువుతుంటే, నాకు ఈర్ష్యగా ఉంది. నాన్న చెప్పినకథలు అని మరొక సీరీస్ మొదలపెట్టొచ్చేమో. నిజంగా ఆర్ద్ర్రంగా ఉంది. అభినందనలు.

మరువం ఉష said...

కల్పన, జ్ఞాపకాలు/స్మృతులు ఇచ్చే బలిమి ఇదే కదా. ఇన్నేళ్ళైనా మీ జీవితపుస్తకంలో చెదరని పుటగా మిగిలిన ఇవన్నీ పంచుకున్నందుకు ధన్యవాదాలు. తల్లీ,తండ్రీ పాత్ర అక్షరం మాదిరే eternal. పుస్తకం గురించి ఇక చెప్పేదేముంది. మీ నాన్నగారితో పాటుగా అటువంటి పెంపకం ఇచ్చిన పెద్దలందరికీ, శిక్షణనిచ్చే గురువులకి నా వందనం.

కొత్త పాళీ said...

very nice.
విష్వక్సేనుడు పలకడం, స్థితప్రజ్ఞుడనే మాటకి అర్ధం తెలీడం .. నిజమే ఏంటో చాలా చిన్న విషయాలు కదా! :)
పాపపుణ్యాల మీద నమ్మకం ఎప్పుడో పోయినా ఇప్పటికీ కాలు ఏ పుస్తకానికో కాయితానికో తగిల్తే మనసు విలవిల్లాడుతుంది నాక్కూడా.

Anonymous said...

కల్పనా,

తొలి పుస్తక ప్రణయం, మలి పుస్తక ప్రణయం, ఆ తర్వాతి పుస్తక ప్రణయం..., ఒకసారి పుస్తకాన్ని ప్రేమించడం నేర్చుకుంటే, అది బతుకంతా నిలుస్తుంది. అది బతుకంతా తోడుంటుంది. ఎన్ని బతుకుల అనుభవాలో, ఒక్క బతుకులోనే విచ్చుకున్న అనుభూతులు. చాలా బాగుంది కల్పనా.

కొత్త పాళి గారు,

"పాపపుణ్యాల మీద నమ్మకం ఎప్పుడో పోయినా ఇప్పటికీ కాలు ఏ పుస్తకానికో కాయితానికో తగిల్తే మనసు విలవిల్లాడుతుంది నాక్కూడా." ఎంత బాగా చెప్పేరండీ. ఎప్పుడో నాలుగైదు తరగతుల్లోనే దేవుడిని వదిలేసినా, నాకూ అట్లనే అనిపిస్తుంది. తరతరాల నమ్మకాలకి ఎంత బలవో కదా.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

S said...

"ఈ ప్రపంచంలో నదుల పేర్లు పెట్టుకోని ఆడపిల్లల జీవితాలు కూడా లాటరి టికెట్ల లాంటివని ఆయనకు తెలియలేదు."
-How true!
ఇంతకీ, పుస్తకం.నెట్ లో ఈ వ్యాసం ఎందుకు రాయలేదని అదుగుతున్నా అధ్యక్షా!!

నాకూ పుస్తకాలతో పరిచయం నాన్నతోనే మొదలు. స్నేహం: మా నాన్న పుస్తకాలను సర్దడంలో సెక్రటరీగిరీ చేపట్టాకే బలపడింది. అది గుర్తొచ్చింది ఈ వ్యాసం చదువుతూ ఉంటే.

 
Real Time Web Analytics